సొంత పార్టీ వాళ్లతోనే మమతా పాలనకు మరకలు ?
x

సొంత పార్టీ వాళ్లతోనే మమతా పాలనకు మరకలు ?

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా డైలామాలో పడ్డారా? సొంత పార్టీ వాళ్లే ఆమెకు చెడ్డపేరు తెస్తున్నారా? ఇటీవల జరిగిన ఘటనలతో టీఎంసీ చీఫ్ అలర్ట్ అయ్యారా?


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల పార్టీ, పాలన ప్రతిష్టను మెరుగుపరుచుకోడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కొందరి వ్యవహార శైలి.. ఆమె పాలనకు చెడ్డపేరు తెచ్చిపెడుతున్నాయి.

మంగళవారం వైరల్ అయిన ఒక వీడియో క్లిప్‌లో సీనియర్ TMC నాయకుడు జయంత్ సింగ్, ఆయన సహచరులు నార్త్ 24 పరగణాస్‌లోని కమర్‌హతిలోని క్లబ్‌లో ఒక మహిళను పట్టుకుని కొట్టడం కనిపించింది. అంతకు ముందు మరో వీడియోలో అదే జిల్లాలోని అరియాదహాలో ఒక యువకుడు, ఆయన తల్లిపై కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలోనూ జయంత్ సింగే ప్రధాన నిందితుడు. ఈ ఘటనలు ప్రతిపక్షాలకు బలం చేకూర్చే అవకాశం ఉంది.

TMC కార్యకర్త, తజిముల్ ఇస్లాం అలియాస్ JCB నార్త్ దినాజ్‌పూర్‌లోని చోప్రాలో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ..మహిళతో పాటు మరో వ్యక్తిని బహిరంగంగా కొట్టడం కనిపించింది.

జల్పైగురి జిల్లా ఫుల్బరిలో ఒక గృహిణి వివాహేతర సంబంధం పెట్టుకుందని అదే ప్రాంతానికి చెందిన మహిళా TMC నాయకురాలు స్వప్న అధికారి నిందమోపింది. తర్వాత అవమానభారంతో సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది.

గత 15 రోజులలో బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలలో వెలుగుచూసిన ఈ ఘటనలు రాష్ట్రంలో పోలీసులు, ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తి చూపాయి. ఈ ఘటనలపై టిఎంసి చీఫ్ మమత సీరియస్‌గా అయ్యారు. ఈ తరహా ఘటనల్లో ప్రమేయం ఉందని తేలితే.. పార్టీలో ఏ స్థాయివారినైనా ఉపేక్షించేదిలేదని పార్టీ చీఫ్ హెచ్చరించారు.

ఇద్దరూ నేరచరితులే..

ఇస్లాం, సింగ్ ఇద్దరూ నేర చరిత్ర ఉన్నవారే. గత ఏడాది సీపీఐ(ఎం) కార్యకర్త హత్య చేసిన కేసులో ఇస్లాం నిందితుడు. ఆయనపై ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇక సింగ్‌పై హత్య, హత్యాయత్నం, దాడి సహా తొమ్మిది కేసులున్నాయి. గతేడాది జూన్‌లో బిల్డర్‌ అరిత్ర ఘోష్‌పై కాల్పులు జరిపినందుకు సింగ్‌ను అరెస్టు కూడా చేశారు.

రాజకీయ పలుకుబడి కారణంగా ఇద్దరిపై కేసులున్నా.. జైలులో పెట్టడం సాధ్యం కాలేదు. కొన్ని నెలల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ భీభత్సం సృష్టించారు.

క్రూరత్వానికి అద్దం పట్టే ఈ ఇద్దరి వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. రాజకీయ నాయకులతో వారికి ఉన్న అండదండల వల్ల శిక్ష పడుతుందా? అని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కొరడా దెబ్బల వీడియోను వైరల్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి సలీం మాట్లాడుతూ..అమానుష ఘటనలకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే కేసులు బనాయిస్తున్నారని, రాష్ట్రంలో పోలీసులు, టీఎంసీ నేరగాళ్లతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ నేతలతో సత్సంబంధాలు..

సందేశ్‌ఖాలీకి చెందిన టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్ దురాగతాలు ఇటీవల బయటకు వచ్చాయి. కానీ ఇలాంటి వారికి భయపడి బాధితులు నోరు విప్పరు. పోలీసులు కళ్ళుమూసుకుంటారు. ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు పట్టించుకోరు.

ఎమ్మెల్యే హమీదుల్ రెహ్మాన్‌కు సన్నిహితుడు ఇస్లాం చోప్రా. పార్టీ అధిష్టానం ఒత్తిడి మేరకు ఎమ్మెల్యే ఇస్లాంను దూరంగా ఉంచినట్లు సమాచారం. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. ఇస్లాం చోప్రా టీఎంసీకి లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చిపెట్టారన్న విషయం మర్చిపోలేదు. చోప్రా అసెంబ్లీ నియోజకవర్గం డార్జిలింగ్ లోక్‌సభ స్థానంలో భాగంగా ఉంది.

ఇక జయంత్ సింగ్.. టిఎంసి కమర్హతి ఎమ్మెల్యే మదన్ మిత్రకు సన్నిహితుడు. ఇప్పుడు జయంత్ సింగ్‌కు పోలీసులు, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ రక్షణ కల్పిస్తున్నారని మదన్ మిత్ర ఆరోపించారు. తల్తాలా క్లబ్‌లో జయంత్‌సింగ్‌ అక్రమాలకు పాల్పడుతున్నాడని తెలిసినా.. పోలీసులు చర్య తీసుకోలేదని మిత్రా పేర్కొంటున్నారు. చర్య తీసుకోవాలని పోలీసులను చెప్పినా ఎంపీతో మాట్లాడాలని చెప్పేవాళ్లు అని మిత్రా చెబుతున్నారు. మిత్రా ఆరోపణలపై వ్యాఖ్యానించేందుకు రాయ్ నిరాకరించారు.

ఎన్నికల అనంతర హింస..

ఈ ఓటరు మార్కింగ్ యొక్క ఒక పర్యవసానమేమిటంటే, పార్టీ ఆధిపత్యాన్ని స్థాపించడానికి లేదా నిలుపుకోవడానికి ఎన్నికల ముందు లేదా పోస్ట్ తర్వాత రాజకీయ హింస. ఇక్కడ కండరాలు పని చేసేవారి ప్రయోజనం వస్తుంది.

“మేము అధికారంలో ఉన్న పార్టీకి సహకరిస్తే, మాకు ఎటువంటి సమస్య ఉండదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మాకు వస్తాయి. అలాకాకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇబ్బందిపెడతారు ”అని బీర్భూమ్ జిల్లాలోని బోల్పూర్ వద్ద కచారి పట్టి నివాసి చెప్పారు.

బీజేపీ ఓటర్లపై దాడి..

“బోల్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని బూత్ నంబర్ 222కి చెందిన ఇద్దరు ఓటర్లు బలరామ్ మల్, మోహన్ బారుయ్ ఇంటిపై జూన్ 4 రాత్రి TMC గూండాలు దాడి చేశారు. పార్టీతో నేరుగా సంబంధం లేకున్నా..వీరిద్దరూ బీజేపీకి ఓటు వేశారు’’ అని బీజేపీ నాయకుడు ధర్మేంద్ర రజక్ ఆరోపించారు.

ఈ తరహా ప్రతీకార చర్యలు ఎన్నో ఉన్నాయి. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి పోలింగ్ అనంతర హింసపై పోలీసులు దాదాపు 100 కేసులు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో హౌసింగ్ కాంప్లెక్స్‌ సొసైటీ నుంచి తగినన్ని ఓట్లు పడలేదని.. కోల్‌కతాలోని ఉల్తాదంగాలోని ఇళ్లపై టీఎంసీ ఆటో యూనియన్ నాయకులు దాడి చేశారు.

ఇన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నా.. టీఎంసీలో మార్పు అయితే రాలేదనే చెప్పాలి.

Read More
Next Story