Infant killed by mother
x

మందు కోసం బిడ్డను అమ్ముకున్న కన్నతల్లి

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మద్యం కోసం వారం రోజుల మగ శిశువును రూ. 1.70 లక్షలకు విక్రయించిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


కన్నప్రేమ కలుషితమైంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ కంటే మద్యమే ఆ తల్లికి ఎక్కువైంది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తాగుడుకు డబ్బుల కోసం వారం రోజుల మగ శిశువును ఆ కసాయి తల్లి విక్రయించింది. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

లింగసానిపల్లి తాండాకు చెందిన మంజుల, మహిపాల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఫిబ్రవరి 10న ఆమె మెదక్ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మద్యానికి బానిసైన మంజులకు మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేవు. దీంతో తన ప్రియుడితో కలిసి బిడ్డను అమ్మేయాలని నిర్ణయించుకుంది. పుట్టిన వారం రోజులకే ఆ పసికందును కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులకు రూ. 1.70 లక్షలకు విక్రయించింది.

అంగన్‌వాడీ టీచర్ అప్రమత్తతతో ఈ పాపం బయటపడింది. బాలింతకు ఇవ్వాల్సిన పోషకాహారం అందించడానికి టీచర్ ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ శిశువు కనిపించకపోవడంతో ఆమెకు అనుమానం కలిగింది. వెంటనే ఐసీడీఎస్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా అసలు నిజం బయటపడింది.

ప్రస్తుతం అధికారులు శిశువును, తల్లి మంజులను సఖి కేంద్రానికి తరలించారు. మహిపాల్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మంజులతో ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పసికందుల రక్షణపై సమాజంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story