
నాసిక్లోని రామ్కుండ్లో ప్రధాని మోదీ పూజలు.. విశేషమేంటి?
ప్రధాని మోదీ మహారాష్ట్రలోని నాసిక్లో ఈ రోజు (జనవరి 12) పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్లడానికి కారణమేంటి? ఆయన వెంట ఎవరెవరు ఉన్నారు?
ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని నాసిక్లో రోడ్షో నిర్వహించారు. హోటల్ మిర్చి చౌక్ నుంచి ప్రారంభమైన రోడ్షోలో, ప్రధాని వెంట సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. మోదీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది రోడ్ల మీదకు చేరుకున్నారు. కళాకారుల ప్రసిద్ధ 'నాసిక్ ధోల్' వంటి ప్రత్యేక బృందాలు, గిరిజనుల ప్రదర్శనలు రోడ్ షోలో ఆకట్టుకున్నాయి. దాదాపు 35 నిమిషాల పాటు సాగిన రోడ్షో 2 కిలోమీటర్ల దూరం సాగిన రోడ్ షో సంత్ జనార్దన్ స్వామి మహరాజ్ చౌక్ వద్ద ముగిసింది.
గోదావరి నది ఒడ్డున ప్రధాని పూజలు..
రోడ్షో తర్వాత, మోదీ గోదావరి నది ఒడ్డున ఉన్న రామ్కుండ్కు చేరుకున్నారు. అక్కడ నాసిక్ పురోహిత్ సంఘ్ అధ్యక్షుడు సతీష్ శుక్లా ఆయనకు సంప్రదాయ ‘పగ్డీ’ (తలపాగా) చుట్టారు. ప్రధాని 'జల్ పూజ', 'ఆర్తి' నిర్వహించాక అఖిల భారతీయ స్వామి సమర్థ్ గురుకుల్ పీఠ్ చీఫ్ అన్నాసాహెబ్ మోరే, నాసిక్లోని కైలాస్ మఠానికి చెందిన స్వామి సంవిద్నంద సరస్వతి, బీజేపీ ఆధ్యాత్మిక విభాగానికి చెందిన తుషార్ భోసలేను కూడా కలిశారు. తరువాత పంచవటి ప్రాంతంలోని ప్రసిద్ధ కాలరామ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
మందిరంలోకి దళితులకు ప్రవేశం కల్పించాలని 1930 మార్చి 2న బీఆర్ అంబేద్కర్ ఈ ఆలయం దగ్గర నుంచే నిరసన ప్రదర్శన మొదలుపెట్టారట. నాసిక్లో జాతీయ యూత్ ఫెస్టివల్ను ప్రారంభించాక రాష్ట్రంలో రూ.30 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించనున్నారు. రూ. 17,840 కోట్ల వ్యయంతో నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)ని ప్రధాని ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవం అనంతరం నవీ ముంబైలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు.