భర్తకు కాకుండా పింఛన్‌ సంతానానికి వచ్చేలా చేయొచ్చు..
x

భర్తకు కాకుండా పింఛన్‌ సంతానానికి వచ్చేలా చేయొచ్చు..

మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు వారు తమ భర్తకు బదులుగా కొడుకు లేదా కూతురిని నామినీగా ఎంచుకోవచ్చు.


మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు వారు తమ భర్తకు బదులుగా కొడుకు లేదా కూతురిని నామినీగా ఎంచుకోవచ్చు. వైవాహిక బంధంలో ఇబ్బందులుంటే పెన్షన్‌ భర్తకు కాకుండా పిల్లలకు వచ్చేలా చేయొచ్చని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ కొత్త రూల్స్‌ని ప్రకటించింది.

విడాకులు, గృహ హింస, వరకట్నం కేసులు కోర్టులో పెండిరగ్‌లో ఉంటే కుంటుంబ పెన్షన్‌ పొందేందుకు మహిళా ఉద్యోగి భర్తను కాకుండా తన పిల్లలను నామినేట్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఒకవేళ పిల్లలు మైనర్లయినా, దివ్యాంగులైనా ఆ పెన్షన్‌ పిల్లల సంరక్షకులకు వెళ్తుంది. మేజర్లయిన తర్వాత వారు నేరుగా పెన్షన్‌ పొందుతారు.

కొత్త నిబంధన..

సీసీఎస్‌ (పెన్షన్‌) రూల్స్‌ 2021లోని సబ్‌ రూల్స్‌ 8, 9 ప్రకారం.. ప్రస్తుతం కుటుంబ పింఛను ప్రభుత్వోద్యోగి మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి మొదట మంజూరు అవుతుంది. అయితే ఆ ఉద్యోగి జీవిత భాగస్వామి మరణిస్తే లేదా ఇతర కారణాల వల్ల అనర్హలైతే అప్పుడు ఆ ఉద్యోగి పిల్లలు, ఇతరు కుటుంబ సభ్యులు అర్హులవుతారు. కాగా ఒక మహిళా ప్రభుత్వోద్యోగి తన అర్హతగల బిడ్డ/పిల్లలను కుటుంబ పెన్షన్‌ కోసం నామినేట్‌ చేయడానికి అనుమతించాలని పెన్షన్‌, పెన్షనర్ల సంక్షేమ శాఖ మంత్రిత్వ నుంచి భారీగా సూచనలు వస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముఖ్యంగా వైవాహిక విభేదాల సందర్భంలో జీవిత భాగస్వామి స్థానంలో పిల్లలకు పెన్షన్‌ అందేలా నామినేషన్‌కు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నామినేషన్‌ నిబంధనల్లో మార్పులు చేసింది.

నామినేషన్‌ ఎలా..

మహిళా ఉద్యోగి తన జీవిత భాగస్వామితో బంధం సరిగా లేనపుడు లేదా కోర్టులో విడాకుల కేసు పెండిరగ్‌లో ఉన్నపుడు, జీవిత భాగస్వామి స్థానంలో కుటుంబ పెన్షన్‌ పొందేందుకు మహిళా ఉద్యోగి తమ పిల్లలను నామినేట్‌ చేయొచ్చు. స్త్రీ తన భర్తపై గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం లేదా వరకట్న నిషేధ చట్టం లేదా భారతీయ శిక్షాస్మృతి కింద కేసు నమోదు చేసినట్లయితే పిల్లలకు పెన్షన్‌ ఇవ్వవచ్చు. మహిళా ఉద్యోగి మరణించిన సందర్భంలో తన పిల్లలకు పెన్షన్‌ ఇవ్వాలని సంబంధిత కార్యాలయానికి రాత పూర్వకంగా ముందే అభ్యర్థన చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కొత్త రూల్స్‌ ప్రకారం దరఖాస్తు చేసుకున్న మహిళా ఉద్యోగి మరణానంతరం ఆమె పిల్లలు మైనర్లయితే సంరక్షకుడికి కుటుంబ పెన్షన్‌ అందుతుంది. వారు మేజర్లయిన తర్వాత వారే నేరుగా తీసుకునే అవకాశం ఉంటుంది.

Read More
Next Story