Actor Prathyusha case
x

నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డికి శిక్ష ఖారారు

23 ఏళ్ల తర్వాత తీర్పు. గుడిపల్లి సిద్ధార్థరెడ్డి వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. విషప్రయోగమే కారణమని స్పష్టం.


ఇరవై మూడు ఏళ్లుగా కొనసాగుతున్న ప్రత్యూష కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆత్మహత్య ప్రేరేపణ నేరంలో దోషిగా తేలిన గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి వేసిన అప్పీల్‌ విచారించిన జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన బెంచ్ కొట్టివేసింది. హత్య ఆరోపణలు చేసిన తల్లి సరోజినీ దేవి పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్దార్థ్ రెడ్డిని ఆదేశించింది. గొంతు నులిమి హత్య జరిగిందనే వాదనను కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. ప్రత్యక్ష సాక్ష్యాలు, వైద్య ఆధారాలు విషప్రయోగమే మరణ కారణమని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది.

బెంచ్ పరిశీలనలో పలు అంశాలు నమోదు చేసింది. గొంతు నులిమి హత్య జరగలేదని తేల్చింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ప్రకారం విషప్రయోగమే మరణ కారణమని తెలిపింది. అప్పీలెంట్‌పై అత్యాచారం నేరం రుజువు కాలేదని పేర్కొంది. ఆలస్య దశలో అత్యాచారం, గొంతు నులిమి ఆరోపణలు చేయడం సాధ్యం కాదని గమనించింది. ప్రమాదవశాత్తు విషం తీసుకున్నట్లు చేసిన వాదనను తిరస్కరించింది. న్యూరోంటోన్ కొనుగోలు ద్వారా ఆత్మహత్య ప్రేరేపణ స్థాపితమైందని వెల్లడించింది.

కేసు వివరాల ప్రకారం ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి మధ్య సంబంధం ఉండేది. ఆ సంబంధాన్ని అతని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇద్దరూ కలిసి విషం సేవించినట్లు కేసు వాదన. అయితే సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. తరువాత అతనిపై ఆత్మహత్య ప్రేరేపణ, ఆత్మహత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2004లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శిక్షను రెండు సంవత్సరాలకు తగ్గించింది.

ఆత్మహత్య ప్రేరేపణ దోషి తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ సరోజినీ దేవి కూడా సుప్రీం కోర్టుకు వెళ్లారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి విషం ఇచ్చారని ఆమె ఆరోపించారు. విచారణ సమయంలో అప్పీలెంట్‌కు బెయిల్ మంజూరైంది. విచారణలో భాగంగా డాక్టర్ బి. ముని స్వామి ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదికను కోర్టు కోరింది. ఆయన మరణ కారణం గొంతు నులిమి అని అభిప్రాయపడ్డారు.

అయితే ట్రయల్ సమయంలో ఆయనను సాక్షిగా పరీక్షించలేదని కోర్టు గమనించింది. ఆయన నివేదిక వృత్తి ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొంది. ఆ నివేదిక ముందుగానే ఉద్దేశపూర్వకంగా ప్రచురించడంతో పరిణామాలు ఏర్పడ్డాయని తెలిపింది. అత్యాచారం ఆరోపణలను కోర్టు తిరస్కరించింది. పరస్పర ఆత్మహత్య ఒప్పందంలో బతికిన భాగస్వామి చట్టపరంగా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. పై కారణాల దృష్ట్యా అప్పీల్‌ను ఖర్చులపై ప్రత్యేక ఆదేశాలు లేకుండా కొట్టివేస్తున్నామని పేర్కొంది. అప్పీలెంట్ నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.

Read More
Next Story