
రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సప్లై చేసిన అభిషేక్ దొరికేశాడు
రోహిత్ రెడ్డికి అభిషేక్ ఇప్పటి వరకు 24సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అధికారులు కనుుగొన్నారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈకేసులో డ్రగ్స్ సప్లై చేసిన డ్రగ్ పెడ్లర్, ఇంజనీర్ అభిషేక్ సింగ్ ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. పైలట్ రోహిత్ రెడ్డి పార్టీకి కావాల్సిన డ్రగ్స్ను అభిషేక్ సింగే సరఫరా చేశాడు. కానీ వాటిని రోహిత్ నేరుగా కొనుగోలు చేయలేదు. వాటిని అభిషేక్ దగ్గర నుంచి రోహిత్ డ్రైవర్ శరత్ కొన్నాడని పోలీసులు తెలిపారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించిన నేపథ్యంలో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. దీంతో అన్ని కోణాల్లోదర్యాప్తు ప్రారంభించిన సిట్.. అసలు పార్టీకి కావాల్సిన డ్రగ్స్ను ఎవరు అందించారన్న అంశంపై ఫోకస్ పెట్టింది. కాగా నిందితుల్లో ఒకరైన కౌశిక్ రవి ఇచ్చిన సమాచారంతో అభిషేక్ను పట్టుకోవడానికి సిట్ రంగం సిద్ధం చేసింది.
నాలుగు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు ఎట్టకేలకు హైదరాబాద్లోనే అభిషేక్ను అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ రెడ్డికి అభిషేక్ ఇప్పటి వరకు 24సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అధికారులు కనుగొన్నారు. ఇటీవల పార్టీకి కావాల్సిన డ్రగ్స్ను రోహిత్ డ్రైవర్ శరత్.. హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర కొన్నాడు. ఆ తర్వాత ఆ డ్రగ్స్ను పార్టీలో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, పుట్టా మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి వినియోగించారు. వారిలో నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్తపరీక్షల్లో తేలింది. అంతేకాకుండా రోహిత్, రితేశ్, అర్జున్ రెడ్డి మాత్రం కొకైన్ను మద్యంలో కలుపుకుని తీసుకున్నారని వైద్య పరీక్షలు తేల్చాయి. వీరికి డ్రగ్స్ సప్లై చేసిన అభిషేక్ పట్టుబడటంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది.
అభిషేక్ దగ్గర నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారు అన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా అభిషేక్ ఫోన్ డేటాను కూడా సిట్ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది.

