కరుణానిధి శత జయంతి సందర్భంగా ఏం పంపిణీ చేస్తున్నారంటే..
x

కరుణానిధి శత జయంతి సందర్భంగా ఏం పంపిణీ చేస్తున్నారంటే..

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి సందర్భంగా తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పోర్ట్స్ కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.


తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆదివారం స్పోర్ట్స్ కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి 'కళైంజ్ఞర్ స్పోర్ట్స్ కిట్' అని పేరు పెట్టారు. ఉదయనిధి తాతయ్య, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎం కరుణానిధి శత జయంతి సందర్భంగా క్రికెట్, ఫుట్‌బాల్, సిలంబం, చెస్‌తో సహా వివిధ ఆటలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేయనున్నారు.

క్రీడాకారులను ప్రోత్సహిస్తాం..

రూ. 86 కోట్ల అంచనాతో మొత్తం 12,620 గ్రామ పంచాయతీలకు ఈ కిట్లను అందజేయనున్నారు. కరుణానిధి క్రీడాభిమాని అని, క్రికెట్, ఫుట్‌బాల్ లాంటి ఆటలను టీవీలో చూడటానికి ఇష్టపడేవారని గుర్తుచేశారు ఉదయనిధి స్టాలిన్. క్రీడలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. 'కళైంజ్ఞర్' (కరుణానిధి) పేరిట ఇప్పటికే ఎన్నో పథకాలు ఉండగా, క్రీడల పరంగా తొలిసారిగా ఆయన పేరిట ఇలాంటి పథకం అమలు కావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.ః

రూ.5కోట్లతో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌..

ఇదిలా ఉండగా, దాదాపు రూ. 5 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ను కూడా ఉదయనిధి ప్రారంభించారు. స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (ఎస్‌డిఎటి) కింద ఏర్పాటు చేసిన ఈ సెంటర్ లో గాయపడ్డ క్రీడాకారులకు పునరావాసం కల్పించడంలో సహాయపడుతుంది.

Read More
Next Story