కల్తీపై కఠిన చర్యలు: హైదరాబాద్‌లో ప్రముఖ ఫుడ్ చైన్లపై వరుస దాడులు
x
ఓ హోటల్ లో కుళ్లిపోయిన పండ్లు (ఫోటో కర్టసీ : తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం)

కల్తీపై కఠిన చర్యలు: హైదరాబాద్‌లో ప్రముఖ ఫుడ్ చైన్లపై వరుస దాడులు

పిస్టా హౌస్ నుంచి పిజ్జా హట్ వరకు… హైదరాబాద్‌లో ఆహార కల్తీ బహిర్గతం


హైదరాబాద్‌లో ఆహార భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తాపూర్‌లోని ప్రముఖ స్వీట్ షాప్ హల్దీరామ్ అవుట్ లెట్ లో బూజు, ఫంగస్ సోకిన, గడువు ముగిసిన స్వీట్లు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో నగరంలో ఆహార నాణ్యతపై మళ్లీ చర్చ మొదలైంది.


హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ హల్దిరామ్స్ అవుట్‌లెట్‌లో ఫిబ్రవరి 16వతేదీన బూజు, ఫంగస్ సోకిన స్వీట్లను పోలీసు యాంటీ ఫుడ్ కల్తీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని భావించిన కస్టమర్లు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అల్దీరాం స్వీట్ హౌస్‌పై బీఎన్‌ఎస్‌ చట్టంలోని సెక్షన్లు 79, 274, 275, 115(2), 131, 352 కింద కేసు నమోదు చేశారు. దుకాణం లో ఉన్న అనుమానాస్పద స్వీట్ల నమూనాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపించారు.
- పాలు, టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటి ఆహార పదార్థాల కల్తీ గురించి పలు ఫిర్యాదులు వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఒక వైపు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు, మరో వైపు పోలీసులు వరుస దాడులు చేస్తుండటంతో హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీ బాగోతాలు బట్టబయలయ్యాయి.
-హైదరాబాద్ నగరంలోని పది పిజ్లా అవుట్ లెట్లలో తుప్పుపట్టిన పరికరాలు, లైసెన్సు లేని కేంద్రాలున్నాయని తేలడంతో నోటీసులు జారీ చేశారు.
నగరంలోని 95 స్వీట్ షాపులపై దాడులు నిర్వహించి 60 కిలోలకు పైగా స్వీట్లు, పాలు, స్వీట్లలో సింథటిక్ రంగులు, కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని 90 బేకరీలపై కేసులు పెట్టారు.

పోలీస్ యాంటీ ఫుడ్ కల్తీ విభాగం

హైదరాబాద్ నగరంలో ఆహార భద్రత మెరుగుపరచడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడటానికి నగర పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ ప్రత్యేకంగా పోలీస్ యాంటీ ఫుడ్ కల్తీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఫుడ్ సేఫ్టీ అథారిటీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి పని చేస్తుంది. హైదరాబాద్‌లో ఆహార భద్రత తనిఖీ డ్రైవ్‌ను ముమ్మరం చేశారు. పలు దుకాణాలు, హోటళ్లలో ఆహార నమూనాల శాంపిళ్లను సేకరించి ఆహార భద్రతా ప్రయోగశాలకు పరీక్ష కోసం పంపారు.హైదరాబాద్ పోలీసు ఇన్ స్పెక్టర్ ఎన్ రంజిత్ కుమార్ గౌడ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ పోలీస్ ఆహార కల్తీ నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.పాలు, టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటి సురక్షితం కాని ఆహార పదార్థాల గురించి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఆహార భద్రత అమలును మెరుగుపరచడం, ప్రజారోగ్యాన్ని కాపాడటం దీని లక్ష్యం.

పిస్తా హౌస్ నుంచి పిజ్జా హట్ వరకు దాడులు

హైదరాబాద్ నగరంలో 2025వ సంవత్సరంలో పిస్తా హౌస్ నుంచి పిజ్జా హట్ వరకు ప్రధాన ఆహార సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. రెస్టారెంట్లు, బేకరీలు, డెయిరీలు, వీధి ఆహార కేంద్రాలపై తరచుగా దాడులు నిర్వహించారు. ఈ దాడులతో హోటళ్ల మూసివేతలు, సీజ్‌లు, జరిమానాలు విధించారు. నగరంలో మంచి పేరున్న స్వీట్ హౌస్‌లోనే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార పదార్థాల నాణ్యతపై సంబంధిత శాఖలు కఠినం గా తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి సదరు స్టోర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గడచిన మూడేళ్లలో 14,071 హోటళ్ల, ఆహార విక్రేతలపై దాడులు చేయగా 2,168 కల్తీ ఆహారం, అపరిశుభ్రవాతావరణంలో విక్రయించారని తేలింది. దీంతో వారికి జరిమానాలు విధించారు.

ఆహార కల్తీ అంటే ఏమిటి?

ఆహారంలో రసాయనాలు, కృత్రిమ రంగులు, ఆహారేతర పదార్థాలు కలిపి విక్రయించడాన్ని కల్తీ అంటారు. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, అలెర్జీలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి ఆరోగ్య ప్రమాదాలు సంభవించవచ్చు.పాలలో నీరు కలపడం, పాలలో స్టార్చ్ జోడించడం లేదా ఆహారంలో కృత్రిమ రంగులను ఉపయోగించడం కూడా కల్తీ కిందకే వస్తాయి.

ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో గత ఏడాది హైదరాబాద్ అంతటా 25 పిస్తా హౌస్ శాఖలపై ఆహార భద్రతా బృందాలు దాడి చేశాయి. అపరిశుభ్ర వంటగది, వాష్ ఏరియాలలో నిలిచిపోయిన మురుగునీరు, కప్పబడని చెత్తబుట్టలు, ఈగలు, అపరిశుభ్రమైన చిమ్నీలు, నేలపై నిల్వ చేసిన ఆహారాన్ని కనుగొన్నారు. అధికారులు ప్రయోగశాల పరీక్షల కోసం 23 నమూనాలను సేకరించారు. మాంసం నిల్వ చేసిన తుప్పు పట్టిన ఫ్రిజ్‌లతో పాటు కోల్డ్ స్టోరేజ్ రికార్డులు కనిపించలేదు.

అబ్సొల్యూట్ బార్బెక్యూ బహుళ అవుట్‌లెట్‌ లకు నోటీసులు

హైదరాబాద్ అంతటా 10 అబ్సొల్యూట్ బార్బెక్యూ శాఖలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ దాడి చేశారు. అధికారుల బృందాలు పునర్వినియోగ నూనె, తెగులు జాడలు, ఓపెన్ డస్ట్‌బిన్‌లు, వంటగదిలో సరికాని ఆహార కవర్‌లను కనుగొన్నాయి. అపరిశుభ్రత, కల్తీ ప్రమాదాలపై ప్రయోగశాల విశ్లేషణ కోసం సేకరించిన నమూనాలతో నోటీసులు జారీ చేశారు.

హైవే ఫుడ్ అవుట్‌లెట్‌లకు జరిమానాలు

జాతీయ రహదారులపై టాస్క్ ఫోర్స్ లేపాక్షి, మినర్వా,ఉత్సవ్ ధాబా వంటి 12 అవుట్‌లెట్‌లను తనిఖీ చేసి, గడువు ముగిసిన స్టాక్, పేలవమైన పారిశుధ్యం కారణంగా 107.5 కిలోల అసురక్షిత రొయ్యలు, చికెన్, పన్నరులను సీజ్ చేసింది. హైదరాబాద్ నుండి ప్రధాన మార్గాల్లో పరిశుభ్రత లోపాల కారణంగా విక్రేతలకు జరిమానాలు విధించారు.హైదరాబాద్ సమీపంలోని 75 గిడ్డంగులలో 1,903 యూనిట్ల గడువు ముగిసిన,తప్పుడు బ్రాండ్ చేయబడిన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తానికి అత్తాపూర్ ఘటన హైదరాబాద్‌లో ఆహార భద్రత వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ప్రముఖ సంస్థలే నియమాలను ఉల్లంఘిస్తే సాధారణ వినియోగదారుడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో, వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యంతో రాజీ పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేసి, ఆహార భద్రతపై నమ్మకం పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది.


Read More
Next Story