తెలంగాణ ఉద్యమ తొలి నవల విప్లవయోధులు ఆవిష్కరణ
x

తెలంగాణ ఉద్యమ తొలి నవల "విప్లవయోధులు" ఆవిష్కరణ

దీనిని తెలంగాణలో పాఠ్యపుస్తకం చేయాలి: బిఎస్ రాములు


1953లో ఎమ్.ఆర్.నాగం అనే రచయిత రచించిన ‘తెలంగాణ విప్లవ యోధులు’ అనే నవలను తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి శనివారం నాడు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు.

ఇప్పటి వరకు 1955లో వట్టికోట ఆళ్వార్ స్వామి రాసిన నవల ‘ప్రజల మనిషి’ నవలను తెలంగాణ మొదటి నవలగా ప్రచారం లో వున్నది. కానీ 1953 లో ముద్రితమైన ఎమ్.ఆర్. నాగం రాసిన ‘తెలంగాణ విప్లవ యోధులు’ నవల తెలంగాణ సాహిత్య చరిత్రలో మొదటి నవల అవుతుంది సంగిశెట్టి శ్రీనివాస్ ముందుమాటలో రాశారు. ఈ నవలను వారి కుటుంబసభ్యులు పునర్ముద్రించారు. తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ సాయుధ పోరాటం గురించిన అనేక వెలుగు చూడని అంశాలు ఈ నవలలో ఉన్నాయి. రజాకార్ల దురాగతాలు, సామాజిక పరిస్థితులు, సామాన్య జనం ఎదుర్కొన్న కష్టాలు వేదనలు, పార్టీల వైఖరులు, స్పస్టంగా ఈ కథలో ప్రతిఫలిస్తాయి. ఏడు దశాబ్దాలకు పైగా ఎక్కడా లభించని విలువైన రచనను నేటి తరానికి అందించడం, చరిత్రలో కలిసిపోతున్న ఒక చారిత్రక సాక్ష్యాన్ని తిరిగి వెలుగులోకి తేవడం, 90 ఏళ్ళ పైబడి వున్న రచయిత భార్య కి తొలికాపీ అందించాలన్న కోరికతో ఈ పునర్ముద్రణ చేపట్టడం విశేషం. ఈ సభలో రచయిత కుటుంబ సభ్యులందరు, రచయిత సహ ఉద్యోగులు, శిష్యులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ సభా కార్యక్రమం ఒక పండుగలాగా జరిగింది.

ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య చరిత్రను పునస్సమీక్ష చేయించాల్సిన అవసరాన్ని "విప్లవ యోధులు " నవల ముందుకు తెచ్చిందని నరసింహారెడ్డి అన్నారు.

ఈ సభకు తెలంగాణ ప్రముఖ రచయిత, తెలంగాణ తొలి బీసి కమీషన్ చైర్మన్ బిఎస్ రాములు అధ్యక్షత వహించి అధ్యక్ష తొలి పలుకులలో ఇది విద్యార్థులకు పాఠ్య పుస్తకంగా చేరవలసినది కనుక ఉపవాచకంగా పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి తొలికాపీని రచయిత సతీమణి శ్రీమతి నాగం సుశీలమ్మ (90) కి అందించారు.
ఈ నవలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన చరిత్ర పరిశోధకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నవల పై ఒక సెమినార్ నిర్వహించాలని అన్నారు. నల్గొండ కవి సీనియర్ కవి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఈ నవలలో ఉన్న చారిత్రక అంశాలను చర్చించాల్సి వున్నదని అన్నారు. నవల కాపీని భద్రపరిచి కుటుంబ సభ్యులకు అందించిన హెచ్ రమేష్ బాబు ఈ అవకాశం దొరకడం తమకు దక్కిన గౌరవం అన్నారు. తెలంగాణ అకాడమీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నామోజు బాలా చారి తర్వాత ముద్రణ బాధ్యత తెలంగాణ అకాడమీ తీసుకుంటుదని అన్నారు. బహుళ పత్రిక సంపాదకులు జ్వలిత సాహితీ కారులు తమ కుటుంబంలో సాహితీ వారసులను ఏర్పరుచుకోవలని, లేనట్లయితే తమ రచనలను భద్రత పరిచే వారుండరని, నవలా రచయి తకూతురు ఈ నవలను పునర్ముద్రించి ఆవిష్కరణ సభ నిర్వహించడం ఒక చారిత్రక సంఘటన అన్నారు. ఈ సభలో రచయిత్రులు సుజాత శేఖర్, బండారు విజయ, పైడిమర్రి గిరిజ, నాగం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
‘తెలంగాణ విప్లవ యోధులు’ అనే విశేషమైన నవలను పునర్ముద్రణకు పూనుకున్న నవలా రచయిత కుమార్తె సుమతి చురుకంటిని అందరూ ప్రశంసించారు. ఈ పుస్తకావిష్కరణ ఒక చారిత్రక ఉత్సవం.


Read More
Next Story