
బెంగళూర్ లో తెలంగాణ సాప్ట్ వేర్ దంపతుల ఆత్మహత్య
అనారోగ్యం, తీవ్ర నిరాశతో మొదట భర్త ఆత్మహత్య
బెంగళూర్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతులు తెలంగాణకు చెందిన భానుచంద్రా రెడ్డి, బీబీ షాజియా సిరాజ్ గా పోలీసులు గుర్తించారు. బెంగళూర్ లోని కోతనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది చోటు చేసుకుంది.
భానుచంద్రా రెడ్డి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన షాజియా తలుపులు ఎంతకు తెరవకపోవడంతో వాచ్ మెన్ సాయంతో డోర్లు విరగగొట్టి చూడగా భానుచంద్ర మరణించి కనిపించాడు. అతని మృతదేహం పై పడి విలపించిన తరువాత అదే అపార్ట్ మెంట్ లోని 17 వ అంతస్తు పైకి ఎక్కి దూకేసిందని పోలీసులు తెలిపారు. వీరు ఇద్దరు తొమ్మిది సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారని, అంతకుముందు సహజీవనం చేశారని తెలిసింది.
బెంగళూర్ లోని తానిసంద్ర మెయిన్ రోడ్డులోని భారతీ సిటీలో ఉన్న ‘నికిహోమ్’ అపార్ట్ మెంట్స్ లో ఈ జంట గత కొన్ని నెలలుగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం షాజియా ఐబీఎమ్ లో ఉద్యోగం చేస్తోంది. భానుచంద్ర అమెరికాలో ఉద్యోగం చేసేవాడని, అక్కడ ఉఫాది దొరకకపోవడంతో తిరిగి భారత్ కు వచ్చాడని తేలింది. ఇక్కడ కూడా సరైన ఉపాధి దొరకక తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక తరువాత కేసు ముందుకు సాగుతుందని చెప్పారు.
(ఆత్మహత్యలను నివారించవచ్చు. సాయం కోసం ఆత్మహత్య నివారణ హెల్ప్ లైన్ కు కాల్ చేయండి. నేహ ఆత్మహత్య నివారణ కేంద్రం: 044-24640050, ఆత్మహత్య నివారణ మానసిక మద్దతు ఆసరా హెల్ప్ లైన్: +91-9820466726, కిరణ్ మానసిక ఆరోగ్య పునరావాసం-18005990019, దిశ 0471-2552056, మైత్రి 0484-2540530, స్నేహ ఆత్మహత్య నివారణ హెల్ప్ లైన్044-24640050)
Next Story

