
తొండమాన్ పురంలో గరుడ వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి కటాక్షం
తిరుమల వేడుకలు
తిరుమల: తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి 07.00 గం.లకు గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించారు.
ఉదయం 06.00 గం.లకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తదుపరి మూలవర్లకు అభిషేకం, ఉదయం 9.30 గం.ల నుండి 11.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 05.00 గం.లకు వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న అభయహస్త ఆసీన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కల్యాణోత్సవం చేపట్టారు. రాత్రి 07.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు గరుడ సేవపై స్వామి వారు భక్తులను దీవించారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

