
బ్రదర్ అనిల్ కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకోలేదు?
మొత్తం గ్రౌండ్ అంతా ప్రెపేర్ చేశారు. తీరా చేరాల్సివచ్చే పాటికి ఆమెకు కండువా కప్పించారు, తను మాత్రం దూరం జరిగారు. ఎందుకిలా జరిగింది..
ఆమెను కాంగ్రెస్ లో చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేశారు, విదేశాల నుంచి హుటాహుటిన వచ్చి కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు సాగించారు. మొత్తం గ్రౌండ్ అంతా ప్రెపేర్ చేశారు. తీరా చేరాల్సివచ్చే పాటికి ఆమెకు కండువా కప్పించారు, తను మాత్రం దూరం జరిగారు. ఈ అరుదైన సంఘటన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో జరిగింది. కారణమేమిటో తెలియదు గాని వైఎస్ షర్మిల భర్త అనిల్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఖర్గే కప్పాలనుకున్నా కండువాను కప్పుకునేందుకు వెనకడుగువేశారు. ఇవాళ ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం తెలుగురాష్ట్రాలలో చర్చనీయాంశమైంది.
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదట వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పుతారు. ఆ తర్వాత రెండో కండువా ఇమ్మని ఖర్గే పార్టీ నాయకుడు కేసీ వేణుగోపాల్ను కోరడం, ఆ వెంటనే ఆయన పార్టీ కండువాను ఇవ్వడం జరుగుతుంది. అయితే కండువా కప్పుకుంటారని భావించిన షర్మిల భర్త అనిల్ ముందుకు రాకపోవడం స్పష్టంగా కనిపించింది. ఈ పరిస్థితిని గమనించిన షర్మిల.. ఖర్గేతో ఏదో చెప్పడంతో ఆయన అదేంటన్నట్టుగా చేతులు తిప్పుతూ ప్రశ్నిస్తారు. ఆ తర్వాత ఖర్గే కాంగ్రెస్ కండువాను వేణుగోపాల్కి తిరిగి ఇచ్చేస్తారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆ కండువాను తీసుకుని షర్మిల మెడలో వేస్తారు.
అయితే బ్రదర్ అనిల్ కాంగ్రెస్ కండువా కప్పుకోకపోవడానికి ప్రత్యేక కారణమేమీ లేదని షర్మిల సన్నిహితులు చెప్పారు. అనిల్ క్రిస్టియన్ సంస్థలలో పని చేస్తున్నందున ముందుకు రాలేదని, నిజమైన విశ్వాసులు ఎవ్వరూ ఒక పార్టీకి కట్టుబడి ఉండరని అన్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరడానికి సర్వం సిద్ధం చేసిన అనిల్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని అందరూ భావించడమే ఈ అపోహకు కారణమని షర్మిల అనుచరుడొకరు చెప్పారు.

