టెస్ట్ క్రికెట్ తిరిగి పుంజుకుంటుందా?
x

టెస్ట్ క్రికెట్ తిరిగి పుంజుకుంటుందా?

రేపటి నుంచి భారత్ - ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.


సాంప్రదాయ ఆట అయిన టెస్ట్ క్రికెట్ లో, ఇంగ్లీష్ టీమ్ ‘బజ్ బాల్’ వ్యూహన్ని అనుసరిస్తోంది. ప్రత్యర్థి పైకి ఎదురు దాడికి దిగి, అదే స్థాయిలో ఫలితాలు రాబడుతోంది. కానీ భారత్ తనదైన శైలిలోనే ఆడుతోంది. రెండు జట్ల మధ్య పోరు హోరా హోరీ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ మొదటి రెండు టెస్ట్ లకు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి దూరమవడం కొంచెం నిరుత్సాహ పరిచే విషయమే. విరాట్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవరు సరైన వారో టీమ్ మేనేజ్ మెంట్ ఇప్పటికే ఓ అంచనా కొచ్చే ఉంటుంది.

ఈ సిరీస్ ఏడు వారాల వ్యవధిలోనే ఐదు టెస్ట్ లు షెడ్యూల్ చేశారు. ఆటగాళ్లకు ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పటికే విపరీతమైన వన్డేలు, టీ20 సిరీస్ లు, మధ్యలో వచ్చే ఐపీఎల్, బిగ్ బాష్ వంటి ప్రైవేట్ లీగ్ లలో ఆటగాళ్లు పాల్గొంటూ తీరిక లేని క్రికెట్ ఆడుతున్నారు. ఇది వారీని మానసికంగా, శారీరకంగా అలసిపోయోలా చేస్తుంది. దీనితో వారి ఆటపై ప్రభావం చూపే అవకాశాలెక్కువ. వైట్ బాల్స్ క్రికెట్ లో లోపాలను కనిపెట్టడం కొంచెం కష్టసాధ్యమైన అంశం.

సాంప్రదాయా టెస్ట్ క్రికెట్ లో ఆటగాడు వరుసగా విఫలమవుతూ ఉంటే సాంకేతికంగా లోపం ఎక్కడ ఉందో కనిపెట్టి తిరిగి సాధన చేయాల్సి ఉంటుంది. అయితే ఇంత బిజీ షెడ్యూల్ లో అది సాధ్యం చేసుకుంటారా? లేకపోతే వాటిని వదిలేస్తారా? యువ ఆటగాళ్లు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు? ఇదీ గొప్ప చిక్కే ప్రశ్నే. మనం ఒకసారి గతంలోకి వెళ్లి విరాట్ కోహ్లి విఫలమైన సందర్భాన్ని గుర్తు చేసుకుందాం.

2014 లో టీమ్ ఇండియా, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. అప్పటికీ టెస్ట్ క్రికెట్ లోకి కోహ్లి అడుగుపెట్టి కేవలం మూడు సంవత్సరాలే అయింది. ఐదు టెస్ట్ సిరీస్ ల అనుభవం ఉంది. అయితే తనను తాను నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లపై కూడా సెంచరీలు బాదీ తన బ్యాటింగ్ జోరు చూపించాడు. కానీ ఏడు వారాల పాటు సాగిన ఈ సిరీస్ లో విరాట్ ఆఫ్ స్టంట్ బలహీనతలను గుర్తించిన ఇంగ్లీస్ బౌలర్లు, అదే ఆయుధంగా మార్చుకున్నారు. జేమ్స్ అండర్సన్ కే ఏకంగా నాలుగుసార్లు విరాట్ వికెట్ సమర్పించుకున్నాడు. సిరీస్ మొత్తంలో కేవలం 134 పరుగులు సాధించాడు. సగటు కేవలం 13.4, అత్యధిక స్కోరు 39.

కానీ తరువాత తన లోపాన్ని గుర్తించి ఆరు నెలల కాలంలో తిరిగి ఫాంలోకి వచ్చాడు. తరువాత జరిగిన సిరీస్ లలో అద్భుతంగా ఆడాడు. మళ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి తన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. సిరీస్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే పరిస్థితి ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లకు ఎదురైతే ఎలా పరిష్కరించుకుంటారు. ఇదీ కొంచెం కఠిన ప్రశ్నే.

టెస్ట్ క్రికెట్ సంఖ్యను తగ్గిస్తున్నారు

ఇటీవల కాలంలో బోర్డులు కూడా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఆటలో వాణిజ్య పరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం పెరగడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న వైట్ బాల్ క్రికెట్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకు అనుగుణంగానే షెడ్యూల్ జరుగుతోంది. భారత్ - దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా టీ20, వన్డేలు మూడు నిర్వహించగా, టెస్ట్ మ్యాచ్ ల సంఖ్య రెండింటికి పరిమితం చేశారు. భారత్ టెస్ట్ ల్లో నెంబర్ వన్ అయినప్పటికీ దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకూ టెస్ట్ సిరీస్ గెలవలేదు. అయినప్పటికీ రెండు జట్లు రెండు టెస్ట్ లకే పరిమితం చేశారు. ఫలితం సిరీస్ 1-1 తో సమం అయింది. మరో టెస్ట్ ఉంటే ఫలితం ఎలా ఉండేదో?

టెస్ట్ క్రికెట్ పునర్జీవం నింపేందుకు ఐసీసీ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. 2019 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించింది. ఏ జట్టు కూడా ఇతర జట్లతో ఒక సిరీస్ నిర్వహిస్తే కనీసం రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుందని నిబంధనలు విధించింది. అత్యధిక టెస్ట్ సిరీస్ కు ప్రత్యేకంగా నిబంధనలు ఏం లేప్పటికీ యాషెస్ లాంటి సిరీస్ ల కోసం వాటి సంఖ్యను ఐదుకు పరిమితం చేశారు. ఇదే బాటలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్ నడుస్తున్నాయి. అయితే చిన్న బోర్డులు కూడా ఇందులో పాల్గొనాలని ఐసీసీ భావించి టెస్ట్ ఛాంపియన్ సిరీస్ ను ప్రారంభించింది. రెండేళ్ల కాలవ్యవధిలో ప్రతి జట్టు మూడు స్వదేశీ, మూడు విదేశీ సిరీస్ లు ఆడాల్సిందేనని షరతు విధించింది.

అయినప్పటీకీ ప్రస్తుత పరిస్థితుల్లో టెస్ట్ మ్యాచ్ లను షెడ్యూల్ చేయడం కష్టంగా మారింది. సుదీర్ఘ ఫార్మాట్ లో ఆటగాళ్లపై ఎలాంటి మానసిక, శారీరక ప్రభావం పడకుండా చూసుకోవాలి. కొన్ని జట్లు ప్రత్యేకంగా ఒక్కో ఫార్మాట్ కి ఒక్కో జట్టును తయారు చేసే పనిలో ఉన్నాయి. "ప్రస్తుత పరిస్థితుల్లో షెడ్యూల్లో ఖాళీ వెతకడం కొంచెం కష్టమే, ఆటగాళ్లను సరైన విధంగా సన్నద్ధం చేయాలి. ఇంగ్లండ్ లాంటి కఠినమైన ప్రత్యర్థి ఎదురైతే కష్టం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ టెస్ట్ క్రికెట్ మజానే వేరుగా ఉంటుంది. కానీ తరుచుగా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడడం ఎవరికైన కొంచెం కష్టమే " అని భారత్ కోచ్ రాహూల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు అశ్విన్, జడేజా, షమీ, భూమ్రా, రాహూల్ లాంటీ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ను ఆస్వాదిస్తున్నారు. ఈ తరంలో ఉన్న గిల్, జైస్వాల్ లాంటి క్రీడాకారులు ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ ను ఆస్వాదిస్తారా? లేకపోతే పరిస్థితి ఏంటీ? ఏదీ ఏమైనా ఈ సిరీస్ మాత్రం రసవత్తరంగా ఉంటుంది. భారత స్పిన్ కు, ఇంగ్లండ్ బజ్ బాల్ తో సమాధానం చెబుతుందా... వేచిచూద్దాం.

Read More
Next Story