కాళేశ్వరం ప్రాజెక్టు కాలపరీక్షకు నిలిచేనా?
x

కాళేశ్వరం ప్రాజెక్టు కాలపరీక్షకు నిలిచేనా?

మేడిగడ్డ ప్రాజెక్ట్‌ పిల్లర్లు నిట్ట నిలువుగా చీలిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.


- రమణాచారి

మానవాళి నాగరికతా అభివృద్ధి అంతా నదీ తీరాల వెంటనే సాగింది. నదులపైన అడ్డుకట్ట నిర్మించి, నీటిని నిల్వ చేయడం, పిల్ల కాల్వలతో నీటిని మళ్లించి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడంగా మార్పు చెందింది. ఆయా సందర్భాల్లో నష్టాలు జరగకుండా ఉండేందుకు, ఎన్నో విధాలుగా రక్షణ చర్యలు చేపట్టేవారు. అందువల్లనే అలనాటి నిర్మాణాలు తరాల తరబడి నిలిచిపోయాయి.

ఒక చిన్ననిర్మాణం మొదలు పెట్టినా కూడా మట్టి నాణ్యత పరీక్ష, పునాది ఎంత లోతు ఉండాలి? పిల్లర్‌ ఎంత లోతు తవ్వాలి? ఎన్ని ఇంచుల మందపు స్లాబ్‌ ఉండాలి? ఎంత స్టీల్‌ వాడాలి? అని వాటి భద్రత కోసం ఎంతలా తపన పడతాం. ఉండే ఇల్లు అయినా, కట్టే ప్రాజెక్టు అయినా నమ్మకంతో బాధ్యత గల మేస్త్రీ/ కాంట్రాక్ట్‌ కు అప్పగిస్తాం. సుమారు రెండు వందల ఏళ్ళ కింద సర్‌ ఆర్థర్‌ కాటన్‌ అనే పరదేశీ ఇంజనీర్‌, గోదావరి తీరాన ‘‘బీడు భూములకు’’ నీళ్ళు ఉంటే పంటల బాగా పండటమే కాకుండా, ప్రజలనుంచి ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేయ వచ్చని బ్రిటిష్‌ పాలకులను మెప్పించి మరీ చరిత్రలో నిలబడి పోయే ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాడు. అదీ బాధ్యతగా చేసిన పని, అని గుర్తుఛేసుకోవడం ఎంతైనా అవసరం కదా !

ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టే సమయంలో..

గోదావరి పుట్టిన ప్రదేశం నుండి మొదలు పెట్టి, నది సముద్రంలో కలిసే వరకు అడుగు , అడుగునా నీటి ఉధృతి కొలతలు వేసి మరీ పరిగణలోకి తీసుకున్నారు. నది సముద్రంలో కలిసే చోట, వంపులు తిరిగే చోట , నీటి వేగం చాలా ఎక్కువగా ఉంటుందని గ్రహించి, ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశాన్ని నిర్ధారించాడు.

ఇంజనీరింగ్‌ పరిజ్ఞానం అంటే..

దవళేశ్వరం ప్రాజెక్టును మొదట పోలవరం దగ్గర ఆనకట్ట కడదామని అనుకున్నాడట. గోదావరి నీటి వడి అక్కడ ఎక్కువ ఉందని గ్రహించి, ఆ ప్రాంతంలో ఆనకట్ట నిర్మాణ ఆలోచనవిరమించుకుని, ధవళేశ్వరాన్ని ఎంచుకున్నాడు. ప్రస్తుత విషయానికి వస్తేలక్షలాది మందిని ఆదివాసీలను నిర్వాహసితులను చేసి వేల కోట్లు పెట్టి పోలవరం కడుతున్నారు. కానీ అది భధ్రమైనది కాదని ప్రపంచ జలవనరుల నిపుణులు ఎప్పుడో తేల్చి చెప్పారు కూడా. ఏదో ఒకరోజు దాని వలన జరగబోయే నష్టాన్ని ఊహించు కోవడానికే భయమేస్తోంది.

నీటి గుంటలలో, వాగులలో చేపలు పట్టేవాడు కూడా నీటికి ఎక్కడ అడ్డుకట్ట ఎక్కడ వేయాలి? నీళ్లు ఎలా బయటకు గుప్పాలి? అని ఆలోచన చేస్తాడు.లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, హడావుడిగా గోదారమ్మకు నడకలు నేర్పాలి అనుకుంటున్నారు. మొన్న వచ్చిన వరదలు, గతం లో ఎన్నడూ లేనంత గా వచ్చాయి . కానీ బ్రిటిష్‌ కాలం నాడు కట్టిన ప్రాజెక్టు నీట మునిగినా కూడా, తట్టుకుని నిలబడిరది.

మొహాంజోదారో నాగరికత మట్టిమనుషుల స్వేదం తో ఏర్పరచిన పురాతన జ్ఞాపకం. నదీ నాగరికత అంటేనే, మానవాళి మనుగడకు, వికాసానికి మూలం. ప్రజల నాగరికత కు ఏ నది జీవం పోసిందో, అదే నది తూడ్చిపెట్టిన ‘‘పురాతన జ్ఞాపకం’’ మహేంజో దారో నాగరికత అని మరువరాదు

మీకు తెలుసో, లేదో మరి.... మొహంజోదారో నాగరికత తూడ్చి పెట్టుకు పోవడానికి ప్రధాన కారణం, అవగాహన లేకుండా నదికి ఆనకట్ట కట్టడమే అని! చరిత్ర నిరూపించింది. అదీ నీళ్లకు ఉన్న శక్తి. మరి ‘‘మేడి గడ్డి’’ దగ్గర , ఎలాంటి వానలు వరదలు లేని సమయంలోనే ఆనకట్ట రెండు అడుగులు కుంగి పోయింది అంటే ?ప్రమాద తీవ్రత ను అర్ధం చేసుకోవచ్చు. ఇంజనీర్లు ఆనకట్ట కింద ఫిల్లింగ్‌ చేసి నిలబెడతాం అంటారేమో ?

కాళేశ్వరం ప్రాజెక్టు అంటే....

3 బ్యారేజీలు

15 రిజర్వాయర్లు

19 సబ్‌ స్టేషన్లు

21 పంప్‌ హౌజులు

203 కిలోమీటర్ల సొరంగాలు

1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్‌

98 కిలోమీటర్ల ప్రెజర్‌ మెయిన్స్‌

141 టిఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ

530 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయడం

240 టిఎంసీల ఉపయోగం...

అర్ధం అయ్యేది ఏమిటి? అంటే పైన పేర్కొన్న అన్ని నిర్మాణాలకు మూలమైనది, ప్రధాన కట్టడం మేడిగడ్డ. దాని ద్వారానే మిగతా అన్ని దారులకు నీళ్ళు వెళ్ళాలి. అంటే మొత్తం ప్రాజెక్ట్‌కు వెన్నెముక మేడిగడ్డ. అంత పెద్ద పిల్లర్‌లు కూడా,నిట్ట నిలువుగా చీలిపోయాయి అంటే ముందు ఉండే ప్రమాదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి.

వెన్ను పూస విరిగాక, మిగతావి ఉండేది ఏలా? ప్రాజెక్టు నిలబడేది ఎలా?

భారీ ప్రాజెక్టుల నిర్మాణం సరైనది కాదని పర్యావరణ వేత్తలు, ఉద్యమకారులు దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరగకుండా చూడాలని గగ్గోలు పెడుతున్నారు. ఈ నిర్మాణాల వలన పర్యావరణ సమస్య, భూకంపాల భయం, నిర్వాసితుల సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుందని బుద్ధిజీవులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రజాప్రయోజనాలను, పర్యావరణ వేత్తల సూచనలను పెడచెవిన పెడుతూ, కమీషన్ల కోసం కక్కుర్తి పడి,ఆర్భాటంగా నిర్మాణం చేస్తున్నారు . అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా ప్రచారం చేసిన, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, భవిష్యత్తు పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రధాన రాజకీయ ఎజెండా గా ముందుకు వచ్చిన తరుణమిది. ఇలాంటి ప్రత్యేక సందర్భంలో భారీ ప్రాజెక్టుల వల్ల కలిగే నష్టాన్ని ఎవరి నుండి, ఎలా పూడ్చాలి?అన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పాలకుల నుండా? కాంట్రాక్టు సంస్థల నుండా? ప్రాజెక్టు డిజైన్‌ చేసిన ఇంజనీర్ల నుండా? సీన్సియర్‌గా, సీరియస్‌గా ఆలోచించాలి.

Read More
Next Story