
తీరం చేరని బీసీ రిజర్వేషన్ల పడవ
అలా భావిస్తేనే బీసీ రిజర్వేషన్ల సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది.
అన్నీ ఉన్నాయి కానీ అల్లుని నోట్లో శని ఉంది అన్నట్లు వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల శాసన సభలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన విధానాన్ని ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనం కోసం కాకుండా సామాజిక బాధ్యతగా భావిస్తేనే బీసీ రిజర్వేషన్ల సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. బీసీ వర్గాల రిజర్వేషన్ల పడవ సురక్షితంగా తీరం చేరుతుంది. కానీ దేశంలోని అన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్లను గురించి తమ తమ మాధ్యమాలలో తమ తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అంచనా వేసుకుని మాట్లాడుతుంటున్నాయి. చిత్తశుద్ధితో అమలు చేయాలనే యోచన చేయడం లేదు.
ఇచ్చేవాని చెయ్యి పైన ఉన్నంతవరకు తీసుకునే వాని చెయ్యి కింద ఉన్నంత మేరకు ఇచ్చేవాళ్ళ దృష్టిలో తీసుకునేవాడు లోకువగానే ఉంటారు.ఈ సామాజిక సాంప్రదాయాన్ని తారుమారు చేసే వరకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అందని ద్రాక్ష పండ్లు పుల్లగానే ఉంటాయి. రిజర్వేషన్లు తమ హక్కుగా భావించి ఒక బలమైన సామాజిక ఉద్యమ నిర్మాణం జరగనంతసేపు పైవర్గాల యొక్క దయాదాక్షిన్యాల మీద వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు ఆధారపడవలసి ఉంటుంది. చివరికి అంతరాంతరాలలో దానధర్మాలకు సంబంధించిన అంశంగా పరిగణించబడుతుంది. నినాదాలు మంచిగానే ఉంటాయి కానీ పరిష్కరించడంలోనే చిక్కు అంతా ఉంటుంది. దీనికి పై వర్గాల వారిని నిందించే బదులు రాజకీయ పార్టీలలో ఉన్న వెనుకబడిన వర్గాల సబ్బండ కులాల వారు అంతర్మధనం చేసుకోవలసిన శక్తివంతమైన గొంతుగా అవతరించాల్సిన వాతావరణం ఏర్పడినది . ఇటువంటి అవకాశం దేశ చరిత్రలో బీసీలకు రెండోసారి అంది వచ్చింది.
ప్రస్తుతం 1952 నుండి 2024 వరకు జరిగిన 16వ లోకసభ ఎన్నికల ఫలితంగా ఏర్పడిన ప్రాంతీయ రాజకీయ పార్టీల రంగప్రవేశం ప్రభావాల కారణంగా కేంద్రంలో ఏర్పడిన మిశ్రమ ప్రభుత్వాల గురించి విశ్లేషించుకోవలసిన సమయం ఆసన్నమైనది. 1952 నుండి 1977 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నది.అయితే 25 ఏళ్లకే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేక జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో ఉద్యమం కారణంగా 1977లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనది . అనంతరం మొట్టమొదటిసారిగా వివిధ రాజకీయ పార్టీలతో కూడిన కాంగ్రెసేతర మిశ్రమ ప్రభుత్వం జనతా పార్టీ మురార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా రెండు సంవత్సరాల128 రోజులకే చీలిక వచ్చి, చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు ఆయన సైతం 170 రోజులకే పదవి వీడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినది . జనతా పార్టీ ప్రయోగం విఫలమైన అనంతరం ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చింది. కానీ పంజాబ్ ఉగ్రవాదుల చేతిలో మరణించింది.
ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కీలుబొమ్మ ప్రభుత్వాల ఏర్పాటుకు వ్యతిరేకంగా విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం పేరున తెలుగుదేశం ప్రాంతీయ పార్టీని 1983లో స్థాపించి కొద్దికాలంలోనే అధికారంలోకి వచ్చాడు. అప్పటికే తమిళనాడులో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్నది. కేరళ బెంగాల్ త్రిపురలలో వామపక్ష వాదుల ప్రభుత్వాల పాలన అప్రతిహతంగా నడుస్తున్నది .
అనంతరం 1984లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ సానుభూతి పవనాలు వీచి రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. తర్వాత 1989 లో జరిగిన ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి లోకసభలో మెజార్టీ రాకపోవడంతో నేషనల్ ఫ్రంట్ పేరున విపి సింగ్ ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని కొనసాగించాడు. కానీ మందిర్ మరియు మండల్ ఉద్యమం దేశంలో అశాంతిని రేకెత్తించింది. తత్ఫలితంగా వి.పి. సింగ్ 143 రోజులు,అనంతరం చంద్రశేఖర్ 223 రోజుల పిదప అనేక లుకలుకలు బెకబెకల మధ్య ప్రధానమంత్రిగా తప్పుకోవలసి వచ్చింది .
భావించాల్సి వస్తుంది.
మొట్టమొదటిసారి కేంద్రంలో వీపీ సింగ్ ఆధ్వర్యంలోని మండల కమిషన్ అమలుకు ప్రభుత్వానికి మద్దతు తెలుపవలసిన వెనుకబడిన వర్గాలు అద్వానీ మందిర్ (మండల్ వ్యతిరేక) రథయాత్రలో ఇటికలు మోసి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అప్పుడు అమలు కావలసిన వర్గాల రిజర్వేషన్లు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
రెండోసారి రాహుల్ గాంధీ అనన్య సామాన్యంగా చేపట్టిన భారత్ దక్షిణ చివరలోనున్న కన్యాకుమారి నుంచి కేంద్రపాలితమైన జమ్ము కాశ్మీర్ వరకు 150 రోజులు 4050 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జోడోయాత్రతో మళ్లీ ఒకసారి సామాజిక న్యాయం తెరమీదికి వచ్చింది. "ఇన్ కి జిత్ ని ఆబాది ఉన్ కి ఉత్ ని భాగీ ధారీ" రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదంతో వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలనే ఎజెండా దేశ రాజకీయపార్టీలకు ప్రధానమైపోయింది. అంతేగాకుండా రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర పేరున జనవరి 14 , 20 24 నుండి మార్చి 16,20 24 వరకు మణిపూర్ నుండి బొంబాయి వరకు 62 రోజులు పాదయాత్ర చేసి వివిధ వర్గాలకు చెందిన ప్రజానీకాన్ని నేరుగా కలిశాడు. అనేక ప్రజా సమస్యలను అవగాహన చేసుకున్నాడు. ఈ యాత్రలో ప్రధానంగా రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యలు ద్రవ్యోల్బనం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాడు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మూడో తరం నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రజలను పాదయాత్ర ద్వారా కలిసి భారత రాజకీయాల్లో విలక్షణ నాయకుడుగా నిలిచి పోయాడు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ యొక్క సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని కర్ణాటక తెలంగాణలో కుల సామాజిక గణన చేపట్టారు. అంతేగాకుండా తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కావాలని కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీన్ని గవర్నర్కు తద్వారా రాష్ట్రపతికి శాసనసభ తీర్మానాన్ని ఆమోదం కోసం పంపారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి ఆమోదం లభించలేదు.పైగా పద్మవ్యూహాన్ని అడ్డుకున్న సైంధవుడులా కోర్టులు బిసి రిజర్వేషన్ల పిటిషన్లను కొట్టివేసి మోకాలు అడ్డుకున్నది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్లు దాటరాదమే నిబంధన లేకున్నా సైంధవుడి పాత్ర న్యాయస్థానాలు పోషిస్తున్నాయి . కారణము కోర్టులలో న్యాయమూర్తుల ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతున్నది .
స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల దుస్థితి ఇలా ఉంటే ఇంకా శాసనసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు ఎప్పుడు అవుతాయో ఆ పైవాడికే తెలియాలి. ఇది ఇలా ఉంటే ప్రతి రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు వారి వారి వాదనలు గుట్టకు కట్టెలు మోసినట్టు, శనకం అరచినట్టు వినిపిస్తూనే ఉన్నారు. కానీ బీసీ రిజర్వేషన్లు సమస్య ఒక కొలిక్కి రావడం లేదు. బీసీ రిజర్వేషన్ల విషయంపై అందరూ ఏకీభవిస్తూనే అంతర్గతంగా విభేదిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు సమ్మతి తెలుపుతున్నట్టు పై కనబడుతున్న వారి వారి పార్టీల రాజకీయ ఎజెండా మీదికి తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వంపై బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యేలా ఒత్తిడి తీసుకురాలేక పోతున్నారు. రాజకీయ పార్టీల వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు వారి వారి అధిష్టానాలపైన ప్రెషర్ పెట్టలేకపోవడం మిక్కిలి శోచనీయమైన అంశంగా మిగిలి పోతుంది.
మొత్తానికి బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోవడం పోవడం పైన ఆయా రాజకీయ పార్టీల నాయకులు మీరు కారణం అంటే మీరే కారణం అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి తప్ప అమలు విషయంలో ఒక్క తాటిమీద నిలబడలేక పోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ వైఖరి పట్ల దొందు దొందుగా వ్యవహరిస్తున్నాయి. కానీ దేశంలో వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒత్తిడి వలన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2026 జనాభా లెక్కలు కులగణనకు అంగీకరించింది. బీసీల పక్కా లెక్కలు తేలిన తర్వాత బీసీల రిజర్వేషన్ల సమస్యకు ముగింపు కలుగుతుందో లేదో ఇప్పటివరకూ ఎదిరిచూడాల్సిందే మరి..

