
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోతుల పంచాయితీ!
కొందరు అభ్యర్థులు ఒకరు కొండముచ్చుతో ప్రచారం చేయగా, మరోచోట ఇద్దరు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలతో ప్రచారం చేయించారు.
తెలంగాణ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో అభ్యర్థులు ఓటర్ల నుంచి 'కోతుల సమస్య" పరిష్కారం ప్రధాన డిమాండును ఎదుర్కొంటున్నారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు కడ్తామని, డ్రింకింగ్ వాటర్ ఇస్తామని అభ్యర్థులు గతంలో ఓట్లు అడిగేవారు. కానీ ఈసారి ఎన్నికలలో కోతుల సమస్య పరిష్కారం ప్రధాన అంశం అదనంగా చేరింది. కోతుల బెడదను తీర్చే వారికే ఓట్లేస్తామని అనేక గ్రామాలలో ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులైతే దాన్నే తమ ప్రచారాస్త్రాంగా మలుచుకుంటున్నారు. తమను గెలిపిస్తే కోతుల బెడద లేకుండా చేస్తామని కొంతమంది అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు ఒకరు కొండముచ్చుతో ప్రచారం చేయగా, మరోచోట ఇద్దరు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలతో ప్రచారం చేయించారు.
2022 సంవత్సరం అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల కోతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ సంఖ్య ఇప్పుడు మూడింతలు పెరిగి కోటికి చేరి ఉంటుందని చెబుతున్నారు.
పలు గ్రామాలు, పట్టణాల్లోని కోతుల సమస్య తీవ్రంగా ఉంది. అటు పంట పొలాలనూ నాశనం చేసి, రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, మకజొన్న, పల్లి, కంది, సోయా, శనగ, వేరుశనగ ఇలా ఆహార పంటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయి. ప్రకృతి వైఫరీత్యంతో వచ్చే నష్టంకన్నా కోతుల మందపడి చేసే నష్టమే ఎక్కువగా ఉంటుందని రైతులు వాపోతున్నారు.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి- భువనగిరి జిల్లాలోని అనేక గ్రామాలలో పంచాయతీ ఎన్నికలలో కోతుల సమస్య ప్రధాన అంశంగా మారింది. యాదాద్రి-భువనగిరి జిల్లా గుండాలలో గ్రామ పంచాయతీ ఎలెక్షన్లలో ప్రచారం కోతులకోతుల చుట్టూ తిరుగుతూ ఉంది. దీనికి కారణం ఆ గ్రామంలో కోతుల సంఖ్య జనాభా కంటే ఎక్కువ ఉండటమే.
మహబూబాబాద్ జిల్లా దాట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమ్మినేని రాములమ్మ కోతుల బెడద నుంచి విముక్తి కలిపిస్తానని హీమీ ఇస్తూ ఓటు అడుగుతుంది. తనను గెలిపిస్తే ప్రతి సంవత్సరం కోతులను పట్టించి దూర ప్రాంతాలకు తరలిస్తానని హామీ ఇంటొంటాచెబుతూ ఉంది.
హనుమకొండ జిల్లా నేరెళ్ల పంచాయతీలో కోతుల బెడద మరీ ఎక్కువగా ఉంది. దీంతో తమను గెలిపిస్తే కోతుల బెడద నివారణకు మొదటి ప్రాముఖ్యం ఇస్తామని సర్పంచ్ అభ్యర్థులు జెట్టి నాగలక్ష్మి, గోల్కొండ శ్రీరాం అనుచరులు చింపాంజీ, ఎలుగు బంటి వేషధారణ వేసి గ్రామంలో వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్న రాజేశ్వర్ బుధవారం కొండముచ్చుతో ప్రచారం చేశాడు. గ్రామంలో దానిని తిప్పుతూ కోతుల బెడద తీర్చేందుకు కొండముచ్చును తీసుకొచ్చానని, ఓటు తనకే వేయాలని కోరుతున్నారు. గెలిచిన తర్వాత మరో మూడింటిని తీసుకొచ్చి కోతులను తరిమేస్తానని హామీ ఇచ్చాడు. కొండముచ్చులను చూసి కోతులు బెదురుతాయని ఇక్కడి ప్రజల్లో నమ్మకం ఉంది.
హన్మకొండ జిల్లా నేరేళ్లలో తమను ఎన్నుకుంటే కోతుల బాధ శాశ్వతంగా తప్పిస్తామని హామీ సర్పంచు అభ్యర్థులు భరోసా ఇస్తున్నారు. ఊరికే హామీ ఇవ్వడమే కాకుండా.. తమ అనుచరులకు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ వేయించి, వాటిని శాంపిల్ గా తరిమేయిస్తున్నారు. తమను ఎన్నుకుంటే శాశ్వతంగా కోతుల బెడద తప్పిస్తామనేందుకు ఇది నిదర్శనమని, ఇది కేవలం ఓట్ల వాగ్దానం కాదని ప్రజలు నమ్మాలని చెబుతున్నారు. గ్రామస్తులు, యువకులు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. పాపం ఓట్ల కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ కోతుల బెదడ నుంచి తమను ఎవరైతే గట్టెక్కిస్తారో వాళ్లకే ఓట్లు వేస్తామని కొన్ని గ్రామాల ఓటర్లు ప్రచారానికి వచ్చిన అభ్యర్థులకు తేల్చి చెబుతున్నారు. ఇది చాల కష్టంతో కూడుకున్న పని అని తెలిసినా అభ్యర్థులు మాత్రం హామీ ఇస్తూ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. తుంగతుర్తి మండల వెలుగు పల్లి సోలూరాం లక్ష్మణ రెడ్డి అనే అభ్యర్థి గత రెండేళ్లుగా కోతుల నివారణకు తాను చేసి కృషిని వివరించి ఇది కొనసాగుతుందని ప్రచారం చేస్తున్నాడు. తాను నియమించిన టీమ్స్ ఇంతవరకు 600 కోతులను పట్టుకుని అడవిలో వదలిపెట్టాయని కూడాచెబుతూ తన నిజాయితీని విశ్వసించాలని ఆయన చెబుతున్నారు.
అనేక ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉదాహరణకు ములుగు జిల్లా గోవిందరావు పేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి లావుడ్యాజోగానాయక్ కోతుల నివారణకు 6 లక్షల రుపాయల బడ్జెట్ ప్రకటించారు.తన జేబునుంచి ఈ డబ్బు ఖర్చు పెట్టి కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు.
కోతుల సమస్య
తెలంగాణలో కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. అడవుల్లో కోతులకు తినడానికి పండ్ల చెట్లు కొరవడటంతో అవి గుంపులుగా అటవీ గ్రామాలపై పడ్డాయి. పంట పొలాలను కోతులు ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా అడవి పందులు పంటలను నాశనం చేసేవి. ఇపుడు కోతులు కూడా పెద్ద ఎత్తున పంటల మీద దాడి చేస్తుండటంతో రైతులు పంటపై పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి పొందలేకపోతున్నారు.దీంతో తెలంగాణలో కోతుల బెడద పెద్ద సమస్యగా మారింది. చివరకు కోతుల వివాదం హైకోర్టు దాకా ఇక కోతులు వన్యప్రాణులు కావు...
పట్టుకున్న కోతులను ఎక్కడికి పంపాలి. అడవుల్లోకి పంపాలి. అటవీ గ్రామాల్లో, జనావాసాల్లో వీటి బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.కోతులు వన్యప్రాణులు కానందున వీటిని అడవుల్లోకి వదిలివేయలేమని సాక్షాత్తూ మంత్రి కొండ సురేఖ ప్రకటించారు. అయితే కోతుల సమస్యను మాత్రం తీర్చాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే, ఇక్కడ ఒక చిక్కు సమస్య వచ్చింది. కోతులు వన్యప్రాణులు కావని, వాటికి ఆ గుర్తింపు రద్దయిన నేపథ్యంలో తాము వీటిని అడవుల్లోకి అనుమతించలేమని తెలంగాణ వన్యప్రాణుల విభాగం ప్రత్యేక అధికారి ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ప్రజలే కోతులకు ఆహారాన్ని వేస్తుండటంతో వీటి సంఖ్య పెరుగుతుందని ఆయన తెలిపారు. కోతుల నియంత్రణకు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడంతోపాటు కోతులకు ఆహారం పెడితే తాము కేసులు పెడుతున్నామని ఆయన వివరించారు.
దీనితో కోతులు ఎన్నికల ప్రచారాంశంగా మారాయి.

