బిసి నేత ఆర్ కృష్ణయ్య ‘ఇథనాల్’ ఆరోపణలు ఒక జోక్
x

బిసి నేత ఆర్ కృష్ణయ్య ‘ఇథనాల్’ ఆరోపణలు ఒక జోక్

ఉన్నట్లుండి నిద్రలేచి ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడటంలో అర్థం ఏమిటి?

గద్వాల జిల్లా పెద్ద ధనవాడ లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇథనాల్ కంపనీని ఏర్పాటు చేస్తున్నందువల్లనే, దానిని సహించలేక , కొందరు ధ్వంసం చేశారని , వెనుకబడిన వర్గాలు ఎదగడం కొందరికి ఇష్టం లేదని ఆరోపిస్తూ బీజేపీ రాజ్య సభ సభ్యుడు, సుదీర్ఘ కాలం పాటు వెనుకబడిన వర్గాల సామాజిక ఉద్యమ నాయకుడుగా ఉన్న ఆర్. కృష్ణయ్య చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవే కాదు, విషాద కరం కూడా. తెలంగాణలో గత మూడు సంవత్సరాలుగా సాగుతున్న ఇథనాల్ వ్యతిరేక పోరాటాలకు ఎప్పుడూ సంఘీభావం ప్రకటించని ఆర్,కృష్ణయ్య, అకస్మాత్తుగా మేల్కొని, కాలుష్య కారక ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడడం అభ్యంతరకరమే కాదు, ఈ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటున్న బహుజనులను అవమానించడం కూడా..

మన రాష్ట్రం లోనూ, దేశం లోనూ ఇథనాల్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్న వారిలో అన్ని సామాజిక వర్గాల వారూ ఉన్నారు ( కమ్మ, రెడ్డి, వెలమ, బీసీ ), వాళ్ళు పారిశ్రామిక వేత్తలుగా , ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండీ అనుమతులు తెచ్చుకున్నారు. సరైన చర్చ లేకుండా, శాస్త్రీయ దృక్పథం లేకుండా, ఇథనాల్ 20 పేరుతో , కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా , 2021 సంవత్సరం నుండీ ఈ పరిశ్రమలకు అనుమతులకు అనుమతులు ఇవ్వడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా లోతైన అధ్య యనం లేకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అనుమతులు ఇవ్వడాన్ని, నీటి కేటాయింపులు చేయడాన్ని ప్రజలు అభ్యంతర పెడుతున్నారు .

కేంద్రం ఇస్తానన్న సబ్సిడీలు , రాయితీలు, బ్యాంకు రుణాలు, గ్యారంటీ మార్కెట్ మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఇథనాల్ పరిశ్రమ వల్ల వచ్చే కాలుష్యం గురించి ఎలాంటి అవగాహన లేకుండా, ముందుకు వెళుతున్న ఆయా పరిశ్రమల యాజమాన్యాల వైఖరి, రైతులకు, గ్రామీణ యువతకు ఈ పరిశ్రమ వల్ల లాభం ఉంటుందని, వాళ్ళు గ్రామాలలో చెబుతున్న అబద్ధాలు, స్థానిక రాజకీయ నాయకులకు,ప్రజా ప్రతినిధులకు లంచాలు ఇచ్చి, లోబర్చుకోవడాలు –ప్రజకలు స్వయంగా చూస్తున్నారు. పైగా నారాయణ పేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు లో ఇథనాల్ పరిశ్రమ సృష్టించిన విధ్వంసం చూసిన వాళ్ళు ఎవ్వరూ ఇథనాల్ పరిశ్రమలను తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని అనుమతించరు.

మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన - ముఖ్యంగా జగిత్యాల జిల్లా స్తంభం పల్లి, , నిర్మల్ జిల్లా దిలావర్ పూర్, గద్వాల జిల్లా పెద్ద ధనవాడ, సూర్యాపేట జిల్లా రావి పహాడ్, సిద్దిపేట జిల్లా గుగ్గిళ్ళ ప్రజలు చిత్తనూరు వెళ్ళి అక్కడి ప్రజలతో మాట్లాడి, వాళ్ళ అనుభవాలను తెలుసుకుని , తమ ప్రాంతానికి ఇథనాల్ పరిశ్రమ వస్తే జరిగే అనర్ధాన్ని లోతుగా అర్థం చేసుకుని , స్థానికంగా ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీలను ఏర్పాటు చేసుకుని పోరాడు తున్నారు. రాజకీయ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా గ్రామాల ప్రజలు ఈ ఉద్యమాలలో పాల్గొంటున్నారు. పోలీసు కేసులను, నిర్బంధాన్ని కూడా ఎదుర్కుంటున్నారు. లాటీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు కూడా వెళ్లారు. ఈ ఉద్యమాల నాయకత్వ స్థానాలలో దళితులు, వెనుకబడిన వర్గాలు, మత మైనారిటీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అన్ని చోట్లా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

వెనుకబడిన వర్గాల ప్రజల నాయకుడిగా పని చేసి, వారి హక్కుల కోసం అనేక ఉద్యమాలు నడిపి, గుర్తింపు పొందిన ఆర్. కృష్ణయ్య , గత దశాబ్ధ కాలంగా పాలక వర్గ పార్టీలలో చేరి, తన స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడడం అందరం చూస్తున్నదే. ప్రజల పక్షాన నిలబడే ఎలాంటి రాజకీయ నిబద్ధత లేకుండా, చట్ట సభలలో ప్రాతినిధ్యం కోసం ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ రాజకీయ పార్టీ లో చేరిన అవకాశ వాద వైఖరి కూడా ఆయనలో కనపడు తున్నది. ఇప్పుడు బహుజన ప్రజల పోరాటాలను అవమానిస్తూ కార్పొరేట్, ప్రైవేట్ కంపనీల యాజ మాన్యాల పక్షాన చేరి మాట్లాడడం మరింత దిగజారుడుతనమే.

మన సమాజం కులాలతో కూడుకున్నది. ఆధిపత్య కులాలు వనరులపై, ఆస్తులపై, అధికారం పై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగు కులాలు వనరుల లేమికి, వివక్షకు గురవుతున్నాయి. కులోన్మాద దాడులకు గురవుతున్నాయి . చట్ట సభలలో కూడా తగిన ప్రాతినిధ్యం వారికి దక్కడం లేదన్నది వాస్తవం. ముఖ్యంగా దళితులపై దాడులు పెరుగుతున్నాయి. హింస పెరుగుతున్నది. తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఇలాంటి దాడులకు ఎక్కువగా పాల్పడుతున్నవారిలో వెనుక బడిన వర్గాల ప్రజా సమూహాలు ఉండడం కూడా విషాదకర సందర్భంగా మారుతున్నది .

సుదీర్ఘ కాలంపాటు సామాజిక న్యాయం ఈ వర్గాలకు దక్కకుండానే గడిచి పోయింది. సహజంగానే ఆర్ధికంగా పేదలు కూడా ఈ కులాల లోనే ఎక్కువగా ఉన్నారు. వారికి ఉన్న కొద్ది పాటి సహజ వనరులను కూడా కాపాడుకోలేని దుస్థితి ఉంది. కుల వృత్తులన్నీ ధ్వంసం అయి పోయిన స్థితిని చూశాం. ఈ వర్గాల ప్రజలకు ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడడం, ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను వెంట వెంటనే భర్తీ చేయకపోవడం, లేదా ఆ ఖాళీలను రద్ధు చేయడం , ఫలితంగా రిజర్వేషన్ ల అమలు పూర్తిగా కుంచించుకు పోవడం చూస్తున్నాం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లు లేకపోవడం, మత మార్పిడి చేసుకున్న దళితులు రిజర్వేషన్ లు కోల్పోవడం కూడా ఆయా సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయమే.

పాలక వర్గ రాజకీయ పార్టీలు కూడా ఎప్పటికప్పుడు ఈ సామాజిక వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూడడం, సామాజిక న్యాయానికి ఆస్కారం లేకుండా ఆధిపత్య కులాల వారికి మాత్రమే రాజకీయ ,అధికార స్థానాలలో అవకాశాలు దక్కడం కూడా ఒక భౌతిక వాస్తవం. ఈ నేపధ్యంలోనే అస్తిత్వ ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాల ఆకాంక్షలు , డిమాండ్లు ముందుకు వచ్చాయి. ఈ ఉద్యమాలు సమాజంలో తాము ఎదుర్కుంటున్న వివక్షను ఎలుగెత్తి చాటాయి . ఈ ఉద్యమాలలో ఎదిగి వచ్చిన నాయకత్వం ఆయా సామాజిక వర్గాలకు బలమైన గొంతుగా కూడా మారింది. సమాజంలో మౌళికంగా పెద్ద మార్పులు రాకపోయినా, ఈ ఉద్యమాలు కొన్ని పాక్షిక ఫలితాలు కూడా సాధించాయి.

ఇదే సమయంలో ఈ ఉద్యమాల నుండీ ఎదిగి వచ్చిన నాయకులను, పాలక వర్గాలు తమలో కలిపేసుకోవడం అనే ప్రక్రియ కూడా అంతే వేగంగా జరిగింది. దీంతో కొంతకాలం పాటు, కొన్ని పాక్షిక డిమాండ్ల పై నిజాయితీగా ఉద్యమాలను సాగించిన ఈ నాయకులు, మొత్తం తమ సామాజిక వర్గ ఆకాంక్షలు, డిమాండ్లు సాధించే పోరాటాలను ముందుకు నడపకుండా ఆగి పోయారు. వివిధ సామాజిక ఉద్యమాలలో నాయకత్వ స్థానాలకు చేరిన విడి విడి వ్యక్తులకు తమ పార్టీలలో పదవులు కట్టబెట్టడం ద్వారా, చట్ట సభలలో కొన్ని స్థానాలు కేటాయించడం ద్వారా, ఈ నాయకుల నోరు మూయించే ఎత్తుగడలను పాలకవర్గ రాజకీయ పార్టీలు అనుసరించాయి.

ఆయా పాలకవర్గ రాజకీయ పార్టీలలో కూడా వీరికి దక్కిన స్థానాలు బలమైనవీ కావు, ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగినవీ కావు. సామాజిక ఉద్యమాల నుండీ ఎదిగి వచ్చిన వారిలో ఇప్పటికీ కొందరు నాయకులు వ్యక్తిగత జీవితంలో నిజాయితీగా ఉన్నా, తాము ఉన్న పార్టీ పట్ల నిబద్ధతతో, ప్రజల పక్షాన మాట్లాడే తమ గొంతును కోల్పోవడం ఆయా సామాజిక వర్గాలకు జరిగిన పెద్ద అన్యాయం. ఒకటి రెండు సార్లు మాట్లాడే ప్రయత్నం చేసినా, అంతకు మించి, ఆయా సామాజిక వర్గాల ప్రజలు సాగిస్తున్న ఉద్యమాలలో స్వయంగా వీరు భాగస్వాములు కాకపోవడం కూడా మనం గమనిస్తున్నదే.

మన రాష్ట్రంలో బీజేపీ , BRS, కాంగ్రెస్, తెలుగు దేశం లాంటి పార్టీలలో చేరిన సామాజిక ఉద్యమ నాయకుల అందరి పరిస్థితీ ఇదే. వెనుకబడిన వర్గాల నుండీ ఎదిగిన ఆర్. కృష్ణయ్య, ఆదివాసీల నుండీ ఎదిగిన సోయమ్ బాబూరావు, మాదిగ సామాజిక వర్గం నుండీ ఎదిగిన మంద కృష్ణ ల రాజకీయ ప్రస్థానాలను చూస్తే ఈ విషయమే రుజువు అవుతోంది. రాజకీయ వారసత్వం, పారిశ్రామిక, మీడియా రంగాలలో సాధించిన ఆర్ధిక బలం, సైద్ధాంతిక నిబద్ధత లేని రాజకీయ అవకాశ వాదంతో మాల సామాజిక వర్గం నుండీ వచ్చిన జి. వివేక్ లాంటి వాళ్ళు కూడా ప్రభుత్వాలు అమలు చేసే విధానాల వల్ల తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం పట్ల నోరెత్తి మాట్లాడ కుండా మౌనంగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

సాధారణంగా ఆధిపత్య కులాల నుండీ వచ్చిన వారే ఈ పాలక వర్గ పార్టీల ప్రధాన నాయకు లుగా, అధికారంలో ఉన్న పార్టీలో ముఖ్యమైన మంత్రులుగా ఉంటున్నారు. వారికి సామాజిక న్యాయం పట్ల నిబద్ధత ఉంటుందని ఆశించలేం. ఆర్ధికంగా కూడా వాళ్ళు పేద,శ్రామిక వర్గాల ప్రజల పక్షాన ఉంటారని కూడా చెప్పలేము. పైగా వీళ్ళు తమకున్న అధికారాలను ఉపయోగించుకుని మరిన్ని వనరులను కొల్ల గొట్టడం, మరిన్ని కాంట్రాక్టులు తెచ్చుకోవడం, పర్యావరణాన్ని నాశనం చేస్తూ మరిన్ని కంపనీలు, సంస్థలు ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. ఈ ప్రక్రియలో బీసీ, ఎస్. సీ , ఎస్. టీ సామాజిక వర్గాల నుండీ ఎదిగి వచ్చిన కొందరు పారిశ్రామిక వేత్తలు కూడా తాజాగా భాగస్వాములు కావడం కనిపిస్తున్నది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఈ ఆస్థిపర వర్గానికి తమకు చేకూరే ఆర్ధిక లాభం తప్ప, సామాజిక న్యాయం, పర్యావరణ స్పృహ అసలు ఉండడం లేదు. దీనిని ఆయా సామాజిక వర్గాలు గుర్తించాలి.

ఇలాంటి సందర్భంలో అన్ని కులాలకు సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాలకు ఆర్ధిక న్యాయం కోసం పోరాడాల్సిన సామాజిక ఉద్యమ నాయకులు కూడా ఆచరణలో ఆధిపత్య కులాల వారి లాగే వ్యవహరిస్తే , ఫాసిస్టుపార్టీలకు, నిరంకుశ ప్రభుత్వాలకు, పారిశ్రామిక వర్గాలకు, కొమ్ము కాస్తే , ఇక ఆయా వర్గాల ప్రజల పక్షాన పోరాడే వారెవ్వరుంటారు ?

గత మూడు దశాబ్ధాలుగా ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వాలు పనిగట్టుకుని నాశనం చేశాయి. దీని ప్రభావం ఎక్కువగా సామాజికంగా అట్టడుగు వర్గాల పైన పడింది. ఇప్పటికీ ప్రభుత్వ స్కూల్స్ లో ఉన్న దళితుల, వెనుకబడిన వర్గాల పిల్లలు నాణ్యమైన విద్య అందక నష్టపోతున్నారు. డ్రాపవుట్స్ కూడా ఈ పిల్లలలోనే ఎక్కువ. ఈ సామాజిక వర్గాల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నాయి. కానీ ప్రస్తుతం ఈ సమస్యలపై సామాజిక ఉద్యమ నాయకులనేకమంది మాట్లాడడం లేదు. ప్రభుత్వాలతో పోరాడడం లేదు.

పారిశ్రామికీకరణ , నగరీకరణ, రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్నా , దళితుల చేతుల్లోని కొద్ది పాటి భూమి కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గత ప్రభుత్వ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు, పల్లె వనాలు, రైతు వేదికలు, వైకుంట ధామాలు, యాచారం ఫార్మా సిటీ , జహీరాబాద్ నిమ్జ్ లాంటి వాటి కోసం ఎక్కువగా దళితుల అసైన్డ్ భూములనే లాక్కున్నారు. ఇప్పటి ప్రభుత్వం కూడా రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, ఇతర పారిశ్రామిక పార్కుల కోసం దళితుల భూములనే గుంజుకుంటున్నది. వీటికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు పోరాడుతున్నారు . కానీ ఇప్పటి వరకూ బీసీ, ఎస్. సీ, ఎస్. టీ సామాజిక ఉద్యమాల ప్రధాన నాయకులు ఎవ్వరూ ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయం పై మాట్లాడడం లేదు. ఆయా ప్రాంతాల ప్రజలు చేసే పోరాటాలలో భాగం పంచు కోవడం లేదు.

ఈ సామాజిక వర్గాల నుండీ, ఉద్యమాల నుండీ ఎదిగి వచ్చిన కొందరు మేధావులు, రచయితలు, కవులు ప్రజల ఉద్యమాలకు బాసటగా ఉంటున్నారు. ఉద్యమాలలో పాల్గొంటున్నారు. కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ పంచన చేరి తమ స్వార్ధ ప్రయోజనం చూసుకునే ఈ సామాజిక వర్గాలకు చెందిన కొందరు మేధావులు, రచయితలు, కవులు మాత్రం ప్రజల పక్షాన నిలబడి మాట్లాడడం లేదు. పాలకులను ప్రశ్నించడం లేదు. పైగా ప్రజలకు అవసరమైన సమయంలో కూడా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.

అందుకే సామాజిక న్యాయం కోసం పోరాటం గీత గీసినట్లు ఉండదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరు ప్రజల పక్షాన ఉంటారు ? ఎవరు పాలకుల పక్షాన ఉంటారు? ఎవరు శ్రమ జేవుల పక్షాన ఉంటారు? ఎవరు పారిశ్రామిక వర్గాల పక్షాన ఉంటారు? అన్నది ఆచరణ మాత్రమే రుజువు చేస్తుంది. తాజాగా ఇథనాల్ కంపనీల విషయంలో ఆర్. కృష్ణయ్య వైఖరి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. అస్తిత్వ ఉద్యమాలు లేవనెత్తే సామాజిక న్యాయం, ఇతర ప్రజాస్వామిక అంశాలకు మద్ధతు ఇవ్వాల్సిందే కానీ, ఆయా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారి రాజకీయ అవకాశవాదాన్ని కూడా జాగరూకతతో గమనించాలని ఈ అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. దోపిడీ వర్గాలకు కొమ్ము కాసే పాలక పక్షాల చెంత చేరకుండా, ప్రజల పక్షాన పని చేసే వారందరూ ఉమ్మడిగా ముందుకు సాగడం ప్రజలకు బలాన్ని ఇస్తుంది. నిజమైన ఆర్ధిక , సామాజిక న్యాయం కూడా అప్పుడే సిద్దిస్తుంది.

Read More
Next Story