
సర్కార్ బడుల సంరక్షణ టీచర్లదేనా?
బడిబాట లోకి ప్రజాప్రతినిధులు కూడా రావాలి...
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి తెలంగాణ ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట’ కార్యక్రమం మొదలైంది. ఇది ఒక ఆదర్శవంతమైన కార్యక్రమం. విద్యార్థులను పాఠశాలలకు తీసుకురావడానికి, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేస్తున్నారు. నిజానికి దీనిని ఒక కార్యక్రమం అనరాదు.ఇదొక సామాజిక ఉద్యమం. సర్కారు విద్యావ్యవస్థను కాపాడి, అది బలపడేలా చేసేందుకు సాగుతున్న ఉద్యమం. ఇది ఈ నెల 19 దాకా నడుస్తుంది. వచ్చే నెల 12న స్కూళ్లు ఫున: ప్రారంభమవుతాయి.
సర్కారు బడుల్లో తగ్గుతున్న ప్రవేశాలు
ఈ కార్యక్రమం ప్రకటించడం వెనక ఒక నేపథ్యం ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో గత పదేళ్లలో విద్యార్థుల ప్రవేశాలు 32 శాతం తగ్గాయి. 2014-15లో 24.85 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చేరితే, 2024-25లో ఈ సంఖ్య 16.68 లక్షలకు తగ్గింది. అదే కాలంలో ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు 31.17 లక్షల నుంచి 36.73 లక్షలకు పెరిగింది. ఇది ఆందోళన కలిగించే విషయం.
వినూత్న పద్ధతులు
ఈకార్యక్రమంలో టీచర్లు చాలా అంకితభావంతో , వినూత్న వ్యూహాలతో పాల్గొంటున్నారు. ఉదాహరణకు 'సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది.. రారమ్మన్నదీ.. ఇంగ్లిష్ చదువు కూడా చెప్పుచున్నది.. ఎంతో నేర్పుతున్నది.. పద పదా పోదా సర్కారూ బడికి.. పైసన్నది ఖర్చులేని అమ్మ ఒడికి'.. అంటూ చక్కటి సంగీతం, పాఠశాల ఫొటోలతో.. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యాలతో రూపొందించి సోషల్ మీడియా వేదికగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట మండల పరిషత్ ప్రాథమి పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట నిర్వహిస్తున్నారు. ఇలాగే వలిగొండ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కూడా పాటతో తల్లితండ్రులను, పిల్లలను బడివైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. ఇలా రాష్ట్రంలోని పాఠశాలన్నీ బడి బాట కార్యక్ర మంలో పాల్గొంటున్నాయి.
టీచర్లకే వదిలేయరాదు
బడి బాట కార్యక్రమం కేవలం విద్యార్థుల నమోదును పెంచడం మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో ఒక సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఒక విధంగా ఇది పాఠశాలలను రక్షించుకునే మహత్తర కార్యక్రమం. ఇలాంటి లక్ష్యసాధన కేవలం ఉపాధ్యాయులకే వదిలేయకుండా ఒక సామాజిక కార్యక్రమంగా రూపొందాలి. ఈ లక్ష్యాన్ని సాధించే బాధ్యత అందరి మీద ఉండాలి.ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు కూడా సర్కారు బడులను కాపాడుకుని, వాటిపట్ల ప్రజల్లో గౌరవభావం కలిగేంచే ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తారు.
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం వల్ల కలిగే ప్రయోజనాలు:
*విశ్వసనీయత పెంపు: ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు వంటివారు బడి బాట కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ప్రజల్లో కార్యక్రమం పట్ల విశ్వసనీయత పెరుగుతుంది. "ప్రభుత్వమే స్వయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది" అనే సందేశం ప్రజలకు బలంగా వెళుతుంది.
*అవగాహన విస్తరణ: ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తారు. వారి ప్రచార శక్తి, ప్రజలతో ఉన్న సంబంధాలు బడి బాట సందేశాన్ని మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటి సౌకర్యాల గురించి వారు ప్రభావవంతంగా వివరించగలరు.
*సామాజిక సమీకరణ: ప్రజాప్రతినిధులు తమ పలుకుబడిని ఉపయోగించి గ్రామ పెద్దలు, మత పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వ సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయగలరు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ఒక సామాజిక ఉద్యమంగా రూపుదిద్దుకోవడానికి సహాయపడుతుంది.
*తల్లిదండ్రుల్లో భరోసా: ప్రభుత్వ పాఠశాలల పట్ల కొంతమంది తల్లిదండ్రుల్లో ఇంకా అపోహలు ఉండవచ్చు. ప్రజాప్రతినిధులు స్వయంగా గ్రామాలు, వాడల్లో పర్యటించి, తల్లిదండ్రులతో మాట్లాడటం వల్ల వారి సందేహాలు నివృత్తి అవుతాయి. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని వారు నమ్మకం పొందగలరు.
* మౌలిక సదుపాయాల మెరుగుదల: బడి బాట కార్యక్రమం సందర్భంగా ప్రజాప్రతినిధులు పాఠశాలలను సందర్శించినప్పుడు, అక్కడి మౌలిక సదుపాయాల లోపాలను స్వయంగా చూసే అవకాశం ఉంటుంది. తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ప్రహరీ గోడలు వంటి అవసరాలను గుర్తించి, వాటి పరిష్కారానికి తమ నిధుల నుండి లేదా ప్రభుత్వ నిధుల నుండి కేటాయింపులు చేసే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంలో సహాయపడుతుంది.
*ప్రభుత్వానికి చేదోడు వాదోడు: ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని, ప్రభుత్వానికి చేరవేయగలరు. ఇది బడి బాట కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచడానికి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది.
బడి బాటకార్యక్రమం విజయం కేవలం ఉపాధ్యాయుల కృషితోనే కాకుండా, ప్రజాప్రతినిధుల క్రియాశీల భాగస్వామ్యంతో* మరింత పటిష్టం అవుతుంది. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసినప్పుడు, ప్రభుత్వ పాఠశాలలు విద్యకు కేంద్రాలుగా మారి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయగలవు. ఇది తెలంగాణ సమాజం యొక్క విద్యా ప్రమాణాలను గణనీయంగా పెంచుతుంది అనడంలో సందేహం లేదు.