
‘మతమార్పిడి కుల వివక్షను, ఆర్ధిక దోపిడీని తొలగించ లేదు’
కీలవేన్మణి దురాగతానికి 57 సంవత్సరాలు
డిసెంబర్ 25 న కోట్లమంది క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ వుంటే కొoదరి కైనా 1968 క్రిస్మస్ రోజు గుర్తు రాకపోదు. 57 సంవత్సరాలనాడు తమిళనాడులోని [నాటి మద్రాసు రాష్ట్రం] కీలవేన్మణి అనే గ్రామంలో దళితుల పై మారణకాండ జరిగింది. ఆనాడక్కడి భూస్వాములు హరిజన వ్యవసాయ కూలీల ఇళ్లకు నిప్పుపెట్టి 44 మందిని సజీవదహనం చేశారు. వారిలో 23 మంది పిల్లలు ,16 మంది మహిళలు. అది దేశం దృష్టిని ఆశ్చర్య చకితం చేసిన సంచలనాత్మక సంఘటనగా దేశం దృష్టికి వచ్చింది. అప్పటి ప్రభుత్వం దళిత జన బాంధవుడని పేరు మోసిన పెరియార్ రామస్వామి నాయకర్ అనుంగు శిష్యుడు అన్నాదురై నాయకత్వంలో నడుస్తోంది.
ఈ కేసులో క్రింది కోర్టు 10 మంది భూస్వాములను దోషులు గా నిర్ణయించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే చివరికి ఉన్నత న్యాయ స్థానం 1975 లో వారిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. ధనవంతులు, గౌరవనీయులైన భూస్వాములు ఇలాంటి నేరం చేస్తారంటే నమ్మశక్యం కాదు అని కోర్టు విచిత్రమైన తీర్పు చెప్పింది. అలాంటి దౌర్జన్యకరమైన సంఘటనలలో అది మొదటీదీ కాదు చివరిదీ కాదు. కారంచేడు గ్రామంలో జులై 1985 లో కమ్మ భూస్వాములు, రైతులు గుంపుగా మాదిగవాడ పై జరిపిన దాడి, గృహ దహనం, మారణకాండ కేసులో 6 గురు మాదిగలు మరణించారు, ముగ్గురు మహిళలు మాన భంగానికి గురయ్యారు. అనేక మంది తీవ్రంగా గాయ పడ్డారు. వారిలో కొందరు గాయాలతో చనిపోయారు. ఆ కేసులో కూడా కింది ట్రయల్ కోర్టు అగ్రకులానికి చెందిన 159 మంది ని నేరస్థులుగా నిర్ధారించి 5 గురికి యావజ్జీవ కారాగార శిక్ష ఇతరులకు 3 సవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అందరినీ నిర్దో షులుగా విడుదల చేసింది. ఆతరువాత సుప్రీం కోర్టు2008 లో అంటే సంఘటన జరిగిన 23 సంవత్సరాల తరువాత, నేరస్తులు అప్పటివరకు స్వేచ్చగా బతికిన చాలామంది సహజంగా చనిపోయిన తరువాత -- ఒక్కరికి మాత్రం యావజ్జీవ శిక్షను మరో 30 మందికి 3 సంవత్సరాల సాధరణ జైలు శిక్షను విధించింది.
1991 ఆగస్టులో చుండూరు గ్రామంలో రెడ్డి కుల పెద్దలు ఒక చిన్న సంఘటన నెపంతో దళితులను ముందు సాంఘిక బహిష్కారం చేసి, ఆ తరువాత మూకుమ్మడి దాడి చేసి 8 మందిని చంపి వేశారు. ఈ ఘటనలో 212 మంది మీద ఆరోపణ రాగా కింది కోర్టు 56 మందిని నేరస్థులుగా ప్రకటించింది. వారిలో 21 మందికి యావజ్జీవ జైలు, 35 గురికి ఒక సవత్సరా జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాంకేతిక కారణాలు చూపి 56 మందినీ విడుదల చేసింది. ఇక సుప్రీo కోర్టు కూడా సరైన ఆధారాలు లేవని కేసు కొట్టివేసింది. 8 మంది చనిపోయినా ఎవరు వారి చావుకు బాధ్యులు కారని తీర్పు ఇచ్చారన్న మాట.
ఈ సంఘటనల్లో దాడి చేసినవారు ధనవంతులు, భూస్వాములు, అగ్రకులాల వారు. ప్రాణాలు కోల్పోయినవారు వారి భూముల్లో పనిచేసే కూలీలు, కూలి రేట్ల పెంపుదల కోసం, తమ ఆర్ధిక ఉన్నతి కోసం శ్రమపడుతున్న పేదవారు దళితులు. ఇలాంటి సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతూ వున్నాయి. ఒక సామాజిక సమస్యగా పరువు హత్యల వరకు దారి తీసాయి. వీటికి ప్రతిఘటనకూడా వస్తున్నది కానీ అవి బలంగా లేవు. దీని కారణాలు అధ్యయనం చేయాలి.
కమ్యూనిస్టులపై ప్రభుత్వం పెట్టిన చారిత్రాత్మక హైదరాబాదు కుట్ర కేసు విచారణ సందర్భంలో అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో- 1971 డిసెంబర్ 14-18 మధ్య కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వర రావు(డి. వి.) చదివి వినిపించిన ప్రకటనలో కీలవేణ్మని సంఘటనను, ఆసమయంలో బీహారు, యుపి, ఏపి లలో జరిగిన అనేక సంఘటన లను ప్రముఖంగా ప్రస్తావించారు. వీటికి గల కారణాలను వివరించారు. మిలిటెంటు ప్రతిఘటన ద్వారా మాత్రమే వీటిని అరికట్టగలమని స్పష్టం చేశారు. పోరాటాలు చేస్తున్న ప్రజలే ఈ అరాచక, అమానుష మరణకాండ నుండి తమని రక్షించుకోగలరని ఉన్నత న్యాయస్థానంలోనే ఆయన ప్రకటించారు.
భారతీయ చరిత్ర, పురాణాలు, సమాజాలని నిశితంగా అధ్యయనం చేసిన వ్యక్తిగా, సాధారణ ప్రజలతో సంవత్సరాల తరబడి సహజీవనం చేసిన వ్యక్తిగా, కుల సమస్యను చాలా నిశితంగా, లోతుగా అధ్యయనం చేశారు కామ్రేడ్ డి. వి. ఆయన అభిప్రాయాలు, అనేకమంది ఇతర నాయకుల వలె పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి అయిన సిద్ధాంతా లకు లేదా గత భావాలకు పరిమితమై లేవు. ఆయన కుల సమస్యను నిష్పాక్షికం గా చూశారు. ఆయన కులం గురించి అనేక రచనల లో తన అవగాహనను స్పష్టం గా ప్రకటించారు.
కులవ్యవస్థ ఆవిర్భావం గురించి ఆయన ఇలా అంటారు. "భారత దేశంలోని అన్నీ ప్రాంతాలలోను కుల వ్యవస్థ వుంది. చారిత్రకంగా చూస్తే, ఇవన్నీ ఆదిమ కాలం నాటి తెగలూ, ఉప-తెగలూ అని చెప్పవచ్చును. ఇవి క్రమంగా కులాలుగా రూపొందాయి. బానిస సమాజంలో కులాలు ఉన్నాయి. ఫ్యూడల్ వ్యవస్థలో అవి కొనసాగుతూ వచ్చాయి…. సామ్రాజ్యవాదం కొంతవరకు దాని స్వరూపాన్ని మార్చినదే కాని స్వభావాన్ని మార్చలేదు.” కులం ఒక స్థిరమైన, స్తబ్దమైన అంశం కాదు. సమాజ జీవనంలో దానికి ఒక గతి శీలత వుంది. దాని చలనంలో, మార్పుల క్రమంలో ఇమిడి వున్న సామాజిక, రాజకీయ కులతత్వాన్ని డి.వి. చూశారు.
చారిత్రక వాస్తవాలపై ఆధారపడని, అశాస్త్రీయమైన, కులం పుట్టుకకు సంబంధించిన మరికొన్ని ఇతర సిద్ధాంతాలను త్రోసి పుచ్చుతూ రాజ వంశాలు వున్నాయి కానీ రాజ కులాలు లేవని, దళిత వర్గాలు, ఎస్టీలతో సహా అన్ని కులా లకు చెందిన రాజులు, పాలకులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ పాలన కుల సంస్థలను, కుల సంస్కర ణోద్యమాలను ఎలా ప్రోత్సహించిందో ఆయన చెబుతారు.
కులం క్రమంగా, మరింత నగ్నంగా, సిగ్గు మాలినదిగా, సామాజిక, రాజకీయ కులతత్వం గా మారటం ఆయన గమనించారు. 1940వ దశాబ్దపు అనేక ఉద్యమ నివేదికల్లో ఆయన వివిధ కులాలకు చెందిన గ్రామీణ పేదలు ఎలా దోపిడీకి గురయ్యారో నిర్దిష్టమైన, ఉదాహరణలు ఇచ్చారు. తెలంగాణ భూస్వామ్య వ్యవస్థలో, భూస్వామ్య విధానం ద్వారా మొత్తం కుల వర్ణపటం అంతటా, పై నుండి క్రిందికి దోపిడీకి గురై అణచివేతకు లోనయిన చిత్రాన్నిచూశారు. సంస్కరణ వాద గాంధేయ దృక్పథం కంటే భిన్నంగా, ఆయన కులాన్ని మరింత లోతుగా చూసారు. అత్యంత హేయమైన రూపాల లో, అస్పృశ్యత కంటే స్పష్టమైన క్రూర లక్షణాలతో, కులం, కులతత్వం చాలా హానికరమైన విగా వుండటం ఆయన ఎత్తి చూపారు. గొల్లలు, కుమ్మరి, మంగలి. వడ్డెర, ఎరుకల, గౌండ్ల, హరిజన తదితర అనేక కులాలకు చెందినవారిపై జమీందారుల పీడన, అణచివేత, దోపిడీ ఎలా సాగిందో గ్రామాల వారీగా వివరించారు. ప్రజలు ప్రారంభించిన ప్రతిఘటనను కూడా చిత్రీకరించారు.
అమరజీవి దొడ్డి కొమరయ్య మరణం [4 జులై 1946] నుండి 1946 చివరి వరకు చెలరేగిన పోరాట సమయం లో, మల్లారెడ్డి గూడెం గ్రామంలో నిజాం సాయుధ దళాలతో జరిగిన తీవ్రమైన సాయుధ ఘర్షణను వివరిస్తూ “దీనిలో ఐదుగురు మరణించారు. ధనిక రైతు ఎరబోలు అప్పిరెడ్డి, యాదవ కులాని కి చెందిన ముంగి వీరయ్య, హరిజన యువతులు గురవమ్మ, తొండమ్మ, అంకాలమ్మలు నేలకొరిగారు. ముగ్గురు దళిత మహిళా అమర వీరుల గురించి డి.వి. ప్రత్యేకంగా “వారు తెలంగాణ ఝాన్సీలు, చాంద్ బీబీ” లని రాశారు అన్నికులాల ప్రజలలో వువ్వెత్తున చెలరేగిన ఆందోళనలు, విరుచుకు పడ్డ పోలిస్, మిలిటరీ దాడులను ఈ నివేదిక వివరిస్తుంది.
1946 లో ప్రచురించిన “హైదరాబాద్ సంస్థానంలో వెట్టి చాకిరి” అనే పుస్తకంలో, గ్రామాలలో వుండే వృత్తిపనులవారు ఏవిధంగా వెట్టిచాకిరికి గురి అయ్యిందీ వివరించారు. “గిర్దావర్లు, పోలీస్ సబ్ యినస్పెక్టర్లు మొదలుకొని జవానుల వరకు గ్రామాలకు ఎడ తెగకుండా వస్తూ ఉంటారు. వారికి, రాగానే కోమటి కావలసిన సామానంతా ఇవ్వాలి... చాకలి వాళ్ళు సామాను తెచ్చి పెట్టడం, చావిడి బాగు చేయటం, కారం కొట్టడం, పిండి విసరటం, మొదలగు పనులు చేస్తారు. కుమ్మరివాళ్లు నీళ్ళు తెచ్చిపెట్టి, వంట చేసి లేక చేసేవాడుంటే సహాయంగా ఉంటాడు. మంగలి వాళ్ళు పక్కలు వేయాలి. లాంతర్లు తుడవాలి. కాళ్ళు వత్తాలి. రైతులు బండ్లు, చొప్ప ఇవ్వాలి. గొల్లలు గొర్రెలను మేకలను ఇవ్వాలి.. సారు వున్న రోజులు కోమటిండ్ల లో గోల, గొల్లయిండ్ల లో గోల, మాదిగ ఇండ్లలో గోల.. వీరున్న గ్రామపు పనిబాటల వారంతా ఎప్పుడూ వీరి పనుల లోనే ఉంటారు. పోలీస్ స్టేషనులకు గ్రామాలనుంచి రిపోర్టులు తెచ్చే హరిజనులు వచ్చినపుడల్లా కట్టెల మోపులు తేవాలి. వారు వచ్చిన తరువాత స్టేషనులలో వుండే చెట్లకు నీళ్ళు పోయించుతారు”. ఇలా అన్నీ కులాల లోని పేదలు ఈ నిర్బంధ సేవలు చేయాల్సి వచ్చేది.
“వెట్టి విధానంలో అందరికన్నా ఎక్కువగా బాధపడే హరిజనులు ఇతర కష్ట జీవులతో కలసి పోరాడటానికి ముందుకు వస్తున్నప్పటికీ వారిని ఆంధ్ర మహాసభ విమోచన కార్యక్రమం ద్వారా ఇముడ్చుకో లేకపోయింది. ఆదే కాలంలో క్రైస్తవ మిషనరీలు ముందుకు వచ్చి, క్రైస్తవ మతంలో చేరితే ప్రభుత్వ సహాయంతో వారి కష్టాలు పోగొడతామని ప్రచారం చేసి తమ పలుకుబడి క్రిందకు తెచ్చుకున్నారు. “జగిత్యాల తాలూకాలోనే 50-60 గ్రామాలు ఒక్కుమ్మడి గా క్రైస్తవమతాన్ని స్వీకరించారు.” క్రైస్తవం వీరిని జమీందారులకు వ్యతిరేకంగా సంఘటిత పరిచే కార్యక్రమం ఏదీ తీసుకోలేదు, అధికారుల ప్రాపకంతో కొందరికి వ్యక్తిగతంగా, తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తొలిగా యి. మిషనరీల ద్వార విద్యావంతులై కొందరు ఉద్యోగాలలో కుదురుకున్నారు. కానీ ప్రజలకు మాత్రం వెట్టి బాధ తప్పలేదు.” అని ఆయన చెప్పారు.
“కొన్ని గ్రామాలలో 'హరిజనులు, (దళితులు) వెట్టి-బేగర్ మొదలైన వాటి నుండి తప్పించుకోవడానికి ఇస్లాం మతం లోకి మారిన సందర్భాలను ప్రస్తావిస్తారు. “దీనికి ప్రభుత్వం ఆర్ధికంగాను, అధికారులతోనూ పూర్తిగా సహాయ పడుట వలన ప్రచారం గూడా తీవ్రంగానే సాగింది. జనగామ తాలూకాలో చాలామంది దేశముఖుల దౌర్జన్యాలను ఎదిరించ లేక, ఇస్లాం స్వీకరించారు. ముస్లిం మతతత్వవాదులు తమ ప్రచారాన్ని ప్రధానంగా హిందూ జమీందారులు వున్న ప్రాంతాలలోనే కేంద్రీ కరించారు. దీనితో గాబారాపడిన దేశముఖులు, పటేలు, పట్వారీలు ఆర్య సమాజం అండ చేరారు. వారు అనేక మందిని ప్రచారం ద్వారానూ, ఆర్ధిక వొత్తిడి ద్వారాను, శుద్ది చేసి తిరిగి హిందువులుగా మార్చే వారు. అయినా వారికి వెట్టి చాకిరీ బాధలు పోలేదు. తుదకు అస్పృశ్యత కూడా తగ్గలేదు”
1944 నాటి మరొక నివేదిక, ఎన్నికలలో నిజాం అనుకూల శక్తులకు బలం చేకూరుతుందని ఆశతో నిజాం పరిపాలన, ఇస్లాంలోకి 'హరిజనుల' మత మార్పిడులను ఎలా ప్రోత్సహించిందో ప్రస్తావిస్తుంది. మత పాక్షికం తో కూడిన ఇస్లాం తబ్లీగ్, లేక హిందూ శుద్ధి కార్యక్రమాలు వెట్టి చాకిరీని పోగొట్టలేక జమీందారుల దోపిడీలను నిలబెట్ట టానికే తోడ్పడినవి. ఆ రోజుల్లో కూడా కుల, మత రాజకీయాలు ఎన్నికల సంబంధాల గురించి డి.వి. చర్చించడం గమనార్హం. మతమార్పిడి కుల వివక్షలను గాని, ఆర్ధిక దోపిడి బాధలను గాని తొలగించ లేదన్న చారిత్రిక అవగాహన మనకు వుండాలి.
“సంస్థానంలో జమిందారీ ప్రభుత్వం ముస్లిం లను వెనక వేసుకుని ప్రతి సమస్యకు హిందూ-ముస్లిం స్వరూపాన్ని ఇస్తూ, ఐక్య ప్రజా ఉద్యమాన్ని విచ్చిన్నం చేస్తూ వచ్చింది, కానీ హిందూ-ముస్లిం ప్రజలు ఈ పోరాటంలో కలిసి పాల్గొన్నారు. ముస్లింలు తమ హిందూ సోదరులతో పాటు తుపాకి గుండ్లకు ఎర అయినారు. ముస్లిం రాజ్యం అనే నినాదం జమీందార్ల దని, ప్రజల దృష్టిలో బూటకమని” రుజువు చేశారని 1946 చివర్లో రాసిన “నల్లగొండ ప్రజల వీరోచిత పోరాటం” పుస్తకంలో చెప్పారు. వివిధ కులాలు, మతాలు అవి చూపించిన పరిష్కారాలు విఫలమవ్వటాన్ని కామ్రేడ్ డి. వి. ఆనాడే గమనించి, గుర్తించి ; భూస్వామ్య వ్యతిరేక, దోపిడి వ్యతిరేక విప్లవ పోరాటాలు మాత్రమే ఈ మౌలిక సమస్యలను పరిష్కరించగలవని దృఢంగా చాటి చెప్పారు. ఆ అభిప్రాయాలు, పుస్తకాలనుండి నేర్చుకున్నవి కావు; ప్రజా జీవిత అనుభవాలనుండి గ్రహించినవి.
“భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల్లో నూటికి నూరుపాళ్లు ఐక్యత వుంటూ వచ్చింది. సాయుధ పోరాట దశలోను, అంతకు పూర్వమూ ఈ స్థితి వుండేది... బహిరంగ సభలలోనే కాక, సంఘ కార్యకలాపాలలోనూ అంతా కలసిమెలసి పాల్గొనేవారు. అస్పృశ్యతను పాటించడం కూడా చాలావరకు తగ్గిపోయింది. తరచుగా ప్రభుత్వ సాయుధ దళాలు దాడులు చేస్తూ ఉన్నందున ప్రజల జీవితమంత ఇంటి వెలుపలనే గడిచేది. ఎక్కడ నీళ్ళు దొరికితే అక్కడ చేరి భోజనాలు చేయవలసి వచ్చేది. ఈ పోరాట జీవితంలో కుల భేదాలు మరచి అంతా ఐక్య మయ్యారు. ఇలాంటి ఐక్యతను సాధించటంలో కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహా సభలు చేసిన నిర్విరామ కృషి పాత్ర చాలా వుంది. ఉన్నత ఆశయాల కోసం ప్రజలను ఉద్యమం లోకి సమీకరించినప్పుడు వారు కుల భేదాలను తగ్గించుకుని, మరచి ఐక్యమవుతారు.”
. అయన కులం- వర్గం మధ్య దగ్గరి సంబంధాన్ని చూశాడు.1971 కోర్టు సత్యతేమెంటులో లోనే ఆయన ఇలా వ్రాశారు: “గ్రామీణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థతో ముడిపడి ఉంది. ఒక్క కులానికి చెందినవారు భూస్వాము లుగా వుండటం, ఇతర కులాలకు చెందినవారంతా లేక వారిలో అధిక భాగం పేదరైతులు, వ్యవసాయ కూలీలుగా వుండటంవల్ల భూస్వాముల పెత్తనం తరచుగా అగ్రవర్ణాల పెత్తనం గా పరిణమించింది. ఈ భూస్వాములు అగ్రవర్ణాల లోని మధ్యతరగతి, పేదరైతులను తక్కిన [ఇతర కులాలలోని] మధ్యతరగతి, పేద రైతులతో, వ్యవసాయ కూలీలతో భూస్వాములకు వ్యతిరేకంగా ఐక్యం కాకుండా ఆప గలుగుతున్నారు. వారిని చీల్చగలుగుతున్నారు. ఇదే విధంగా ప్రతి కులానికి చెందిన ప్రజా సామాన్యం ఆ కులంలోని పై వర్గాల పలుకుబడి లో ఉంటుంది. భూ స్వామ్య వర్గం కుల వ్యవస్థను రాజకీయ అవసరాలకు కూడా ఉపయోగిస్తోంది. భూస్వాములు, కులపెద్దలు లేక కులంలో ఒకరిద్దరు గా వుండే ధనిక, మధ్య తరగతి వ్యక్తులను చేరదీసి వారి ద్వారా ఓట్లను సంపాదించ ప్రయత్నించడం సర్వ సామాన్యo”
. “ఫ్యూడల్ వ్యతిరేక విప్లవం ద్వారా కుల వ్యవస్థను రద్దు చేయవలసిన పెట్టుబడిదారీ వ్యవస్థ మన దేశంలో అటువంటి పాత్రను నిర్వహించలేదు... ఇక సామ్రాజ్య వాదం రాజులు, మహారాజులతోపాటు వారి కులాలను కూడా తన ప్రయోజనాలకు వాడుకుంది. కుల ప్రాతిపదిక పై సైన్యాల నేర్పరచి వారి సాయం తో ఇతర కులాల కు చెందిన రాజులను ఓడించి వారి రాజ్యాలను ఆక్రమించుకున్నది. ఆ సైనికులకు ఇతర కులాల రాజులను పీడిస్తున్నా మనే అంశమే తప్ప బ్రిటీష్ సామ్రాజ్యాన్ని విస్తరించి బలపరుస్తున్నామనే అంశమే తెలియదు” అంటూ కులతత్వం పాలకులకు ఎలా ఉపయోగపడిందో చెప్పారు. ఈ చారిత్రిక అంశాలు ఈ నాటికీ చర్చనీయాంశాలుగా, సరైన అవగాహన లేని ఉద్యమ కారుల మధ్య విభజన గీతలుగా వున్నాయని గమనించాలి.
రాజ్యాంగం, చట్టం, కులతత్వం, ఎన్నికల రాజకీయాల ద్వారా రాజకీయ కులతత్వం ఎలా బలపడుతోందో డి.వి. సవివరంగా రాశారు. "భారతీయ సమాజంలో కుల వ్యవస్థ నేటికీ కొనసాగుతోంది. దీనికి పరాకాష్ట గా అస్పృశ్యత అమలులో ఉంది. మతవ్యవస్థతోపాటు, కుల వ్యవస్థ కూడా సామ్రాజ్యవాదానికి. ఫ్యూడలిజానికి వ్యతిరేక౦గా ప్రజలు ఐక్యం కావటానికి అవరోధంగా వుంటూ వచ్చింది.” అని ఆయన రాశారు.
కులవ్యవస్థ పట్టణాలలోను, పల్లెలలోను వేళ్ళూనుకొని యున్నది. ఇది కేవలం భూస్వామ్య అవశేషం మాత్రమే కాదు. నేటి పాలకుల చేతిలో ఆయుధం కూడా. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మత, సామాజిక, రాజకీయ, శాసన, చట్టపర మైన, సాంస్కృతిక మొదలైన అంశాల సంస్కరణలు కులతత్వాన్ని నిర్మూలించ లేకపోవడమే కాకుండా, అస్పృశ్య త లాంటి దాని పరమ అమానవీయ వ్యక్తీకరణను నిర్మూలించడం లో కూడా విఫలమయ్యా యని ఆయన సమీక్షించారు. “గాంధీ అస్పృశ్యతా నివారణ కు చేసిన కృషి విఫలమైనట్లే భారత పార్లమెంటు దీనికై చేసిన చట్టాలు (అస్పృశ్యతను నిషేధించే చట్టం) కూడా అమలు లోనికి రాకుండా పోయినాయి" అని రాశారు
కుల వివక్ష తగ్గిపోయిందని, భారత రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కలిగిస్తోందని పాలకులు ప్రచారం చేస్తుంటారు. ఎస్సీలలో చాలా మంది ప్రముఖులు ఉన్నారని పాలక వర్గాలు పేర్కొంటున్నాయి. 1960-62లోనే దళితుడు దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారని, ఆ తర్వాత ఒక దళిత రాష్ట్రపతి, ఒక ఉప ప్రధాని, ఒక దళిత మహిళా సిఎం, కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, అత్యున్నత న్యాయ స్థానాల్లోని న్యాయమూర్తులు, వీసీలు, యూజీసీ ఛీప్ వంటి ఉన్నత పదవులతో సహా పలువురు సీఎంలు ఉన్నారు. భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించిన డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్, న్యాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయా కులాలలోని కొందరు వ్యక్తులు పదవులు, ఉద్యోగాలు పొందటం చూపించి కులమంతా అభివృద్ధి చెందినది అని చెప్పటం భ్రమలు కల్పించటమే అవుతుంది. ఈ సందర్భంలో భారత రాజ్యం యొక్క దోపిడి అనుకూల స్వభావం కారణంగా “వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు, సామాన్య ప్రజానీకానికి సంబంధించినంత వరకు అమలు కావడం లేదు." అని విమర్శించారు. దీనికి విప్లవాత్మక ప్రత్యామ్నాయం ఆవశ్యకమని నొక్కి చెబుతారు.
విశ్వవిద్యాలయాలలో అభివృద్ధి చెందుతున్నకులతత్వ ధోరణుల గురించి 1981 లో డి.వి. ఇలా రాశారు: “విద్యావంతులలో కుల ఉన్మాదం పెచ్చు పెరిగి పోతున్నది. విద్యార్థులు కులాలుగా చీలి ఘర్షణ పడటం ఒక సాధారణ దృశ్యంగా మారింది. విశ్వవిద్యాలయ అధ్యాపకులలో (లెక్చరర్లు మరియు ప్రొఫెసర్లు) కుల సంఘాలు ఏర్పడ్డాయి. పాలకవర్గాలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఐక్య శక్తిగా ఎదగడానికి బదులుగా, వారు కుల ప్రాతిపదిక న చీలిపోయి ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారని” స్పష్టంగా చెప్పారు. “వర్గ పోరాటాల నుండి ప్రజలను మళ్లించ డానికి ప్రభుత్వం ప్రజలను కులతత్వం అనే బురదలోకి లాగింది. ఈ ఉద్దేశ్యంతోనే కులసంస్థలకు (హాస్టళ్లు మొదలైన వి) ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అలాంటప్పుడు అవి వర్గ సంస్థలుగా ఎలా ఉండ గలవు?” అని ఆయన ప్రశ్నించారు.
ఒక నిర్దిష్ట కులంలో ఒక గ్రామంలో దోపిడీకి గురయ్యే వారు [పీడిత వర్గం] ఎక్కువగా ఉంటే, మరొక గ్రామం లేదా గ్రామాలలో అదే కులం ఆధిపత్యo వహిస్తూ పీడక దోపిడీ వర్గం గా ఉంటుంది. ఇలాంటివి గణనీయ మైన సంఖ్యలో ఉన్నాయి. యాదవ సేన, కుర్మీ సేన, వన్నియార్ ముఠాలు ఇలా ఎన్నో ధనిక వర్గ ముఠాలు గ్రామీణ పేదలు ఎస్సీ, ఎస్సీయేతర కులాల పై సాగిస్తున్న అణచివేత, సంబంధిత బహుజన రాజకీయాలను ఈ సందర్భంలో మనం చూడవచ్చు. కుల ఉద్యమాలు ఇప్పుడు నూతన రూపాలతో, కొత్త పేర్లతో కొత్త సంస్థలుగా నిరంతరం పుట్టుకొస్తు న్నాయి. అయితే వాటి స్వభావం దాదాపు ఒకటిగానే వుంటున్నది. కనుక వీటిని అర్ధం చేసుకోవటంలో నాడు డి. వి. చేసిన విశ్లేషణ ఉపయోగకరంగా వుంటుంది.
“భూస్వామ్య వ్యవస్థ, దాని వ్యక్తీకరణయిన కుల వ్యవస్థ మనుగడ భారతదేశంలోని ప్రస్తుత రాజకీయ వ్యవస్థతో ముడిపడి ఉంది. మన దేశంలో అర్ధ బానిసత్వం, అర్ధ భూస్వామ్య సంబంధాలకు ఆర్థిక పునాది ఉంది. వ్యవసాయ కూలీలు, పేద రైతులు, పారిశ్రామిక శ్రామికులు ఉన్న గ్రామీణ, పట్టణ పేదలలో అధిక సంఖ్యాకులు హరిజనులు (అస్పృశ్యులు) అని పిలువబడే కొన్ని కులాలకు చెందిన వారు. ఇవి గణనీయమైన సంఖ్యలో వున్నాయి. కుల తత్వం యొక్క వెన్నెముక ఈ సమాజంలోని ఉన్నత వర్గాల అవసరాలలోఉంది. ఉన్నత వర్గం రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసం కుల విభజనను వినియోగిస్తోంది. కాబట్టి భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించడం కుల విభజన ను, అస్పృశ్యతను నిర్మూలించ డానికి అవసరమైన మొదటి కర్తవ్యం.”
[కొన్ని దౌర్జన్యకర] సంఘటనలు తరచుగా నిమ్న కులాలు అని పిలువబడే వారిపై అగ్రవర్ణాలు చేసిన దురాగతా లుగా వర్ణించబడతాయి. నిజమే, భూస్వాములు తమ రాజకీయ అధికారాన్ని, ఆర్థిక ఆధిపత్యాన్ని ఉపయోగించి పేద వర్గాలను విడదీయ గలిగారు. దౌర్జన్యాలకు పాల్పడే సందర్భాలలో వారు తమ కులాలకు చె౦దిన బీదలను తరచూ ఉపయోగి౦చుకోగలుగుతున్నారు. కులతత్వం అనే అంశం ఈ వర్గాలన్నింటి లోనూ ఉన్నప్పటికీ, అవి ప్రధానంగా గ్రామీణ పేదలపై భూస్వాములు చేసే దౌర్జన్యాలు... ఈ ఘర్షణలను కులాంతర శత్రుత్వాలుగా వర్ణించడమంటే ప్రజలను తప్పుదారి పట్టించడమే” “ప్రస్తుత రాజకీయ వ్యవస్థ కొనసాగినంత కాలం సంఘ సంస్కరణోద్యమాలు, చట్టబద్ధమైన రక్షణలు పీడిత కులాలను ఎన్నటికీ విముక్తం చేయలేవని అనుభవం చూపించింది. ఎందుకంటే ఈ వ్యవస్థ విదేశీ ప్రయోజనాలను, భూస్వాముల మధ్య ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించిన వారిని కాపాడుతుంది.” అని కుల వ్యతిరేక పోరాటవాదులు గుర్తించాలి. ఒక మహత్తర కార్యక్రమాన్ని, విధానాన్ని అవలంబించి, అణచివేతకు గురైన ప్రజల విముక్తి కోసం, కుల తత్వాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్న శక్తులతో వారు ఏకం కావాలి.
పాలకవర్గాల ప్రలోభాల వల్ల యూపీ, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, తమిళ నాడు మొదలైన రాష్ట్రాల్లోని అంబేడ్కర్ వాదులు ప్రలోభాలకు గురై, ఎలా చిక్కుల్లో పడ్డారో మనం మునుపెన్నడూ లేనంత స్పష్టంగా చూడగలం. వారు ఒకవంక ప్రగతిశీల వాదులనబడే వారితోనూ, మరోవంక బ్రాహ్మణ వాదులుగా పిలువబడే శక్తుల తోనూ చేతులు కలుపుతున్నారు. వివిధ సందర్భాలలో బిఎస్ పి కాంగ్రెస్ తోను, బిజెపితో కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు చేతులు కలిపింది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులమని చెప్పుకునే కొందరు కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ తో, బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఎతో చేతులు కలిపారు. వారిలో కొందరు బిజెపిలో కూడా విలీన మయ్యారు.
“ఓట్లు, పార్లమెంటు, చట్టసభల్లో ప్రాతినిధ్యం, ఉద్యోగాలు, ఇతర సౌకర్యాలు మొదలైన వాటి కోసం కులతత్వాన్ని ప్రోత్సహించడంలో పార్లమెంటరీ పార్టీలన్నీ తమ వంతు పాత్ర పోషిస్తాయి. అటువంటి పార్టీల నుండి కులతత్వాన్ని నిర్మూలించాలని ఆశించడం అత్యాశ. కులనిర్మూలన కోరుకునే వారు మన దేశంలో పనిచేస్తున్న శక్తులతో ఏకం కావాలి.” అన్నదే ఆయన నిశ్చితాభిప్రాయం.
అగ్రవర్ణాల అణచివేతకు వ్యతిరేకంగానే కాదు, అన్ని రకాల అణచివేతలను వ్యతిరేకించడానికి, ప్రతిఘటించడానికి, అణచివేతకు గురైన వారు తమ విమోచన మార్గంలోనే ఉందని గ్రహించాలి. "కులతత్వం ఒక రాజకీయ నీచుడి మొదటి అస్త్రం" అని మనం చెప్పాలి. “కులతత్వం ఉన్నందున, ప్రజలను ఏకం చేయడం సాధ్యం కాదని చెప్పే ఒక సిద్ధాంతం ఒకటి ఉంది. కానీ ఇది తప్పు. ప్రజా ఉద్యమాల ద్వారా మనం కులతత్వాన్ని అధిగమించగలం.” అని ఆయన విశ్వాసం. అయితే “భారత దేశం లో ఏ మూలనైనా కుల తత్వమూ, కుల విభేదాలున్నంత వరకూ గ్రామీణ ప్రజల మధ్య ఐక్యత ఏర్పడటం కల్ల. అని తెలంగాణ సాయుధ పోరాట అనుభవాల వాస్తవ చిత్రాన్ని మన ముందుంచారు. అంతే కాదు “పట్టణాలే కులతత్వ వాద సిద్దాంతాలకూ, సంస్థలకూ, పోషకులకూ కేంద్రాలని మనం గుర్తించాలి. వారి విద్యాలయాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలన్నీ ఇక్కడే కేంద్రీకరించి ఉంటాయి.” కానీ గ్రామాలలోని ఉద్యమ ప్రభావం పట్టణాలలోనూ పడుతుంది కనుక వ్యవసాయ ప్రజాతంత్ర కార్యక్రమంతో ఆ చైతన్యంతో కులతత్వ దాడిని ఎదుర్కోవాలి.’ అని ఆయన సూచించారు.
ఈ మౌలిక విమోచన మార్గం కాదని, తాత్కాలిక విజయాలకోసం, ప్రయోజనాలకోసం అడ్డదారులలో వెళితే, ఆ సంస్కరణ లన్నీ పాలక ప్రయోజనాలను నెరవేరుస్తూ, కుల వ్యవస్థను మరింత బలీయం చేస్తాయి.

