చెంచులకు నాటి సిరులు నేడేవి...
x

చెంచులకు నాటి సిరులు నేడేవి...

చెంచు తెగ నల్లమలలోనే ఉండే గిరిజనులు. వీరు ఒకప్పుడు నల్లమల అడవుల్లో వేట, ఆహార సేకరణతో హాయిగా బతికే వారు. నేడు ఆ సిరులు ఎందుకు లేవు?


ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవుల్లో నివశిస్తున్న చెంచు గిరిజనులకు ఆహార భద్రత కరువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నల్లమల అడవి విస్తరించి ఉంది. నల్లమలకు మధ్య కృష్ణానది ప్రవహిస్తోంది. ప్రకృతి అందాలకు నల్లమల పెట్టింది పేరు. ఈ అడవిలో నివశించే ప్రిమిటివ్‌ వనరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌ (పివిటిజి) చెంచులు. వీరు ఆదిమ జాతికి చెందిన వారు. అడవులే వారి ఊపిరి. అడవులే వారికి ఆధారం. ఇప్పుడు అడవుల పరిస్థితి ఏమిటి? ఎందుకు వారికి ఆహార భద్రత కరువైంది.

వర్షాభావంతో దెబ్బతిన్న అడవి..
పూర్వం నల్లమల అడవిని కాకుల దూరని కారడవిగా చెప్పేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో చిట్టడవిగా మారింది. పెద్దపెద్ద మాన్లతో మనిహి నిలబడి పైకి పూర్తిగా చూడలేనంత ఎత్తులో చెట్లు ఉండేవి. అడవుల సంరక్షణ లేకపోవడం, వర్షాభావం ఏర్పడటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. గతంలో నిత్యం పచ్చదనంతో అలలారుతూ ఉండే చెట్లే గిరిజనులకు ఆహారాన్ని అందించేవి. ఆ చెట్ల మధ్య తిరిగే జంతువులను కూడా వేటాడి తినేవారు. అందుకే వారు పూర్వం ఎంతో ధృఢంగా ఉండేవారు. కానీ నేడు చెంచుల పెరుగుదల గిడసబారింది. జనాభా పెరుగుదల అలాగే ఉంది. శరీర దారుఢ్యం కూడా లేదు.
ఆహార భద్రత లేకుండా పోయింది
వేట, ఆహార సేకర ణ చెంచుల నిత్య జీవితంలో భాగం. వారికి నేడు ఆహార భద్రత లేకుండా పోయిందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ఎక్కువ కాలం గిరిజన సంక్షేమ శాఖలో డైరెక్టర్‌గా పనిచేసిన వాడ్రేవు చినవీరభద్రుడు చెప్పారు. నల్లమలలోని చెంచు గిరిజనులను ఆటవిక జీవనం నుంచి వ్యవసాయం రంగం వైపు తీసుకు రావాలనేది ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకోసం పలు పథకాలు అమలు చేస్తూ అడుగులు వేస్తుందన్నారు. ఒకప్పుడు ఉన్న అటవీ ఉత్పత్తులు వారికి నేడు అందటం లేదని, నిదానంగా జీవితం నుంచి ఆధునిక జీవనంపైపు వారిని మల్లించాలని ప్రభుత్వాలు సాగుతున్నట్లు చెప్పారు.
అటవీ ఉత్పత్తుల తోనే పోషణ
బంక చెట్లతో చెంచుల బతుకు చిత్రం ప్రాంభమయ్యేది. ఉదయం లేవగానే ఎక్కువ మంది బంక సేకరణకు బయలు దేరేవారు. సేకరించిన బంకను గిరిజన సహకార స్టోర్స్‌లో అమ్మి వచ్చిన డబ్బుతో గింజలు కొనుక్కునే వారు. నాడు చిరుధాన్యాలు ఎక్కువగా గ్రామాల్లో పండించే వారు. పుట్టలల్లో పుట్టతేనె, చెట్టు తొర్రల్లో ముసర తేనె, కొండ చరియాలు, ఎత్తుగా ఉండే పెద్ద చెట్ల కొమ్మలకు పెద్దపేరీగల తేనె తుట్టెలు, చిన్న చిన్న చెట్ల కొమ్మలకు పుటకతేనె తుట్టెలు, కంప చెట్లల్లో జున్నుతేనె, పొలాల గట్లపై ఉండే కంప చెట్లకు ముసరి తేనె తుట్టెలు, కన్నుగుల్లతేనె వంటి తేనె తుట్టెలు రాల్పి దాని నుంచి వచ్చిన తేనెను తీసి సీసాల్లో పెట్టి అడవిలో రోడ్డు పక్కన పెట్టి ప్రయాణికులకు అమ్మే వారు. ఎప్పుడూ ఇంట్లో పుటకతేనె, పెద్దతేనె సీసాల్లో నిల్వ ఉంచుతారు. అప్పుడప్పుడు రాగిరొట్టె, జొన్న రొట్టెలకు పైన రాసి తింటారు. ఆ రొట్టెలు చాలా బాగుంటాయి.
తరువాత ఏ సీజన్‌లో పండే కాయలు కోసి అమ్ముకుంటారు. ఈ కాయలను జీసీసీ వారు కొనుగోలు చేస్తారు. పండు కింతకాయలు, కుంకుడు కాయలు, ఉసిరి కాయలు జీడి పప్పు గింజలు సేకరిస్తారు. అలాగే నేరేడు పండ్లు, కలే కాయలు, జాన కాయలు, బలుసు పండ్లు వంటివి, ముష్టి గింజలు, నేల ఉసిరి ఆకు, తిప్పతీగ వంటి రకరకాల వన మూలికలు కూడా వారు సేకరిస్తారు. ఇవన్నీ జీసీసీ వారు కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో ఆ ఊర్లోనే గింజలు కొనుక్కుని వెళతారు. ప్రకాశం జిల్లాలోని పెద్ద దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లల చెరువు, గిద్దలూరు, రాచర్ల, అర్థవీడు, గుంటూరు జిల్లాలోని వెల్తుర్తి, శిరిగిరిపాడు, మాచర్ల, నాగార్జున సాగర్, కర్నూలు, కడప జిల్లాల్లోని పలు మండలాల్లో వీరు జీవిస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య సుమారు 3లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
బీడీ ఆకు సేకరణ కూడా ఒకటి. నెల రోజులు పని ఉంటుంది. చెట్టు పైకీ ఎక్కి ఆకులు కోసి వడిలో వేసుకుని కిందకు దిగిన తరువాత కట్టలు తడతారు. వాటిని కొనుగోలు చేసే వ్యాపారులు ప్రత్యేకంగా ఉంటారు. ఆకులు కోసాక చెట్లు ఇగురు పెట్టి వచ్చే సంవత్సరానికి చెట్టు పెద్దగా అవుతుంది. వెదురు తోపుల నుంచి పట్టుడు కర్ర, ముల్లు కర్ర. బొంగులు, వెదురు ఎండు కర్ర, దీన్ని పేపర్‌ మిల్స్‌ కర్ర అంటారు. మాడపాకు వంటివి సేకరించి అమ్ముకుంటారు. వీటికోసం అడవిని కాపాడుకుంటూ ఆ ఏరియాలల్లో ఉన్న దేవుళ్ల బొమ్మలకు పూజలు చేసి దండం పెట్టుకుంటారు. ఎవరి ఏరియాలో వారు ఆకాలాల్లో తెస్తుంటారు. ఇప్పుడు కాస్త గ్రామాల్లోకి వచ్చి వారు సేకరించిన వస్తువులు అమ్ముతున్నారు. 25 ఏళ్లకు పూర్వం వీరు అటవీ ఉత్పత్తులు సేకరించి వాటినే తినే వారు. అమ్ముకోవడం ఎలాగో వారికి తెలియదు. కాల క్రమంలో జిసిసి వారు ఏర్పాటు చేసిన డిపోల్లో అమ్ముకోవడం మొదలు పెట్టారు.
పెరిగిన క్రూర మృగాలు
నల్లమలలో క్రూర మృగాల సంఖ్య పెరిగింది. ప్రధానంగా పులుల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న పులులు ఇప్పుడు సుమారు 80కి చేరినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అవే కాకుండా అడవి బర్రెలు కూడా అడవిలో ఇటీవల కనిపించాయి. ఏనుగులను తెచ్చి వదలాలని అటవీ అధికారులు నిర్ణయించారు. క్రూర మృగాల వల్ల జన సంచారం కాస్త తగ్గుతోంది. తోడేళ్లు, ఎలుగు బంట్లు, నక్కలు, పిల్లులు వంటి జంతువుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
తగ్గుతున్న సాధు జంతువులు
నల్లమలలో ఒకప్పుడు జింకలు, పొడ దుప్పులు, అడవి గొర్రెలు, అడవి మేకలు, అడవి బర్రెలు, ఎనుబోతులు, పలు రకాల పక్షులు, సరీసృపాలు వంటి వాటి సంఖ్య ఏడాదికేడాది తగ్గుతోంది. చెంచులు ప్రధానంగా వేటపై ఆధారపడి జీవిస్తుంటారు. వేటాడే జంతువుల సంఖ్య చాలా తగ్గిందని చెబుతున్నారు. బాణాలతో వేటాడటం వీరికి అలవాటు. ఇంటి ముందు నులక మంచంపై పండుకొని పైన వెళ్లే పక్షిని ఒక్క బాణంతో కింద పడేలా కొట్టగలిగే గురి వారికి ఉంది. ఎప్పుడైతే అడవుల్లో చెట్ల పెరుగుదల బాగా తగ్గిందో జంతువుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.
చెంచుల్లో ప్రొటీన్‌ లోపం
చెంచుల్లో ప్రొటీన్‌ లోపించింది. జంతు మాంసం ద్వారా ఎక్కువగా చెంచులకు ప్రొటీన్‌ ఉండేది. ప్రస్తుతం వారిని ఆహార భద్రత వేదిస్తోంది. కూడా బెట్టాలనే ఆలోచన వారికి లేదు. ఏ పూటకాపూట తినడానికి ఉంటే ఆనదంగా జీవిస్తారు. ప్రభుత్వం సివిల్‌ సప్లైస్‌ రైస్‌ను వారికి ఇస్తోంది. ఈ రైస్‌లో వారికి కనీస పౌష్టిక విలువలు లేవనేది పలువురు చెబుతున్న మాట. అక్కడక్కడ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద పనులు చేయించి డబ్బులకు బదులు బియ్యం, ఇతర నిత్యావసరాలు ఇస్తున్నా అందులో పోషక విలువలు ఉండటం లేదని గూడేలు సందర్శించిన వైద్యులు చెబుతున్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం తింటే రక్తహీనత లేకుండా ఉంటుందని, ఆరోగ్యంగా జీవించ గలుగుతారని చెప్పారు.


Read More
Next Story