బిఆర్ ఎస్ నేతల భాషను ప్రజలు ఆమోదిస్తారా?
x

బిఆర్ ఎస్ నేతల భాషను ప్రజలు ఆమోదిస్తారా?

రాజకీయంగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కసితో, దూషణలతో ఎదుర్కోవాలనే ధోరణి బిఆర్ ఎస్ లో కనిపిస్తూ ఉంది. ఈ మాటల యుద్ధం వల్ల ఎవరికీ మేలు జరగదు.



"ఎందుకు మీ పాలన కొంచెం సిగ్గు కూడా అనిపించడం లేదా ?" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష గురించి బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్ కేటి రామారాావు అన్నమాటలో ఉన్న భాష ఏమిటి? సమాజం సిగ్గుతో తలవంచుకునే పదాలు వాడడం నేరమే! స్పీకర్ న్యాయవ్యవస్థ ఉక్కుపాదం మోపాలి

--- వడ్డేపల్లి మల్లేశం


నిరక్షరాశ్యు లైన రాజకీయ నాయకులు ఈ దేశాన్ని పాలించిన సందర్భాలు అనేకం. కానీ ఆనాడు అశ్లీల మొరటు భాషను వాడలేదు. ప్రతిపక్షాలను అయినా ప్రభుత్వాలు గౌరవించి ఆదరించిన సందర్భాలు చివరికి ప్రతిపక్షాలకు చెందిన వాళ్లైనా తెలివి కల విజ్ఞాన వంతులయితే మంత్రివర్గంలో తీసుకున్న ఆనవాళ్లు కూడా ఉన్న దేశం మనది.

కానీ ప్రస్తుత రాజకీయాలలో అధికారంలో నిరంతరం కొనసాగి ప్రజల ఆగ్రహానికి గురైనటువంటి అనేక రాజకీయ పార్టీలు అక్కసుతో అధికారానికి వచ్చినటువంటి పార్టీలను నిందించడం, దూషించడం, చివరికి కుసంస్కారముతో కూడుకున్న భాషను మాట్లాడడం చూస్తున్నాం. అలాంటి మాటలు మాట్లాడిన సందర్భాలను మీడియా ద్వారా సమీకరించి స్పీకర్ న్యాయవ్యవస్థ ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ జరిపించి దోషులకు శిక్ష విధించినప్పుడు మాత్రమే రాజకీయాలు నీతివంతంగా కొనసాగుతాయి .

సామాజిక రాజకీయ చైతన్యముతో కూడుకున్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తే నేరస్తులనే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. చైతన్యవంతులైన వారిని అర్బన్ నక్సలైట్లు అనడంఏమిటి. ఆలాంటి పేరుతో ముద్ర వేయడం కూడా ఆక్షేపణీయమే కదా! భారత సర్వోన్నత న్యాయస్థానం ఒక సందర్భంలో "అభ్యుదయ భావజాలం, చైతన్యంతో కూడుకున్నటువంటి ధోరణి, సామాజిక మార్పుకు దోహదపడే భావజాలాన్ని కలిగి ఉండడం నేరం కాదు" అని ఇచ్చిన తీర్పును పరిశీలించవలసిన అవసరం ఉన్నది.

కనుక ప్రశ్నించే ప్రతిఘటించే స్వభావం ప్రజాస్వామ్యంలో కీలకమైనప్పటికీ అలాంటి వాళ్లను అర్బన్ నక్సలైట్లు పేరుతో ముద్ర వేయడం రాజ్యాంగం విరుద్ధమే గాక వారి హక్కులను కాలరాయడమే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి జరిగిన ఘర్షణను పరిశీలిస్తే ప్రతిరోజు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడమే కనిపించింది. రాష్ట్రానికి ప్రధాని వచ్చిన కనీసం గౌరవపూర్వకంగా పలకరించి స్వాగతించినటువంటి సందర్భం ఈనాడు లేకపోగా కేంద్ర మంత్రిని రండా అని రకరకాల పేర్లతో దూషించడం ఈ విషయంలో జరిగిన చర్చ లో పాల్గొంటూ ఒకసారి టీవీ ప్రసారంలో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఎప్పుడెప్పుడు ఏం మాటలు మాట్లాడినారో అందరికి తెలుసు. అన్ని కూడా వివరంగా యుట్యూబ్ లో ఉన్నాయి.

రాజకీయ నాయకులు నువ్వు ఒక్కటంటే నేను రెండంట అనే విధంగా మాట్లాడిన తీరు ఆధునిక సమాజానికి సిగ్గుచేటు . ఈ మధ్య తెలంగాణలో ఇది తీవ్రమయింది. కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిపాలన చేయకుండా అడ్డుకోవడం, హామీలు ఎప్పుడూ అమలు చేస్తావు, నిధులు ఎక్కడ తె స్తావు అంటూ నిలదీయడంలో ఎక్కడ లేని ఆదుర్దా కనిపిస్తుంది.. ఒక ప్రభుత్వం తనను ఎన్నుకున్నటువంటి ప్రజల ఆకాంక్షలు అభిప్రాయాలను గౌరవిస్తూ పాలించడం సర్వసాధారణం. అక్కడ ప్రజలకు అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైతే ఆ ప్రభుత్వాలను తి ప్పికొట్టే అధికారం ప్రజలకు ఉంటుంది అనేది నగ్న సత్యం. ఆ కోణంలోనే పదేళ్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి భవిష్యత్తుకు చేసిన ద్రోహానికి ప్రతిఫలంగా ప్రజలు తృణీకరించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్న విషయం తెలిసిందే .
అలాంటప్పుడు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన పని చేస్తున్నామని చెప్పుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ నిరంతరం అని మర్యాదాలను ధిక్కరిస్తూ పోవడమే కాకుండా అనేక సందర్భాలలో దుర్భాషలాడటం కనిపిస్తుంది. అది అభిలషణీయధోరణి కాదు. ప్రభుత్వానికి సిగ్గులేదు అని అపరిపక్వ మాటలతో మాట్లాడడంపై "ఇంకానా ఇకపై సాగదు" అనే రీతిలో న్యాయస్థానం జోక్యం చేసుకొని ఈ రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణంలో రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం చాలా ఉన్నది .
కేటీఆర్ ప్రయోగిస్తున్న భాష

ఆసరా పథకం కింద వృద్ధులకు మంజూరు అవుతున్నటువంటి పెన్షన్ డబ్బులతో రంగారెడ్డి జిల్లా పోతుగల్ గ్రామానికి చెందినటువంటి 200 మంది వృద్ధులు మనిషికి 20 రూపాయలు వేసుకొని షాద్నగర్ చేవెళ్ల రహదారి గుంతలతో అధ్వాన్నంగా ఉంటే పూడ్చి వేసినారని వృద్ధులకు దక్కాల్సినటువంటి పెన్షన్ డబ్బులతో రోడ్లు మరమ్మత్ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకని వృద్ధులు పెన్షన్ డబ్బులతో మరమ్మతు చేస్తుంటే మీకు సిగ్గు లేదా అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ యొక్క రెచ్చగొట్టే తత్వానికి,కుసంస్కారానికి నిదర్శనగా భావించాలి.కానీ రోడ్ల దుస్థితిలో తమ పాత్రకూడా ఉన్నదని భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) గుర్తించకపోవడం విచారం.

"మాకు దుర్భాషలు రావు మేము సంస్కారంగా మాట్లాడతాము" అని అనేక సందర్భాల్లో బిఆర్ఎస్ నాయకులు చెప్పారు. కేటీఆర్ లాంటి విద్యావంతులైన నాయకులు నిర్మాణాత్మక సూచనలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఆలోచింప చేయాలి కానీ " ఇదేం పాలన సిగ్గు లేదా" అని ముఖ్యమంత్రిని మంత్రివర్గాన్ని ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు.

పదేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో ఇచ్చినటువంటి హామీలు గంపెడైతే అనేక హామీలను తుంగలో తొక్కి సాగు చేయని వేల ఎకరాల భూములకు రైతుబంధు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాన్ని పెంచి పోషించి, నిర్మించిన అనేక ప్రాజెక్టులు దేవాలయాలు, భవనాలు నాణ్యత లేకపోగా కాలేశ్వరం ప్రాజెక్టు కథ అందరికీ తెలిసిందే కదా!

బిఆర్ ఎస్ పాలనా కాలంలో పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని బుద్ధి జీవులు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు రచయితల పైన ఉక్కు పాదం మోపి కనీసం సభలు కూడా పెట్టుకొని ఇవ్వలేదు. అంతేకాదు తెలంగాణ జేఏసీకి చైర్మన్ గా పని చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి అరెస్టు చేయడం, నిరసనకు వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిర్మించినటువంటి ఇందిరా చౌక్ ను ఎత్తివేసినటువంటి మీ ప్రభుత్వ ధోరణి ఏ రకంగా ప్రజా పాలన అవుతుందో అర్థం చేసుకోవాలి.

అనేక రకాల ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడి హామీలను నెరవేర్చకుండా దాటవేసి అధికారాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించి చివరికి బుద్ధి జీవులు మేధావులతో తిరస్కరించబడి నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో" టిఆర్ఎస్ కు ఓటు వేయద్దు" అని మేధావులు గ్రామ గ్రామాన తిరిగి చెప్పింది మీరు ఆ ప్పుడే మరిచిపోయినారా ? ప్రజలచే తిరస్కరించబడిన మీరు నూతనంగా వచ్చిన ప్రభుత్వానికి సమయాన్ని ఇవ్వడం ద్వారా క్రియాశీలకంగా పని చేసే విధంగా ప్రోత్సహించవలసిన బదులు నిత్యం మాటలతో దాడులు చేయడం, ప్రభుత్వాన్ని బెదిరించడం, లొంగదీసుకునే ప్రయత్నం చేయడం వంటి అనాలోచిత చర్యలకు పాల్పడితే ప్రజలు ఆ పార్టీని సీరియస్ గా తీసుకోరు.
ముఖ్యమంత్రిని దొంగ అని కత్తులు పెట్టుకొని తిరుగుతాడా అంటూ రకరకాల మాటలు మాట్లాడి చిత్రీకరించిన బిఆర్ ఎస్ ధోరణి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది . ఈ మాటల ధోరణి సహించడానికి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు సిద్ధంగా లేరని ఇటీవల ఎన్నికలు రుజువుచేస్తున్నాయి. ప్రజలకు ఉన్నటువంటి హక్కులను కాలరాచే ఏ ప్రభుత్వమైనా అంతమైపోతుంది అదే సందర్భంలో పాలకులను నిందించి పని చేయకుండా చేసే ప్రతిపక్షాలకు కూడా నూకలు చెల్లుతాయి అని తెలుసుకుంటే మంచిది .

మాట మాటకు "సిగ్గులేదా, ఇదేం పరిపాలన, తెలివి తక్కువ దద్దమ్మలు, సన్నాసులు" అంటూ మాట్లాడే అరాచక వాదాన్ని దృఢహస్తంతో ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ అంతం చేయాల్సిన అవసరం ఉంది .ఈ విధానాన్ని న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి ఇలాంటి వారి పైన ఉక్కు పాదం మోపాల్సినటువంటి బాధ్యత న్యాయవ్యవస్థ,పౌరసమాజంపై ఎంతగానో ఉన్నది. అప్పుడు మాత్రమే " ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాయి పనిచేయకుంటే ప్రజలు తిరస్కరిస్తారు తమకు అవసరమైనటువంటి రాజకీయ పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటారు" అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన సూచన ఎప్పుడైనా అమలులోకి వచ్చేదే .

పెద్దరికాన్ని తమ భుజాల మీద వేసుకొని తమకే పేరు రావాలని ఆశించి బంగపడడం అత్యాశే అవుతుంది. కు సంస్కారంతో కూడిన భాషను ఏ రాజకీయ పార్టీ మాట్లాడిన భరించలేని పరిస్థితిలో ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటున్నారు అనే సోయి దుర్భాషలాడే వాళ్లకు ఉండాలి . "ప్రజా మద్దతును కూడగట్టుకోవడం కోసం ఆరాట పడాలి కానీ ఒంటరిగా నిందించడానికి బెదిరించడానికి ప్రయత్నిస్తే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ప్రజలే చరిత్ర నిర్మాతల కనుక ". టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం నాలుగు సంవత్సరాల వరకు కూడా ఆ ప్రభుత్వాన్ని ఎవరూ కూడా విమర్శించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎదురు దాడి చేయడం అంటే రాజకీయ నాగరికతను కోల్పోవడమే అవుతుంది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)


Read More
Next Story