
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
అమెరికా- ఇరాన్ చర్చలు ఎందుకు విఫలం అయ్యాయి?
శాంతి చర్చలు కొనసాగే అవకాశం ఉందా?
పశ్చిమాసియా ఘర్షణలు ఓ ముగింపు చేరుకుంటాయనే ప్రపంచం ఆశలపై అమెరికా- ఇరాన్ నీళ్లు చల్లాయి. కాల్పుల విరమణ ఒప్పందం పై గడువు ముగుస్తున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అణ్వస్త్ర ఆయుధాలు, హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో ఇస్లామాబాద్ కేంద్రంగా జరిగిన చర్చలు ప్రపంచాన్ని శాంతికి ఏమాత్రం దగ్గర చేయలేదు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం, జాతీయ అసెంబ్లీ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందంతో 21 గంటల పాటు చర్చలు జరిపాయి. అనంతరం జేడీ వాన్స్ ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం ఇస్లామాబాద్ నుంచి వాషింగ్టన్ బయలుదేరారు.
బయలుదేరే ముందు వాన్స్ మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ఇరుపక్షాల మధ్య కీలకమైన చర్చలు జరిగాయని, ఇరాన్కు ఏ విషయాల్లో సర్దుబాటు చేయగలమో, ఏ విషయాల్లో చేయలేమో అమెరికా స్పష్టం చేసిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల వెనక అంతరార్థం సుస్పష్టం. చర్చలు విఫలం అయ్యాయి. అయితే చర్చలకు మార్గం మూసుకుపోలేదని ఆయన చివరి వ్యాఖ్యలు సూచించాయి.
ఆయన మాట్లాడుతూ, “మేము ఇక్కడి నుంచి ఒక సరళమైన ప్రతిపాదనతో వెళ్తున్నాము. ఇది ఒక అవగాహన పద్ధతి. ఇదే మా చివరి, ఉత్తమ ప్రతిపాదన. ఇరానీయులు దీనిని అంగీకరిస్తారో లేదో చూద్దాం” అన్నారు.
అణు సమస్యపై....
వాన్స్ ప్రస్తావించిన ఏకైక నిర్దిష్ట విషయం అణు సమస్య మాత్రమే. ఈ అత్యంత ముఖ్యమైన అంశంపై ఆయన చెప్పినదాన్ని పూర్తిగా ఉటంకించాల్సి ఉంటుంది. "వారు అణ్వాయుధాన్ని కోరరని, అలాగే అణ్వాయుధాన్ని త్వరగా సాధించడానికి వీలు కల్పించే సాధనాలను కూడా కోరరని దానికి వారి నిబద్ధతను మనం చూడాలి" అని ఆయన అన్నారు. "అదే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడి ప్రధాన లక్ష్యం, ఈ చర్చల ద్వారా మేము సాధించడానికి ప్రయత్నించింది కూడా అదే." అని వాన్స్ అన్నారు
"వారి వద్ద ఉన్న ప్రస్తుతం యురేనియం శుద్ది చేసే సౌకర్యాలు ధ్వంసం చేశాము. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకూడదనే సంకల్పంతో కూడిన ప్రాథమిక నిబద్ధతను మనం చూస్తున్నామా? కేవలం ఇప్పుడే కాదు, కేవలం రెండేళ్ల తర్వాత కాదు, దీర్ఘకాలంలో. అది మనం ఇంకా చూడలేదు. మనం చూస్తామని ఆశిస్తున్నాము" ప్రక్రియ ఇంకా ముగియలేదు అని వాన్స్ పేర్కొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సమస్యపై తరువాత అడుగు ఏంటీ?
ప్రస్తుతానికి, కాల్పుల విరమణ ఏప్రిల్ 21-22 వరకు కొనసాగుతుంది
ఇరాన్ తన బలమైన అస్త్రమైన హార్ముజ్ను వదులుకునే అవకాశం లేదు
అణ్వాయుధాల హామీ అనేది అమెరికా రాజీపడని డిమాండ్గా కొనసాగుతుంది
పాకిస్థాన్ సహా ఇతర దేశాలు తెరవెనుక మధ్యవర్తిత్వాన్ని కొనసాగిస్తాయి
ఏ పక్షమైనా ఆలస్యాన్ని తమకు అనుకూలంగా భావిస్తే కాల్పుల విరమణ విఫలమయ్యే ప్రమాదం పెరుగుతుంది
ట్రంప్పై ఇజ్రాయెల్ ఒత్తిడి ఇరాన్పై కొత్త దాడులకు దారితీయవచ్చు
భారతదేశం ఆందోళన చెందడానికి కారణాలు ఉన్నాయి. ట్రంప్ పాలనలో ఉత్తమ ప్రతిపాదనలు అనే పదం దౌత్యపరమైన వాటికంటే ఎక్కువగా వాణిజ్య చర్చలలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఇది స్థిరాస్తి వ్యాపారంగా మారింది.
ఆత్మరక్షణలో ఇరాన్...
ఈ చర్చల వైఫల్యానికి అమెరికానే కారణమని ఇరాన్ ఎప్పటిలాగే నిందించింది. ఆ దేశ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ఇస్మాయిల్ బఘీ తెలిపిన ప్రకారం, ఈ చర్చలలో హార్ముజ్ జలసంధి, అణు సమస్య, సంఘర్షణ నష్టానికి పరిహారం, ఇరాన్ దాని అనుచరులపై శత్రుత్వానికి ముగింపు, అలాగే ఆంక్షల ముగింపు వంటి అంశాలు చోటుచేసుకున్నాయని తెలిసింది.
ఇరాన్ తన హక్కులను కాపాడుకుందని కూడా ఆయన స్పష్టం చేశారు. 'తన హక్కులను కాపాడుకోవడం' అనే పదబంధం సాధారణంగా అణు నిరాయుధీకరణ ఒప్పందం (NPT)లో అంతర్లీనంగా ఉన్న శాంతియుత ప్రయోజనాల కోసం అణు సుసంపన్నతకు ఇరాన్కు ఉన్న హక్కును సూచించడానికి ఉపయోగిస్తారు.
ఇరాన్ అణ్వాయుధాలు లేని దేశంగా NPTపై సంతకం చేసింది. అంటే 1968లో కుదిరిన ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఇప్పుడు మొదటి అడుగు వేయాల్సింది అమెరికానే అని ఇరాన్ వాదన.
శాంతిని ప్రపంచం చూస్తుందా?
ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్లు ఒక ఒప్పందానికి రాని నేపథ్యంలో శాంతి అవకాశాలు ఎలా ఉన్నాయి? అమెరికా ప్రకటించిన కాల్పుల విరమణ ఏప్రిల్ 21-22 వరకు అమలులో ఉంటుంది. అందువల్ల, ఇరు పక్షాలలో ఎవరైనా లేదా ఇజ్రాయెల్ దానిని ఉల్లంఘించనంత వరకు దాడులు జరగవు. ఒక వేళ ఇజ్రాయెల్, అమెరికా దాడులకు దిగితే ఇరాన్ కూడా వాటి మిత్రపక్షాలపై ఎదురుదాడికి దిగుతుంది.
అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయని అనుకోవడం పొరపాటే. లెబనాన్ లో దాడులు, హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరకపోవడంతో ఇవి నివురుగప్పిన నిప్పులా ఉంటాయి. ముఖ్యంగా ఇరాన్ కు హార్ముజ్ జలసంధి చాలాకీలకం. వారు దానిని అంత తేలికగా వదలిపెట్టరు.
ఇరాన్ సంఘర్షణ కేవలం ఒక దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపే మరో ఆపరేషన్గా మారుతుంది. ప్రపంచం ఇరాన్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తుంది కానీ అంతకు మించి ఏమీ చేయదు. హార్ముజ్ జలసంధికి అదనంగా, భారతదేశంతో సహా ఈ ప్రాంతానికి అరబ్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ చర్య చాలా పెద్ద పరిణామాలకు దారితీసే విషయం ఏంటంటే గల్ఫ్ దేశాలలో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు.
దౌత్య శైలులు
ఇస్లామాబాద్ చర్చలు విఫలమవ్వడం వల్ల వెలుగులోకి వచ్చిన అంశాలలో ఒకటి. అమెరికా -ఇరాన్ల మధ్య ఉన్న విభిన్న దౌత్య సంప్రదింపుల శైలులు. ట్రంప్ హయాంలో, అమెరికా దౌత్య మెరుపుదాడి (డిప్లొమాటిక్ బ్లిట్జ్క్రీగ్) అని వర్ణించదగిన పద్ధతులను అనుసరిస్తుంది. ఇరాన్ సాంప్రదాయ దౌత్య శైలి సూక్ష్మమైనది, తొందరపాటు లేనిది. అది అస్పష్టత మార్గాన్ని, కొన్నిసార్లు ద్వంద్వార్థపు మాటలను కూడా అనుసరిస్తుంది. 'తీసుకోండి లేదా వదిలేయండి' అనే పద్ధతులను అది అంత సులభంగా అంగీకరించలేదు.
అంతేకాకుండా, టెహ్రాన్లో తుది నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారనేది ఇప్పుడు అనిశ్చితంగా ఉంది. సంప్రదింపుల తర్వాత ఒక సర్వోన్నత నాయకుడిని కూడా సంప్రదించాల్సిందే, ప్రత్యేకించి ఆయన కొత్తగా నియమితులైతే పెద్ద రాయితీలతో కూడిన కీలక నిర్ణయాలు తీసుకునేంత ఆరోగ్యంగా సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ ఉన్నారా? ఇదో పెద్ద ప్రశ్న.
ఏమి ఆశించవచ్చు..
ఈ చర్చలపై వాషింగ్టన్ డీసీలోనూ తీవ్ర చర్చలు ఉంటాయి. ఒకరిపై ఒకరు తీవ్రమైన, కఠోరమైన విమర్శలు కొనసాగిస్తున్నప్పటికీ ఇది జరుగుతుంది. అలాగే ట్రంప్ను కచ్చితంగా నిగ్రహించలేరు.
కాల్పుల విరమణ వల్ల పోరాటాన్ని కొనసాగించాలనే ఇరాన్ సంకల్పం బలహీనపడిందా లేదా అనేది సమస్య. కానీ ఇరాన్లో విలాయత్-ఎ-ఫఖీహ్ అనే మతసంబంధ వ్యవస్థ, పోరాటాన్ని కొనసాగించాలనే ప్రజల సంకల్పం తగ్గకుండా నిరోధించడానికి షహాదత్ (అమరత్వం) ప్రస్తావనలను సజీవంగా ఉంచుతుంది.
చర్చలు నిలిచిపోయినా లేదా విఫలమైనా, ప్రమాదం ఏమిటంటే, సమయం తమకు అనుకూలంగా ఉందని ఒక పక్షం లేదా రెండు పక్షాలు కూడా భావించి, కాల్పుల విరమణను విఫలమయ్యేలా చేయవచ్చు. అలా జరిగితే, అరబ్ గల్ఫ్ దేశాల చమురు, గ్యాస్ సౌకర్యాలు, పౌర ప్రాంతాలపై దాడులు చేయడానికి ఇరాన్కు అవకాశం కలుగుతుంది. అది అల్లకల్లోలం, గందరగోళంతో కూడిన పరిస్థితికి దారితీయవచ్చు.
మధ్యవర్తిత్వం కీలకం..
ఇజ్రాయెల్ ప్రోత్సాహంతో, ట్రంప్ ఖార్గ్ ద్వీపం, ఇరాన్ విద్యుత్ ఉత్పాదక సౌకర్యాలపై దాడి చేయడం ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పరిణామాన్ని నివారించడానికి, పాకిస్తాన్ చేపట్టిన మధ్యవర్తిత్వ పాత్రకు అదనంగా, వివేకవంతమైన దేశాలు కూడా తమ మధ్యవర్తిత్వ పాత్రను ప్రారంభించడం అత్యవసరం.
సహజంగానే, ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు ఫలితాలనివ్వనందుకు ప్రపంచం నిరాశ చెందింది. అది ఆందోళనతోనే కొనసాగుతుంది. దాని ఆర్థిక కష్టాలు కొనసాగుతూ మరింత తీవ్రమవుతాయి. తక్కువ కాలం ఉండే యుద్ధం కోసం ఆశిస్తూనే, సుదీర్ఘ యుద్ధానికి భారతదేశం సిద్ధపడటం వివేకవంతమైన చర్య. ఒకవేళ దురదృష్టవశాత్తు గల్ఫ్ దేశాలలో గందరగోళం ఏర్పడితే, దానిని ఎలా ఎదుర్కోవాలో అనే విషయంలో ప్రభుత్వం మరింత లక్ష్యసాధనతో సిద్ధపడటం కూడా అవసరం.
(ది ఫెడరల్ అన్ని వర్గాల వారి అభిప్రాయాలను అందించాలని కోరుకుంటోంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)
Next Story

