
మంత్రి గడ్డం వివేక్ పై బీఆర్ఎస్ దాడి
కార్మిక సంక్షేమశాఖ మంత్రి గడ్డం వివేక్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు మంగళవారం మధ్యాహ్నం దాడిచేశారు
మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి. కార్మిక సంక్షేమశాఖ మంత్రి గడ్డం వివేక్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు మంగళవారం మధ్యాహ్నం దాడిచేశారు. అయితే పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విషయం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు జరగాల్సిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో కొన్నింటిని అధికారులు మంగళవారానికి వాయిదా వేశారు. ఈరోజుకు వాయిదాపడిన 11 మున్సిపాలిటీల్లో క్యాతనపల్లి మున్సిపాలిటి ఎన్నిక కూడా ఒకటి.
ఈరోజు ఉదయం మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగానే మంత్రి వివేక్ మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్నారు. మున్సిపల్ ఆఫీసులోకి మంత్రి వెళ్ళేందుకు కారుదిగుతుండగా ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు దూసుకువచ్చారు. మంత్రికి వ్యతిరేకంగా గట్టిగా అరుస్తు కారుపైకి దాడికి ప్రయత్నించారు. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన మంత్రి వెంటనే కారులోకి వెళ్ళి కూర్చున్నారు. మంత్రి కారులోకి వెళ్ళటంతో అసహనం ఎక్కువైపోయిన బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే రాళ్ళతో దాడిచేశారు. రాళ్ళదెబ్బకు మంత్రి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే కారుదగ్గరకు చేరుకుని బీఆర్ఎస్ కార్యకర్తలపైకి ఎదారుదాడికి దిగారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి అందరినీ చెదరగొట్టడంతో కొద్దిసేపటికి పరిస్ధితి సద్దుమణిగింది. మున్సిపల్ ఆఫీసు చుట్టుపక్కల ప్రాంతంలో పోలీసులు ముందుజాగ్రత్తగా 144 సెక్షన్ విధించినా ఎలాంటి ఉపయోగం లేకపోవటం గమనార్హం.

