
కర్ణాటక కాంగ్రెస్ లో ఉప ఎన్నికల పోరు
తీవ్ర వ్యతిరేకత నడుమ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం
కర్ణాటక రాజకీయాలలో ఎంతో ఆసక్తి రేపిన బాగల్కోట్, దావణగెరె సౌత్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదంతో, బాగల్కోట్ నుంచి ఉమేష్ మేటిని, దావణగెరె సౌత్ నుంచి సమర్థ్ మల్లికార్జున్ను బరిలోకి దింపారు.
ఎమ్మెల్యే శ్యామనూర్ శివశంకరప్ప మరణంతో ఖాళీ అయిన దావణగెరె సౌత్ నియోజకవర్గం టికెట్ను ఆయన మనవడు, 27 ఏళ్ల సమర్థ్ మల్లికార్జున్కు కేటాయించారు. అయితే, ఈ నియోజకవర్గంలో 30 శాతం ఉన్న ముస్లిం సమాజ నాయకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని మైనారిటీ నాయకులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసి, కాంగ్రెస్ అభ్యర్థిని 50,000 ఓట్ల తేడాతో ఓడిస్తామని హెచ్చరించారు. ఈ హెచ్చరిక పార్టీలో లోతుగా పాతుకుపోయిన వర్గపోరాటాన్ని ఎత్తిచూపుతుంది. వారు షామనూర్ కుటుంబ ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
బాగల్కోట్లోనూ ఇదే పోరు.
బాగల్కోట్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే హెచ్వై మేటి మల్లికార్జున్ కుమారులు ఉమేష్, మహాదేవిల మధ్య టికెట్ కోసం బహిరంగ పోరు జరిగింది. ఈ కుటుంబ తిరుగుబాటును అణిచివేయడానికి, సీఎం సిద్దరామయ్య, ఉప సీఎం డీకే శివకుమార్ అర్ధరాత్రి సమావేశమై రాజీకి వచ్చారు. చివరకు, కుటుంబ ఏకాభిప్రాయం ఆధారంగా, కురుబ వర్గం ఓట్లను దక్కించుకునే లక్ష్యంతో ఉమేష్ మేటికి టికెట్ ఇచ్చారు.
కాంగ్రెస్ వ్యూహమేంటీ..
తిరుగుబాటు, అంతర్గత అసంతృప్తి నడుమ ఇద్దరు యువ అభ్యర్థులను కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. తమ నాయకుల మరణం వల్ల ఏర్పడిన సానుభూతి పవనం, ప్రభుత్వ హామీ పథకాల బలంతో రెండు నియోజకవర్గాల్లోనూ గెలుస్తామని అధికార పార్టీ ఇప్పుడు ధీమాగా ఉంది. ఈలోగా, ఈ రెండు నియోజకవర్గాల్లోని అసంతృప్త నాయకులను శాంతింపజేసేందుకు రాష్ట్ర స్థాయి నాయకులు ఒక వ్యూహాన్ని రూపొందించడంలో నిమగ్నమై ఉన్నారు.
Next Story

