
లోక్సభలో అవిశ్వాస వాతావరణం - స్పీకర్కు ఇండియా బ్లాక్ రాజీ సంకేతం..
స్పీకర్పై విమర్శలు ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు రాజీ సంకేతాలు పంపిన ఇండియా బ్లాక్ వ్యూహం.. పార్లమెంట్లో కొత్త చర్చకు తెరతీసింది.
లోక్సభలో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్.. స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ప్రభుత్వానికి ఒక రాజీ సూచన చేసింది. బడ్జెట్ చర్చ ప్రారంభానికి ముందు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఇదే సమయంలో, స్పీకర్పై అవిశ్వాస తీర్మానం తీసుకురావాలా? అనే అంశాన్ని కూడా ప్రతిపక్షం పరిశీలిస్తోంది.
ఫిబ్రవరి 9న కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సి) కింద స్పీకర్ను పదవి నుంచి తొలగించాలనే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ విషయంపై రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో ఇండియా బ్లాక్ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.
గత వారం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసినట్లుగా చెబుతున్న‘‘Four Stars of Destiny” పుస్తకం నుంచి కొన్ని వాక్యాలను చదవాలని రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం విఫలమవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అనంతరం ప్రధాని మోదీ సమాధానం ఇవ్వకుండానే సభ ముగియడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించాలని అనుకుంటున్నట్లు తనకు సమాచారం వచ్చిందని స్పీకర్ సభలో చెప్పడం, తరువాత 8 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
సోమవారం సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం పూర్తయ్యాక అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పినా కూడా.. కాంగ్రెస్ సభ్యులు అంగీకరించకపోవడంతో సభ పదేపదే వాయిదా పడింది. బడ్జెట్ చర్చ ప్రారంభించడానికి శశి థరూర్ పేరును సూచించినప్పటికీ, రాహుల్కు ముందుగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపక్ష డిమాండ్ కొనసాగింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా ఎంపీలు స్పీకర్కు లేఖ రాశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించాలని, రాజ్యాంగ విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇండియా బ్లాక్లోని వామపక్ష పార్టీలు, డీఎంకే వంటి మిత్రపక్షాలు కూడా స్పీకర్ను తొలగించే తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్ను రద్దు చేయాలని మాత్రమే టీఎంసీ విజ్ఞప్తి చేసింది.
మధ్యాహ్నం తిరిగి సమావేశమైన సభలో తనకు హామీ ఇచ్చి కూడా మాట్లాడనివ్వలేదని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, ఎటువంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అనంతరం సభను రోజంతా వాయిదా వేశారు.
బడ్జెట్ సమావేశానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రతిష్టంభనను తొలగించాల్సిన అవసరం ఉందని స్పీకర్ కార్యాలయం, కేంద్రం భావిస్తున్నాయి. అయితే “రాహుల్కు ముందుగా మాట్లాడే అవకాశం ఇస్తేనే బడ్జెట్ చర్చ సాగుతుంది” అని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ నాలుగు అంశాలపై మాట్లాడాలనుకుంటున్నానన్నారు — ప్రతిపక్షాన్ని రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడనివ్వకపోవడం, బీజేపీ సభ్యుల వ్యాఖ్యలపై చర్యలు లేకపోవడం, ఎంపీల సస్పెన్షన్, ప్రధానమంత్రిపై బెదిరింపుల ఆరోపణలు. తాము చర్చకు సిద్ధమేనని, కానీ మాట్లాడే హక్కు ఇవ్వాలని కోరారు.
స్పీకర్ను తొలగించాలంటే..
స్పీకర్ను తొలగించే తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాతే అది పరిశీలనకు వస్తుంది. తీర్మానం స్పష్టమైన ఆరోపణలతో ఉండాలని లోక్సభ నియమాలు చెబుతున్నాయి.
ప్రతిపక్షానికి అవసరమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, ఈ తీర్మానం ఆమోదం పొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నేతలు అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ తమ గొంతును పార్లమెంటు రికార్డులో నిలిపేందుకు ఇదే మార్గమని వారు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం ప్రతిష్టను కాపాడుకోవడం, బడ్జెట్ చర్చను ముందుకు తీసుకెళ్లడం, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం వంటి అంశాలు కేంద్రం ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయి. సభలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

