
కన్నడిగులను ఇది అవమానించడమే: ప్రియాంక్ ఖర్గే
గవర్నర్ రెండు లైన్లతో ప్రసంగం ముగించడంపై ఆగ్రహం
తమిళనాడులో మొదలైన రాష్ట్ర ప్రభుత్వాలు- గవర్నర్ల వివాదం క్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు పాకింది. తమచేత అబద్దాలు చదివిస్తున్నారని గవర్నర్లు, మంత్రిమండలి ఆమోదించిన వాటినే చదవాలని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుబడుతున్నాయి.
తాజాగా కర్ణాటకలోనే ఇదే సీన్ కనిపించింది. పదకొండు పేరాలతో మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగాన్ని కేవలం రెండు లైన్లు మాత్రమే చదివిన గవర్నర్ వాటిని ముగించారు.
దీనితో అక్కడ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ఇది కన్నడిగులను అవమానించడమే అని పేర్కొన్నారు. బెంగళూరులో గురువారం ప్రారంభమైన రాష్ట్ర శాసనసభ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఇది చోటుచేసుకుంది.
సభ ప్రారంభంలో సభ్యులను పలకరించిన గవర్నర్, ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం “రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధిని రెట్టింపు చేయడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. జైహింద్, జై కర్ణాటక” అంటూ హిందీలో తన ప్రసంగాన్ని ముగించారు.
అధికార కాంగ్రెస్(Congress) నిరసనలు, ఆగ్రహం
గవర్నర్ గెహ్లాట్ ప్రసంగాన్ని కుదించడంపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో “సిగ్గు.. సిగ్గు” అంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామంపై సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) విధాన సౌధ వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ తయారు చేసిన ప్రసంగాన్ని గవర్నర్ తప్పనిసరిగా చదవాల్సిందేనని రాజ్యాంగబద్దం అన్నారు.
“ఇది రాజ్యాంగబద్ధ విధానం. కానీ గవర్నర్ కేబినెట్ ప్రసంగాన్ని చదవకుండా స్వయంగా తయారు చేసిన ప్రసంగాన్ని చదివారు. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. దీనికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతాం” అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
లోక్ భవన్– విధానసౌధ మధ్య ప్రతిష్టంభన..
గవర్నర్ ప్రసంగం సగంలోనే నిలిపివేయడంతో సభలో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సభ ప్రారంభానికి ముందు గవర్నర్ను సీఎం, స్పీకర్, శాసన మండలి ఛైర్మన్, మంత్రులు స్వాగతం పలికారు.
అయితే, బుధవారం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం ఉండదని లోక్ భవన్ ప్రకటించగా.. తరువాత హాజరవుతానని స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు.
పదకొండో పేరాలో ఏముంది..
ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో మొత్తం 11 పేరాలు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు, ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ తొలగింపు, కొత్తగా తీసుకొచ్చిన వీబీ రామ్ జీ అంశంపై అభ్యంతరాలు ఉన్నాయి.
ఈ భాగాన్ని తొలగించాలని గవర్నర్ కోరగా.. సీఎం అందుకు అంగీకరించలేదు. దీంతో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ అంశంపై మంత్రి పాటిల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసింది. ఈ బృందంలో అడ్వకేట్ జనరల్ కే. శశికిరణ్ శెట్టి, సీఎం న్యాయ సలహాదారు ఎ.ఎస్. పొన్న పాల్గొన్నారు.
దక్షిణాదిలో వరుస ఘర్షణలు..
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్– ప్రభుత్వం మధ్య తరుచుగా రాజకీయ ఘర్షణలుంటున్నాయి. మంగళవారం తమిళనాడు అసెంబ్లీ ప్రారంభం సందర్భంగా కూడా గవర్నర్ ఆర్.ఎన్. రవి సభలో ప్రసంగం చేయకుండా వెళ్లిపోగా.. కేరళలోనూ గవర్నర్ ప్రసంగ మార్పులపై సీఎం పినరయీ విజయన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
న్యాయపోరాటానికి సిద్ధం
గవర్నర్ కీలక భాగాలను చదవకపోవడాన్ని రాజ్యాంగ ఉల్లంఘనగా భావించిన కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్కు సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Next Story

