
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోతుందా?
ప్రతిపక్షాల వాదనకు బిల్లులో చోటు దక్కుతుందా?
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2 తో ముగుస్తాయి. అయితే ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల చట్టపరమైన సవరణ బిల్లు అయిన ‘నారీ శక్తి వందన అధినియమ్’ -2023 సవరణ దాదాపుగా ఆగిపోయింది. సమావేశాలు ముగియడానికి ఇంకా నాలుగు పనిదినాలు మాత్రమే ఉన్నాయి.
ప్రతిపాదిత సవరణలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండి) కూటమి సుముఖంగా లేకపోవడంతో, ఈ కీలక చట్టంలో మార్పులు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు లేదా ఈ ఏడాది చివర్లో జరిగే వర్షాకాల సమావేశాల వరకు ఓపిక పట్టవచ్చు.
ఆసక్తిగా ఉందా?
మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో 33 శాతం కోటాను అమలును వేగవంతం చేయడానికి, సెప్టెంబర్ 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని ప్రత్యేక పార్లమెంటరీ సమావేశం ద్వారా సవరించాలని కేంద్రం కోరుకుంటోంది.
తాజా జనాభా గణన డేటా, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి ప్రస్తుత శాసనపరమైన అవసరాల నుంచి ఈ ప్రక్రియను వేరు చేయడం ద్వారా దీనిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రెండున్నర సంవత్సరాల క్రితం ఆమోదించబడిన చట్టాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. 2023 చట్టం ప్రకారం, 2026 తర్వాత నిర్వహించే మొదటి జనాభా లెక్కల అనంతరం ఏర్పాటు చేసే డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్ల అమలు జరుగుతుంది.
(2026 వరకు డీలిమిటేషన్పై నిలిపివేత ఉంది. సాధారణంగా, 2026 తర్వాత మొదటి జనాభా లెక్కలు 2031లో జరగాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో అది 2027కి వాయిదా పడింది). ఈ చట్టం అమలులోకి వచ్చినప్పుడు, 2021 నుంచి పెండింగ్లో ఉన్న తదుపరి జనాభా లెక్కల ప్రక్రియను కేంద్రం ఎప్పుడు ప్రారంభిస్తుందనే దానిపై స్పష్టత లేదనే విషయం గుర్తుచేసుకోవచ్చు.
2023 చట్టం పార్లమెంటు ఉభయ సభలలో ఏకగ్రీవంగా ఆమోదించబడినప్పటికీ, అమలుకు నిర్దిష్ట కాలపరిమితి లేని చట్టాన్ని తీసుకువచ్చినందుకు ఆ సమయంలో పలువురు ప్రతిపక్ష నాయకులు కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. చట్ట అమలును నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నుంచి వేరు చేయాలని అప్పట్లో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని కోరింది.
ప్రతిపక్షాలతో కేంద్రం సంప్రదింపులు..
ఈ నెల మొదట్లో, లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను ప్రవేశపెట్టే కాలపరిమితిని ముందుకు తీసుకురావడంపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం ప్రతిపక్ష పార్టీలను సంప్రదించడం ప్రారంభించింది.
మహిళలకు సీట్లు రిజర్వ్ చేసేందుకు నియోజకవర్గాల పునర్విభజన కోసం 2011 జనాభా లెక్కల డేటాను ఉపయోగించుకోవడంతో పాటు, లోక్సభ సభ్యుల సంఖ్యను ప్రస్తుత 543 మంది నుంచి 816 మందికి, అంటే 50 శాతం పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.
సెప్టెంబర్ 2023లో తాము చేసిన డిమాండ్లకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ను ముందుగానే అమలు చేయాలన్న అవసరాన్ని సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రతిపక్షం, అయితే, పాత చట్టానికి ప్రతిపాదించిన సవరణలకు సంబంధించిన అన్ని అంశాలను ముందుగా తమ నాయకులతో చర్చించాలని కేంద్రానికి తెలిపినట్లు తెలిసింది.
'ప్రజల దృష్టిని మళ్లించాలని..'
బుధవారం (మార్చి 25) ఉదయం, రాజ్యసభలోని కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలన్న కేంద్రం ఆకస్మిక ప్రతిపాదనను "ప్రజల దృష్టిని మళ్లించే అంశం"గా అభివర్ణించారు. 2023 సెప్టెంబర్లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు, "2024 లోక్సభ ఎన్నికల నుంచే తక్షణమే అమలు చేయాలని" కాంగ్రెస్ డిమాండ్ చేసిందని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గుర్తు చేశారు.
ఒక రోజు ముందు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా, ఇండి బ్లాక్ తరపున కేంద్రానికి లేఖ రాశారు. 2023 చట్టానికి ప్రతిపాదిత సవరణలపై చర్చించడానికి ప్రభుత్వం ముందుగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక జరిగే పార్లమెంట్ సమావేశంలో ఈ మార్పులను ప్రవేశపెట్టవచ్చని ఆయన డిమాండ్ చేశారు.
లోక్ సభ, రాష్ట్ర శాసన సభల స్థానాల పెంపు..
ప్రతిపక్ష వైఖరిని పునరుద్ఘాటిస్తూ, బుధవారం జైరాం రమేష్ మాట్లాడారు. "లోక్సభ, విధానసభల పరిమాణాన్ని 50 శాతం పెంచాలన్న" కేంద్రం ప్రణాళికపై కూడా "జాగ్రత్తగా చర్చ" జరగాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత లోక్సభలో సీట్ల సంఖ్యను పెంచాలన్న ప్రతిపాదన కేంద్రానికి ఇప్పుడూ ఒక ఇబ్బందికరమైన సమస్యగానే పరిణమించే అవకాశాలు ఉండబోతున్నాయి.
ఇంతకుముందు నివేదించినట్లుగా, దిగువ సభలో ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న 'శాతం ప్రాతినిధ్యాన్ని' మార్చకుండా, లోక్సభ బలాన్ని 816 ఎంపీలకు పెంచడానికి సంబంధిత చట్టాలు, రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత మహిళా రిజర్వేషన్ను అమలు చేయడాన్ని పరిశీలించడానికి అది సిద్ధంగా ఉంది.
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల అభ్యంతరం..
అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత తమిళనాడు, కేరళ, తెలంగాణ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే, భారీ జనాభా ఉన్న యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల వల్ల లోక్సభలో వాటి ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుంది.
దీనితో ఆయా రాష్ట్రాలు తమ గొంతు బలంగా వినిపించదని ఆందోళన చెందుతున్నాయి. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) వంటి పార్టీలు, పునర్విభజనను జనాభాతో ముడిపెట్టడం అనేది, కుటుంబ నియంత్రణను అమలు చేస్తున్నందుకు తాను పాలిస్తున్న తమిళనాడు వంటి రాష్ట్రాలను శిక్షించడంతో సమానమని, అదే సమయంలో అధిక జనాభా వృద్ధి రేటును కొనసాగిస్తున్న యూపీ, బీహార్లకు పార్లమెంటులో మరింత అధిక ప్రాతినిధ్యం కల్పించి బహుమతి ఇవ్వడం లాంటిదని వాదిస్తున్నాయి.
దిగువ సభలో ప్రస్తుతం ప్రతి రాష్ట్రానికి ఉన్న సీట్ల శాతం ఆధారంగా లోక్సభ బలాన్ని పెంచుతామన్న కేంద్రం ప్రతిపాదన, డీఎంకే వంటి పార్టీల భయాలను పోగొట్టడంతో పాటు, మహిళా రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి సురక్షిత మార్గాన్ని కల్పించేందుకు ఉద్దేశించబడింది. దీని ద్వారా వచ్చే ఎన్నికల లబ్ధిని భారతీయ జనతా పార్టీ తదుపరి ఎన్నికలలో పొందాలని చూస్తోంది.
ప్రతిపాదిత సవరణలపై ఏకాభిప్రాయం కుదర్చాలని, పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో వాటిని చట్టంగా చేయాలని ప్రతిపక్షాలు ఐక్యంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగియడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో, కేంద్రం ప్రస్తుతానికి మెత్తపడినట్లు కనిపిస్తోంది.
బిల్లుల ఆమోదం..
ఫైనాన్స్ బిల్లుకు పార్లమెంట్ ఇంకా ఆమోదం తెలపకపోవడం కూడా ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేసినట్లు కనిపిస్తోంది. ఇది బుధవారం లోక్సభలో ఆమోదం పొందింది. శ్రీ రామనవమి సందర్భంగా మార్చి 26న సెలవు కావడంతో, మార్చి 27న పార్లమెంట్ సమావేశమైనప్పుడు రాజ్యసభ ద్వారా దిగువ సభకు తిరిగి పంపుతారని భావిస్తున్నారు.
బుధవారం లోక్సభ, రాజ్యసభలలో వరుసగా ప్రవేశపెట్టిన దివాలా, బ్యాంక్రప్ట్ కోడ్ (సవరణ) బిల్లు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సాధారణ పరిపాలన) బిల్లుపై కూడా వచ్చే వారం ఉభయ సభలలో చర్చించి ఆమోదించాల్సి ఉంది.
దీనివల్ల, కొనసాగుతున్న సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణలు, రాజ్యాంగానికి సంబంధించిన సవరణలను ప్రవేశపెట్టడానికి, అలాగే ప్రతిపాదిత మార్పులపై ప్రతిపక్షం కోరుకుంటున్న సవివరమైన చర్చ తర్వాత వాటిని ఆమోదింపజేసుకోవడానికి కేంద్రానికి సమయం ఉండదు.
Next Story

