
‘ఆరోపణలకు కట్టుబడితే సంతకం చెయ్.. లేదంటే క్షమాపణ చెప్పండి’
రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ కౌంటర్...
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల(Lok Sabha)లో కర్ణాటక(Karnataka)లో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురువారం ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ (EC) శుక్రవారం స్పందించింది. రాహుల్ తన విశ్లేషణకు, మాపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ప్రమాణ పత్రంపై సంతకం చేయాలి. సంతకం చేయకపోతే ఆయన తన విశ్లేషణను నమ్మడం లేన్నట్టే. అప్పుడు ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలి’ అని ఈసీ స్పష్టం చేసింది.
ఈసీపై రాహుల్ ఆరోపణలు
కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మకై ఎన్నికల్లో ‘భారీ నేరపూరిత మోసానికి’ పాల్పడ్డాయని నిన్నటి రోజున రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. అలా చేయడం రాజ్యాంగ ద్రోహమని విమర్శించారు. దేశవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కొనసాగిన ‘ఓట్ల చోరీ’ వ్యవహారంపై తక్షణం న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఓటర్ల జాబితాలతో అవకతవకలపై ప్రజంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
లక్ష ఓట్ల చోరీ...
2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మహాదేవపుర శాసనసభ స్థానానికి చెందిన ఓటర్ల జాబితాను తమ పార్టీ విశ్లేషించిందని చెప్పారు. ఈ సందర్భంగా 1,00,250 ఓట్లు చోరీకి అయినట్లు తేలిందన్నారు. ‘‘ఈ నియోజకవర్గంలో 11,965 డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. 40,009 మంది తప్పుడు చిరునామాలు సమర్పించారు. 10,452 మంది ఒకే చిరునామాలో ఉన్నారు. 4,132 మంది ఓటర్లవి తప్పుడు ఫొటోలున్నాయి. 33,692 మంది ఫారం-6ను దుర్వినియోగం చేశారు’’ అని రాహుల్ ఆరోపించారు.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 2024 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నెలల కాలంలో మహారాష్ట్ర ఎక్కువ మంది ఓటర్లు చేరారని ఆరోపించారు.