
‘హంతకులను అరెస్టు చేసేవరకు అంత్యక్రియలు చేయం’
‘‘రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే మా కూతుర్ని హతమార్చారు’’ - కాంగ్రెస్ కార్యకర్త హిమాని నర్వాల్ తల్లి
కాంగ్రెస్ కార్యకర్త హిమాని (Himani Narwal) నర్వాల్ హత్యకేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాల డిమాండ్ నేపథ్యంలో ఈ కేసు విచారణకు హర్యానా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) అప్పగించింది.
రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక..
ఇటు నర్వాల్ కుటుంబసభ్యులు హంతకులను అరెస్టు చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించమని స్పష్టం చేశారు. ‘‘చివరిసారిగా ఫిబ్రవరి 27న మాతో మాట్లాడింది. మరుసటి రోజు పార్టీ కార్యక్రమంలో బిజీగా ఉంటానని చెప్పింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఆమె రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.’’ అని హిమాని తల్లి పేర్కొన్నారు.
అసలేం జరిగింది...
హర్యానా రాష్ట్రం రోహ్తక్ జిల్లా సంప్లా పట్టణంలోని బస్స్టాండ్ వద్ద శనివారం (మార్చి 1) ఒక సూట్కేసులో మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందింది. స్పాట్కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. ఆ తర్వాత మృతరాలు హిమాని నర్వాల్(22)గా గుర్తించారు.
హిమాని హత్య వార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం భూపీందర్ సింగ్. "ఒక యువతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని సూట్కేసులో పెట్టిన ఘటన షాక్కు గురిచేస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తోంది. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షించాలి’’ అని డిమాండ్ చేశారు. రోహ్తక్ ఎమ్మెల్యే భారత్ భూషణ్ బత్రా ఈ హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడాలని కోరారు.
చురుకైన కార్యకర్త..
యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి మాట్లాడుతూ..‘‘హిమాని నర్వాల్ యూత్ కాంగ్రెస్లో రోహ్తక్ రూరల్ ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. యూత్ కాంగ్రెస్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేది. భారత్ జోడో యాత్ర సహా అన్ని కార్యక్రమాలలో తన బాధ్యతను సమర్థంగా నిర్వహించారు," అని శ్రీనివాస్ పేర్కొన్నారు. నర్వాల్ హత్యపై లోతుగా దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బిబి బత్రా డిమాండ్ చేశారు.
హిమాని గురించి..
హిమాని నర్వాల్(Himani Narwal) హర్యానాలోని రోహ్తక్లో యూత్ కాంగ్రెస్(Congress) కార్యనిర్వాహకురాలు. సోనిపట్ జిల్లా కథురా గ్రామానికి చెందిన ఈమె శివాజీ కాలనీలో అద్దె ఇంట్లో ఉండేది. ఆమె తల్లి, సోదరుడు ఢిల్లీ నజఫ్గఢ్లో ఉంటున్నారు. హిమాని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో చురుకుగా పాల్గొన్నారు. అలాగే హర్యానా కాంగ్రెస్ సభల్లో, సామాజిక కార్యక్రమాల్లో హర్యాణ్వీ కళాకారులతో కలిసి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. హర్యానాలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న రోజున హిమాని హత్యకు గురయ్యారు.