కోల్‌కతా ఘటన తర్వాత హాస్టల్ మొత్తం ఖాళీ
x

కోల్‌కతా ఘటన తర్వాత హాస్టల్ మొత్తం ఖాళీ

జూనియర్ డాక్టర్లు తమకు భద్రత లేదని భావించారా? లేక తల్లిదండ్రుల ఒత్తిడితో ఇల్లు చేరుకున్నారో తెలీదు.కోల్‌కతా RG కర్ మెడికల్ కాలేజీ హాస్టల్ మొత్తం ఖాళీ అయ్యింది.


జూనియర్ డాక్టర్లు తమకు భద్రత లేదని భావించారా? లేక తల్లిదండ్రుల ఒత్తిడి చేయడంతో ఇల్లు చేరుకున్నారో తెలీదు. ప్రస్తుతం కోల్‌కతా RG కర్ మెడికల్ కాలేజీ హాస్టల్ మొత్తం ఖాళీ అయ్యింది. ట్రైనీ డాక్టర్ అత్యాచార, హత్య ఘటనకు ముందు హాస్పిటల్ క్యాంపస్‌లో తెల్ల కోటు ధరించి స్థెతస్కోప్ మెడలో వేసుకుని వార్డుల్లో కనిపించేవారు. కాని దేశం మొత్తం నిర్ఘాంతపోయే దుర్ఘటన తర్వాత జూనియర్ డాక్టర్ జాడే లేదు. కాలేజీ క్యాంపస్‌లో మొత్తం 160 జూనియర్ డాక్టర్లు ఉన్నారు. ఆగస్టు 9 జరిగిన ఘటన తర్వాత 17 మంది మినహా మిగతా వాళ్లంతా హాస్టల్ నుంచి తాత్కాలికంగా వెళ్లిపోయారు. నర్సింగ్ హాస్టల్‌తో పాటు కళాశాలలోని దాదాపు అన్ని హాస్టళ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసిన నేరం తర్వాత భయాందోళనకు గురైన విద్యార్థులు హాస్టళ్ల నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారని ఒక జూనియర్ డాక్టర్ చెప్పింది. ఆగస్ట్ 14 వ తేదీ రాత్రి ఆసుపత్రిపై దుండగుల దాడితో ఇంకా ఎక్కువ భయం పట్టుకుందని చెప్పింది. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, వాహనాలు, మందుల దుకాణం, CCTVలను ధ్వంసం చేయడంతో భయం గూడుకట్టుకుందని చెప్పింది.

“ఇలాంటి భయానక ఘటనల తర్వాత కూడా మేం నైట్ డ్యూటీలు చేస్తున్నాం. కొన్నిసార్లు మేం వార్డులో ఒంటరిగా ఉంటాం. ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంటుంది’’ అని నర్సు చెప్పారు.

సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ మాట్లాడుతూ.. విధ్వంస ఘటన తర్వాత దాదాపు 700 మంది రెసిడెంట్ డాక్టర్లలో.. కేవలం 30-40 మంది మహిళా వైద్యులు, 60-70 మంది పురుషులు మాత్రమే క్యాంపస్‌లో ఉంటున్నారని చెప్పారు.

ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, ఉక్కిరిబిక్కిరి చేసి హత్య చేసిన నిందితుడు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ని పోలీసులు తర్వాత రోజు అరెస్టు చేశారు.

Read More
Next Story