అసలు చిక్కంతా సీట్ల పంపకాలు, కన్వీనర్ ఎంపికే
x
ఇండియా కూటమి నేతలు

అసలు చిక్కంతా సీట్ల పంపకాలు, కన్వీనర్ ఎంపికే

పదేళ్ల నుంచి ఢిల్లీ గద్దెనెక్కి దేశాన్ని పాలిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ సహ ప్రతిపక్ష పార్టీలు మరోసారి కసరత్తు ప్రారంభించాయి.


ఇప్పటికే వివిధ పార్టీలు కలిసి ఐ ఎన్ డీ ఐ అనే కూటమిని ఏర్పాటు చేసుకున్నసంగతి మనందరికి తెలుసు, తాజాగా వీరి మధ్య మరోసారి వర్చువల్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు, కన్వీనర్ లేదా చైర్ పర్సన్ ఎంపిక రెండు మూడు రోజుల్లో ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం జరగబోయే సమావేశాల్లో రాష్ట్రాల వారీగా సీట్ల పంపకంపై కూటమి ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ తో ఇతర పార్టీలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం సీట్లపై చిన్న పార్టీలు ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం కన్పిస్తుంది.

నితీష్ అంగీకరించారా?

కూటమి కన్వీనర్ గా ఉండటానికి బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ అంగీకరించారనే ప్రచారం ఢిల్లీ సర్కిల్ లో వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ, అటూ జేడీ(యూ), ఆర్జేడీ నాయకులు గానీ ధృవీకరించట్లేదు. అయితే అతి కష్టంగా మీద ఈ పదవీకి ఒప్పించామని బిహర్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఫెడరల్ తో చెప్పారు. ఇదే అంశంపై జేడీ(యూ) ముఖ్య అధికార ప్రతినిధి కేసీ త్యాగీ సైతం స్పందించడానికి నిరాకరించారు. "చర్చలు జరుగుతున్నాయి.. కానీ చర్చలకు అతీతంగా వెళ్లే సమయం ఆసన్నమైందని" త్యాగి ఫెడరల్ ప్రతినిధితో చెప్పారు. కూటమిలోని పార్టీలు, నాయకులను ఏకతాటి పైకి తీసుకురావడంలో నితీష్ కుమార్ అతిపెద్ద సహకారం అందించారు. కావునా కన్వీనర్ గా నితీష్ ఉండటమే ఉత్తమం అని త్యాగి వాదిస్తున్నారు. ఈ ప్రతిపాదనను ఆర్జేడీ సమర్ధిస్తుందని ఆ పార్టీ ప్రతినిధి మనోజ్ కుమార్ ఝా అన్నారు.

కొన్ని రోజుల క్రితం జేడీ(యూ) పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆర్జేడీ- కాంగ్రెస్ ఆందోళన చెందాయి. నితీష్ ఎక్కడ కూటమి నుంచి బయటకు వెళ్తారో అన్న అనుమానం వచ్చింది. కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించడంపై నితీష్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

అయితే నితీష్ కుమార్ కూటమి నుంచి బయటకు వెళ్లకుండా ఆపడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేయాల్సిన అన్నిప్రయత్నాలు చేస్తున్నారు. "డిసెంబర్ 26న బిహార్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సంసిద్దతను సమావేశం రోజు నుంచి ఆయన క్రమంతప్పకుండా ఆర్జేడీ- జేడియూ నేతలతో టచ్ లో ఉన్నారు, సీట్ల పంపకం సహ, కూటమికి సంబంధించిన అన్ని విషయాలపై హమీ ఇచ్చారు" అని కాంగ్రెస్ వర్గాలు ఫెడరల్ కు చెప్పాయి. అలాగే ఆర్జేడీ నాయకుడు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సైతం తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. తేజస్వీ తో పాటు ఆ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన మనోజ్ కుమార్ ఝా కూడా పాట్నాలోనే ఉండబోతున్నారు. సీట్ల పంపకం, నితీష్ ని ఒప్పించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

"మేము గత ఆరు నెల్లలో నాలుగు సార్లు సమావేశం అయ్యాం, అయితే ఇప్పటి వరకూ సీట్ల పంపకం పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్లీ వర్చువల్ మీటింగ్ అంటున్నారు. క్షేత్ర స్థాయిలో కూటమి విషయం ఏం తేలలేదు. సీట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. ఇంక ఉమ్మడి ప్రచారం ఎప్పుడు చేసేది. ఇది ఎన్నికల పొత్తా, లేక చర్చల దుకాణామా?" అని బిహార్ సీఎం ముఖ్య సహాయకుడు ఫెడరల్ తో అన్నారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచి తన ప్రచారం ప్రారంభించింది. మరోవైపు రామమందిరం ప్రారంభోత్సవాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా వాడుకుంటోంది. మరి మేం ఏం చేస్తున్నాం అని ఆయన ప్రశ్నించారు.

సీట్ల పంపిణీపై కాంగ్రెస్ నివేదిక సిద్ధం

మరోవైపు కూటమి నేతలతో సీట్ల పంపకాలపై చర్చలు జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, రాష్ట్ర విభాగాలతో అంతర్గత చర్చలు పూర్తి చేసినట్లు మిత్రపక్షాలకు సమాచారం అందించింది.

"మాకు వచ్చిన నివేదిక ఆధారంగా ఓ నివేదికను సిద్ధం చేసాం. ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ ఏయే స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటోంది. ఇతర పార్టీలు ఏయే స్థానాలు పోటీ చేయాలో అనే దానిపై ఓ క్లారిటీకి వచ్చాం. జనవరి 3న నివేదికను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అందజేస్తాం" అని కమిటీ సభ్యుడు ఫెడరల్ తో చెప్పారు. ఈ నివేదికపై మిత్రపక్షాలతో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే తుది నివేదిక కాదని, భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం కావచ్చని కూడా కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైన జనవరి 15 నాటికి సీట్ల పంపకం సహ ఇతర అంశాలపై ఓ స్పష్టత వస్తుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.

సీట్ల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ కొన్ని సూత్రాలు ప్రతిపాదించింది. 2019 ఎన్నికల్లో గెలిచిన 52 స్థానాలతో పాటు, రెండవస్థానంలో ఉన్న స్థానాలపై కూడా పార్టీ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా ఉంది. అయితే పొత్తుల విషయంపై బెంగాల్, ఢిల్లీలో మాత్రం సమస్య జటిలంగా ఉండే అవకాశం కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న మాట. ముఖ్యంగా తృణమూల్ కు, వామపక్షాలకు పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. దీనితో పాటు అక్కడ ఉన్న 42 సీట్లలో కాంగ్రెస్ కు కేవలం 2 సీట్లను మాత్రమే ఇవ్వడానికి అంగీకరించే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ మాత్రం 9 సీట్లలో పోటీ చేయాలని కోరుకుంటోంది.

‘ఆప్’ తో కంగారు

ఆప్ తో చర్చలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. సందీప్ దీక్షిత్ సహ మరికొందరు నాయకులు ఢిల్లీలో మూడు ఎంపీ సీట్లలో పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అయితే అందుకు కేజ్రీవాల్ ఒప్పుకుంటాడా అని పెద్ద సందేహం. అయితే పెద్ద సవాల్ మాత్రం పంజాబ్ నుంచి ఎదురుకావచ్చని అంచనాలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలలో పంజాబ్ నుంచి కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఐదు స్థానాలే ఇవ్వాలనే ఆలోచనలో స్థానిక ఆప్ నాయకత్వం ఉంది. అయితే ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ పంజాబ్ నాయకత్వం తిరస్కరించింది. కేజ్రీవాల్ ఇక్కడితో ఆగడు గోవా, పంజాబ్ లో కూడా సీట్లు అడుగుతాడని కాంగ్రెస్ నాయకత్వంలోని ఓ వర్గం నమ్ముతోంది.

"లోక్ సభ ఎన్నికలకు ముందే కూటమి ఉంటుందా లేదా అనేది రాబోయే 15 రోజుల్లో తెలిసిపోతుందని ఇండియా కూటమి నాయకులు ఫెడరల్ తో చెప్పారు. ఎవరు కన్వీనర్ గా ఉంటారు. ఎవరు చైర్ పర్సన్ గా ఉంటారు అనేది తరువాత అంశం. ముందు సీట్ల విషయం తేలాలి. అది లేకుండా ఏదీ ముందుకు కదలదు" అని మరో నాయకుడు ఫెడరల్ తో చెప్పారు.

మరో నాయకుడు మాట్లాడుతూ " రాహూల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర కంటే ముందే సీట్ల పంపకం పూర్తి కావాలి. తర్వాత ఉమ్మడి ప్రచార ప్రణాళిక సిద్ధం చేయాలని కోరుకుంటున్నాం, మా చివర సమావేశం జనవరి 30న( గాంధీ బలిదానం చేసిన రోజు) పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి ప్రచారం ప్రారంభించాలని ఒక సూచన వచ్చింది. అందుకే కనీసం రెండు వారాల ముందుగానే స్ఫష్టమైన రూపాన్ని పొందడం ముఖ్యం" అని ఫెడరల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Read More
Next Story