బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట: అసలు ఏం జరిగింది?
x

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట: అసలు ఏం జరిగింది?

గందరగోళ ప్రకటనలు, స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ అన్న వదంతులతో స్టేడియం వద్దకు క్రికెట్ అభిమానులు భారీగా చేరుకున్నారు.


Click the Play button to hear this message in audio format

ఐపీఎల్‌ చరిత్రలో 18 సంవత్సరాల తర్వాత మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. ఈ ఆనందాన్ని జట్టు సభ్యులు తమ అభిమానులతో షేర్ చేసుకోవాలనుకున్నారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్-టాప్ బస్సులో విజయోత్సవ ర్యాలీ ఉంటుందని RCB సోషల్ మీడియాలో పేర్కొంది. ఆ తర్వాత హోం మంత్రి జి పరమేశ్వర ఓపెన్-టాప్ విక్టరీ పరేడ్ ఉండదని చెప్పారు. ఈ రెండు విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. మరోవైపు స్టేడియంలోనికి ఫ్రీగా అనుమతిస్తున్నారన్న వదంతులు వ్యాపించాయి. దాంతో స్టేడియం వద్దకు భారీగా అభిమానులు చేరుకోవడం ప్రారంభించారు. వాస్తవానికి స్టేడియ కెపాసిటీ 40 వేలు. కాని స్టేడియం వద్దకు చేరుకుంది సుమారు 3 లక్షల మంది.

అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది...

జూన్ 4, ఉదయం 7:00: సాయంత్రం 5 గంటలకు విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్-టాప్ బస్సులో విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని RCB సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ ప్రకటనతో నగరవాసులతో పాటు ఇతర జిల్లాల ప్రజలు విధాన సౌధ లేదంటే స్టేడియం వద్దకు చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.

ఉదయం 11:00 గంటలు: జట్టు సభ్యులకు విధానసౌధ వద్ద సన్మానించి, స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

మధ్యాహ్నం 1:30 గంటలకు: ఆర్‌సీబీ బృందం అహ్మదాబాద్ నుంచి చార్టర్డ్ విమానంలో హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వారికి స్వాగతం పలికారు. కాసేపట్లో జట్టు సభ్యులు విమానాశ్రయం నుంచి హోటల్‌కు బయలుదేరుతారని తెలుసుకున్న క్రికెట్ అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు చేరుకున్నారు.

మధ్యాహ్నం 2:00 గంటలు: ట్రాఫిక్, భద్రతా సమస్యల కారణంగా ఓపెన్-టాప్ బస్సు కవాతును రద్దు చేస్తున్నట్లు హోంమంత్రి జి పరమేశ్వర ప్రకటించారు.

మధ్యాహ్నం 2:30 : టీం సభ్యులు ఒక ప్రైవేట్ హోటల్‌కు చేరుకున్నారు. అప్పటికే దారి పొడవునా జనం రోడ్ల వెంట బారులు తీరారు. ఎవరూ ఊహించని విధంగా విధానసౌధ, హోటల్, స్టేడియం చుట్టూ జనసమూహం పెరిగిపోయింది.

మధ్యాహ్నం 3:14 : హోం మంత్రి చెప్పిన దానికి విరుద్ధంగా ఓపెన్-టాప్ బస్‌పై విక్టరీ పరేడ్ గురించి RCB సోషల్ మీడియాలో మళ్లీ పోస్టులు కనిపించడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు.

మధ్యాహ్నం 3:30 : విరాట్ కోహ్లీతో సహా RCB జట్టు విధానసౌధకు చేరుకుంది. అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం DK శివకుమార్ జట్టు సభ్యులను సత్కరించారు.

సాయంత్రం 5:00 గంటలు : రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోవడం, ట్రాఫిక్ సమస్య పెరిగిపోవడంతో ఓపెన్-టాప్ బస్ విక్టరీ పరేడ్‌ను అధికారికంగా రద్దు చేశారు. దాంతో జట్టు సభ్యులు బస్సులో చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు.

టిక్కెట్లు లేకపోయిన స్టేడియంలోకి అనుమతిస్తున్నారని వదంతులు వ్యాపించడంతో భారీగా స్టేడియం వద్దకు చేరుకోవడం మొదలుపెట్టారు.

సాయంత్రం 5:10 గంటలు: అప్పటికే పెరిగిపోయిన జనసమూహాన్ని దృష్టిలో ఉంచుకుని విధానసౌధ, స్టేడియానికి సమీపాన ఉన్న మెట్రో స్టేషన్లను మూసివేశారు. అయితే అభిమానులు ఇతర స్టేషన్లలో దిగి స్టేడియం వద్దకు చేరుకోవడం ప్రారంభించారు.

సాయంత్రం 5:30 గంటలకు: స్టేడియం 7వ గేటు వెలుపల అభిమానులు బలవంతంగా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు తొక్కిసలాట(Stampede) జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

సాయంత్రం 5:30 నుంచి 6:00 వరకు : తొక్కిసలాట గురించి వార్తలు రావడం ప్రారంభించాయి. ఆంబులెన్స్‌లు స్టేడియం వద్దుకు చేరుకోవడానికి ప్రయత్నించాయి. కానీ ఫలితం లేకపోయింది. అభిమానులతో అప్పటికే రోడ్లన్నీ కిక్కిరిసి పోవడం, ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్‌లు రావడం ఆలస్యమైంది. సకాలంలో ప్రాథమిక వైద్యం కూడా అందలేదు.

ఫలితంగా 11 మంది చనిపోయారు. గాయపడ్డ సుమారు 70 మంది ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు.

Read More
Next Story