
దుబాయ్కి తొలిసారి యూపీ దసరి మామిడి..
జీర్ణక్రియకు దోహదపడే ఫైబర్, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉండడం వీటి ప్రత్యేకత..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. రైతులకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది. అందులో భాగంగా తొలిసారి దుబాయ్కు దసరి (Dasher) మామిడి పండ్లను ఎక్స్పోర్టు చేస్తోంది. 1,200 కిలోల మామిడి పండ్లను 400 పెట్టెలలో పెట్టి యుఏఈకి చెందిన విమానంలో ఆదివారం (జూన్ 15) తరలించారు. ఈ కార్యక్రమానికి ఉద్యానవన, వ్యవసాయ మార్కెటింగ్, వ్యవసాయ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు.
రైతుల హర్షం..
ఇండో-జర్మన్ AMD ప్రాజెక్ట్ కింద లక్నో ప్రాంతం నుంచి మూడు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి శిక్షణ తీసుకున్నాయి. వీటిలో ఇరాడా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, మలిహాబాద్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్కు దసరీ మామిడి పండ్లను దుబాయ్కి ఎగుమతి చేసే అవకాశం దక్కింది. మొదటిసారి రెండు FPOలు స్వతంత్రంగా మామిడి పండ్లను ఎగుమతి చేస్తుండడంపై మామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు అండగా..
"ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ నుంచి మామిడి ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన మామిడి రైతులు ప్రపంచ మార్కెట్లో నిలదొక్కుకోవడమే మా లక్ష్యం. ఉత్పత్తి, ప్యాకేజింగ్, అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం రైతులకు అవసరమైన సహాయ సహకారాలన్నీ చేస్తుంది," అని సింగ్ పేర్కొన్నారు.
మామిడిపండ్ల ప్రత్యేకత..
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం లక్నో జిల్లాలోని మలిహాబాద్ (Malihabad) ను భారతదేశ మామిడి రాజధానిగా పరిగణిస్తారు. దేశంలోని పురాతన మామిడి చెట్లకు నిలయం కూడా. 9 నుంచి 15 సెంటీమీటర్ల పొడవుండే ఈ మామిడి పండ్లలో జీర్ణక్రియకు దోహదపడే ఫైబర్, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. జింక్, విటమిన్ E, A, ఇనుము, కాల్షియం కూడా ఉంటాయి.