
నాలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళతో పాటు పుదుచ్చేరిలోనూ ఎన్నికలు
దేశంలో కీలకమైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ ఎన్నికలు జరపనున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల సదన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో పెద్ద రాష్ట్రాలలో ఒకటైన పశ్చిమ బెంగాల్ లో మాత్రమే రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఈసీ ప్రకటించింది.
కేరళ, అసోంలో ఒకే విడతగా ఏప్రిల్ 9 న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
బెంగాల్ లో రెండు విడతలు.. ఏప్రిల్ 23 న మొదటి విడత 29 న రెండో విడతగా ఎన్నికల జరగనున్నాయి. మే 4న అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువరిస్తారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన క్షణం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని సీఈసీ ప్రకటించారు.

