
జన్ సురాజ్ పార్టీతో జతకట్టిన 'ఆప్ సబ్కీ ఆవాజ్' పార్టీ
ఈ ఏడాది చివర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
కేంద్ర మాజీ మంత్రి ఆర్సిపి సింగ్(RCP Singh) ఆదివారం జన్ సూరజ్ పార్టీ(Jan Suraaj Party)లో చేరారు. బీహార్లో ఆ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో తన పార్టీ 'ఆప్ సబ్కీ ఆవాజ్'ను కూడా విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేస్తానని చెప్పారు.
సింగ్ గురించి క్లుప్తంగా..
బీహార్(Bihar) ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) స్వస్థలం నలందకు చెందిన ఆర్సిపి సింగ్.. ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. 1999లో జేడీ(యూ)చీఫ్ నితీష్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో సింగ్కు పరిచయం ఏర్పడింది. 2005లో బీహార్లో అధికారం చేపట్టిన తర్వాత.. సింగ్ పాలనా చతురతకు ఆకర్షితుడైన ఆయనను తన ప్రధాన కార్యదర్శిగా వేయించుకున్నారు నితీష్.
ఇక 2010లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత JD(U)లో చేరారు సింగ్. దాంతో ఆయన అదే పార్టీ నుంచి ఆయన రాజ్యసభకు రెండు సార్లు ఎంపికయ్యారు. జేడీ(యు) జాతీయ అధ్యక్షుడిగా కూడా కొంతకాలం పనిచేశారు. 2021లో కేంద్ర మంత్రివర్గంలోకి సింగ్ చేరిక కుమార్కు నచ్చలేదు. దాంతో ఆయన జాతీయ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. తరువాత సింగ్ 2023లో జేడీ(యూ)ను వీడి బీజేపీలో చేరారు. బ్యూరోక్రాట్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన సింగ్.. నవంబర్ 2024లో సొంత పార్టీని స్థాపించారు.