దేశంలో తొలి కారుణ్య మరణం పొందిన హరీశ్ రాణా
x
హరీశ్ రాణా

దేశంలో తొలి కారుణ్య మరణం పొందిన హరీశ్ రాణా

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాణాకు వైద్య సాయం నిలిపివేసిన వైద్యులు


Click the Play button to hear this message in audio format

సుదీర్ఘకాలం కోమాలో ఉన్న హరీశ్ రాణా మంగళవారం ఎయిమ్స్ లో కారుణ్య మరణం పొందినట్లు ఎయిమ్స్-ఢిల్లీ వైద్యులు ప్రకటించారు. దేశంలో ఇది మొట్టమొదటి కారుణ్య మరణం. సుప్రీంకోర్టు మార్చి 11న ఇచ్చిన చారిత్రాత్మక ఒక తీర్పులో హారీష్ రాణాకు కారుణ్య మరణానికి అంగీకరించింది. బాధితుడు గత 13 సంవత్సరాలుగా కోమాలో ఉన్నాడు. వైద్యం చేసిన తిరిగి బతికే అవకాశాలు లేవని వైద్యులు ధృవీకరించారు.

2013 నుంచి కోమాలో ఉన్న 31 ఏళ్ల హరీష్‌ను, మార్చి 14న ఆయన ఘజియాబాద్‌లోని ఇంటి నుంచి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ రోటరీ క్యాన్సర్ హాస్పిటల్‌లోని పాలియేటివ్ కేర్ యూనిట్‌కు తరలించారు.
పంజాబ్ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థి అయిన హరీష్, 2013లో నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ పడి తీవ్రమైన గాయాలకు గురయ్యాడు. అప్పటి నుంచి అతను కోమాలోనే ఉంటూ, కృత్రిమ పోషకాహారం, అప్పుడప్పుడు ఆక్సిజన్ సాయం తీసుకుంటున్నాడు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధితుడికి నిష్క్రియాత్మక కారుణ్య మరణం అమలు చేశారు. అంటే, ఒక రోగిని బ్రతికించడానికి అవసరమైన ప్రాణరక్షణ పరికరాలను లేదా చికిత్సను నిలిపివేసి, ఉద్దేశపూర్వకంగా మరణించనివ్వడం. హరీష్‌ను ఆసుపత్రిలో చేర్చిన తర్వాత, అతనికి అందిస్తున్న పోషకాహార సాయాన్ని క్రమంగా నిలిపివేశారని మంగళవారం వైద్యులు తెలిపారు. అతనికి తల్లిదండ్రులు అశోక్, నిర్మలా రాణాలు ఉన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత హరీష్ కుటుంబం మాట్లాడుతూ, కృత్రిమ ప్రాణ రక్షణను నిలిపివేయడం వల్ల తమ కుటుంబానికి వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం చేకూరదని, కానీ విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇతరులకు ఈ నిర్ణయం సాయపడగలదని పేర్కొంది. దేశంలో గౌరవప్రదమైన మరణం కూడా ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని ఇంతకుముందు సుప్రీంకోర్టు అనేక తీర్పులలో పేర్కొంది. రోగి గౌరవం కాపాడబడేలా, ఒక ప్రత్యేక ప్రణాళికతో ప్రాణ రక్షణను నిలిపివేసేలా చూడాలని ఎయిమ్స్-ఢిల్లీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రక్రియను అమలు చేయడానికి, అనస్థీషియా, పాలియేటివ్ మెడిసిన్ విభాగాధిపతి, ప్రొఫెసర్ అయిన డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలో ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో న్యూరోసర్జరీ, ఆంకో-అనస్థీషియా, పాలియేటివ్ మెడిసిన్, సైకియాట్రీ విభాగాల వైద్యులు ఉన్నారు.
సుప్రీంకోర్టు తన మార్చి 11 తీర్పులో, దేశంలో మొదటిసారిగా ఒక వ్యక్తికి నిష్క్రియాత్మక కారుణ్య మరణాన్ని అనుమతించింది. దీర్ఘకాలంగా చర్చనీయాంశంగా ఉన్న ఈ భావోద్వేగపూరిత అంశంపై తీర్పునిస్తూ, జస్టిస్‌లు జె.బి. పర్దివాలా, కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం, నిష్క్రియాత్మక కారుణ్య మరణంపై సమగ్ర చట్టాన్ని తీసుకురావడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
రాణా కడుపు నంచి కృత్రిమంగా అమర్చిన 'పెర్క్యుటేనియస్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టోమీ' ట్యూబుల ద్వారా వైద్యపరంగా అందించిన పోషణతో మాత్రమే అతను ప్రాణాలతో బయటపడ్డాడని, చికిత్సను కొనసాగించడం వల్ల కోలుకునే అవకాశం లేకుండా కేవలం శారీరక మనుగడను పొడిగించడమే అవుతుందని వైద్య బోర్డులు ఏకగ్రీవంగా నిర్ధారించాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రాథమిక, ద్వితీయ బోర్డులు ప్రాణరక్షణ సాయాన్ని ఉపసంహరించుకోవడాన్ని ధృవీకరించినప్పుడు, న్యాయపరమైన జోక్యం అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.
అన్ని జిల్లాల్లోని ప్రధాన వైద్య అధికారులు, ద్వితీయ వైద్య బోర్డులకు నామినేషన్ల కోసం నమోదిత వైద్యుల ప్యానెల్‌ను నిర్వహించేలా చూడాలని కూడా అది భారత ప్రభుత్వాన్ని కోరింది. రాణా తల్లిదండ్రులు తమ కుమారుడిపై చూపిన అపారమైన ప్రేమ, శ్రద్ధకు కోర్టు ప్రత్యేకంగా ప్రశంసలు తెలిపింది. "అతని కుటుంబం ఎప్పుడూ అతనిని విడిచిపెట్టలేదు," అని కోర్టు పేర్కొంది. నిష్క్రియాత్మక కారుణ్య మరణాన్ని అనుమతించే ఈ ఉత్తర్వు, గౌరవప్రదంగా మరణించే ప్రాథమిక హక్కుగా గుర్తించింది.
2018 నాటి తీర్పులో, రాజ్యాంగ ధర్మాసనం నిష్క్రియాత్మక కారుణ్య మరణాన్ని, గౌరవప్రదంగా మరణించే హక్కును ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తించింది. "ముందస్తు వైద్య ఆదేశాలు" ఉపయోగించి నిష్క్రియాత్మక కారుణ్య మరణాన్ని చేపట్టవచ్చని కోర్టు తన ఉత్తర్వూల్లో పేర్కొంది.
జనవరి 24, 2023న, ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నిష్క్రియాత్మక కారుణ్య మరణాన్ని మంజూరు చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి 2018 మార్గదర్శకాలను సవరించింది.
Read More
Next Story