బీజేపీకి భారీ మెజారిటీ వస్తే దళిత రిజర్వేషన్లు ఉంటాయా? పోతాయా?
x

బీజేపీకి భారీ మెజారిటీ వస్తే దళిత రిజర్వేషన్లు ఉంటాయా? పోతాయా?

బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారా? "వాళ్లు అంత ఈజీగా చేయగలరా" అన్నది ప్రస్తుత ప్రశ్న.


సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దళితులకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల పథకంపై వివాదం రాజుకుంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి. ఎప్పటినుంచో రాజకీయ ఏకాభిప్రాయం ఉన్న ఈ అంశం వివాదాస్పదమైంది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే.. 'కాంగ్రెస్ కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని తొలగిస్తుందని, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల ప్రజలకు రిజర్వేషన్ల కోటా ప్రయోజనాలను పెంచుతుందని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడమే కాకుండా దళితుల రిజర్వేషన్లను తొలగిస్తుందని కూడా రాహుల్ ఆరోపించారు.

కర్ణాటకలో ఓ మీటింగ్ లో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా దాదాపు ఇదే ఆరోపణ చేశారు. రిజర్వేషన్లను అంతం చేయడానికి రాజ్యాంగాన్ని మార్చాలని ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్), బీజేపీ కోరుకుంటున్నాయని ఆరోపించారు. "నరేంద్ర మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ల రద్దుకున్న మార్గాలను అన్వేషిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పోస్టులలో దాదాపు 30 లక్షల ఖాళీలు ఖాళీలు ఉన్నాయి. వీటిలో 50 శాతం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వ్ చేసినవి. మిగిలిన 50 శాతం ఇతర వర్గాలకు కేటాయించారు. అయినా వాటిని ఎన్డీఏ ప్రభుత్వం భర్తీ చేయడం లేదు.
కాంగ్రెస్ వాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హో మంత్రి అమిత్ షా, ఇతర ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తోసిపుచ్చుతున్నారు.
తెలంగాణలోని వరంగల్, ఇతర చోట్ల జరిగిన సభల్లో మోదీ భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమిని సాధారణంగా దాని అక్షర క్రమాన్ని బట్టి ఇండియా అని పిలుస్తారు. ఈ కూటమి ప్రధాన ఉద్దేశం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను కట్ చేసి వాటిని మైనారిటీలకు మళ్లించడమేనని ఆరోపించారు.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని షా చెప్పారు. మేము మార్చాలనుకుంటే గత పదేళ్లలో ఎప్పుడైనా మార్చి ఉండేవాళ్లం. మాకు పార్లమెంటులో మెజారిటీ కూడా ఉంది కదా అంటున్నారు బీజేపీ నేతలు. 'అది చేయలేదంటే ఎప్పటికీ జరగదనే అర్థం.. రాజ్యాంగాన్ని మార్చి ఎమర్జెన్సీ విధించింది కాంగ్రెస్సే కదా' అని షా ప్రశ్నించారు.
కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ లో ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ "మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీల హక్కులను లాక్కోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. మేము దాన్ని ఎప్పటికీ అంగీకరించం" అన్నారు.
ఈ చర్చ ఎక్కడ ప్రారంభమైందంటే..
నిజానికి ఈ చర్చ బీజేపీ నేతల నుంచే ప్రారంభం అయింది. రాజస్థాన్ లోని నాగౌర్ నుంచి ప్రస్తుత లోక్‌సభ అభ్యర్థి జ్యోతి మిర్ధాతో ఈ వివాదం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇదే నినాదాన్ని వివిధ బీజేపీ నాయకులు అందుకున్నారు. దీంతో వివాదం ప్రారంభమైంది. 'దేశ ప్రయోజనాల దృష్ట్యా మేము చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. లోక్‌సభ లేదా రాజ్యసభలో మేమీ మాట చెప్పాల్సి ఉంది. అనేక కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది' అని జ్యోతి మీర్ధా చెప్పడంతో అసలు వివాదం రాజుకుంది. ఎన్నికల ప్రచారం సాగుతున్న కొద్దీ ఈ అంశంపై వివాదం ముసిరింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశం చుట్టూ వివాదాలు రేపాయి.
షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్)లో జరిగిన ప్రచార సభలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రాజ్యాంగ మథనానికి సంబంధించినవి. ఇందులో ఒకవైపు రాజ్యాంగ రక్షకులు, మరొక వైపు దాని భక్షకులు ఉన్నారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పేదలకు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లను కాపాడడమే మా కర్తవ్యం అన్నారు అఖిలేష్.
యుపిలో సమాజ్‌వాదీ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ అఖిలేష్ యాదవ్ వాదనతో ఏకీభవించలేదు. రాజ్యాంగపరమైన రిజర్వేషన్లను లక్ష్యంగా చేసుకునేది సమాజ్ వాదీ పార్టీయే గాని బీజేపీ కాదని తిప్పికొట్టింది.
బీఎస్పీ నాయకురాలు మాయావతి ఏమన్నారంటే.. 'సమాజ్‌వాదీ పార్టీ నోటీ మాటగా మాత్రమే దళితులని చెబుతుందని నిజానికి ఆ పార్టీ ప్రవర్తన, స్వభావం మాత్రం ఎప్పటిలాగే దళిత వ్యతిరేకతేనని, అత్యంత వెనుకబడిన ప్రజల హక్కులు, వారికి ఇచ్చిన రిజర్వేషన్‌లను వ్యతిరేకించే పార్టీ అని విమర్శించారు. ఎస్సీలకు పదోన్నతిలో రిజర్వేషన్‌ను రద్దు చేయడం, పార్లమెంటులో బిల్లులను చించివేయడం క్షమించరాని చర్యలని గుర్తు చేస్తున్నారు మాయావతి.
దళితులకు రిజర్వేషన్లు అంటే ఏమిటి?

విజయవాడలో ఓ టాక్సీ డ్రైవర్ సతీష్ ... బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారా? అని అడుగుతాడు. "మేము దళితులం. మా తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నేను కూడా రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా. కానీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తిరగరాస్తారంటున్నారు. వాళ్లు అంత ఈజీగా చేయగలరా" అన్నది సతీష్ ప్రశ్న. ఈ అభద్రత ఒక్క ఆంధ్రాకో తెలంగాణకో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చసాగుతోంది. ప్రతి రాజకీయ పార్టీ బీఆర్ అంబేడ్కర్ పేరు చెబుతూనే రిజర్వేషన్లను ప్రస్తావిస్తున్నారు. వాళ్ల వాళ్ల వాదనలకు తగ్గట్టుగా అంబేడ్కర్ మాటల్ని ఉచ్ఛరిస్తున్నారు. నరేంద్ర మోదీ కూడా అంబేడ్కర్ పేరు చెప్పే రిజర్వేషన్లు రద్దు చేయబోమంటున్నారు. అయినా సరే దళిత వర్గాలు బీజేపీ మాటల్ని విశ్వసించడం లేదనిపిస్తోంది.
ఈనేపథ్యంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో దళిత విద్యార్థులు రాజకీయంగా గందరగోళంలో ఉన్నారు అంటున్నారు ఒక దళిత ప్రొఫెసర్.
" ప్రస్తుత న్యాయవ్యవస్థ లేదా పోలీసు వ్యవస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా లేదన్నది చాలా మంది దళితుల భావన. ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తే అభద్రతా భావం మరింత ఎక్కువ అవుతుందేమో" అని ప్రొఫెసర్ శౌరయ్య అభిప్రాయపడ్డారు.
"వ్యవస్థలు బలహీనులకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయన్నది ఇప్పటి వరకు చరిత్ర చెబుతున్న అనుభవం. దిగువ కోర్టుల్లో పరిష్కారమయ్యే సమస్యల కోసం కూడా ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. బలహీన వర్గాలకు న్యాయ పోరాటాలు చేసే సామర్థ్యం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ లాంటి పార్టీలకు ఎక్కువ మెజారిటీ సీట్లు ఇస్తే దళితుల హక్కులకు విఘాతం కలుగుతుందని దళితులు నమ్ముతున్నారు. బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఇస్తే "రాజ్యాంగాన్ని తిరగరాసే అవకాశం ఉందని, ముస్లింలు, దళితులు కలిసి బీజేపీ మెజారిటీని తగ్గించాలని దళిత మేధావులు సలహా ఇస్తున్నారు. దళిత సంఘాలు తమ ఎన్నికల ప్రాధాన్యతలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు కనిపిస్తోంది.
Read More
Next Story