
డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసింది..అందుకే హత్య చేశా..
‘‘హిమాని నర్వాల్ను ఆమె ఇంట్లోనే చంపేశా. సూట్కేస్లో కుక్కి బస్టాండ్ సమీపంలో పడేశా’’ - నిందితుడు సచిన్.
హరియాణా(Haryana)లో కాంగ్రెస్ కార్యకర్త హిమాని నర్వాల్(Himani Narwal) హత్య కేసులో నిందితుడు సచిన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హరియాణాలోని బహాదుర్గఢ్కు చెందిన సచిన్.. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. తనతో సన్నిహితంగా ఉండే హిమాని..లక్షల్లో డబ్బు వసూలు చేసిందని, ఇంకా కావాలని బ్లాక్మెయిల్ చేయడంతో విసుగెత్తి..రోహ్తక్ జిల్లా విజయ్ నగర్లోని తన ఇంట్లోనే హిమానిని హత్య చేసి, మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి బస్స్టాండ్ సమీపంలో పడేశానని చెప్పాడు. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత సచిన్ను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో హిమానీ మొబైల్ సచిన్ వద్దే ఉందని పోలీసులు చెప్పారు.
సచిన్ అరెస్టయిన తర్వాత కుటుంబ సభ్యులు అతనికి మరణదండన విధించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో తన కూతురి ఎదుగుదలను ఓర్వలేక హత్య చేశారని హిమాని తల్లి సవిత ఆరోపించారు.
హిమాని నర్వాల్ ఎవరు?
హిమాని నర్వాల్(Himani Narwal) హర్యానాలోని రోహ్తక్లో యూత్ కాంగ్రెస్(Congress) కార్యనిర్వాహకురాలు. సోనిపట్ జిల్లా కథురా గ్రామానికి చెందిన ఈమె అద్దె ఇంట్లో ఉండేది. ఆమె తల్లి, సోదరుడు ఢిల్లీ నజఫ్గఢ్లో ఉంటున్నారు. హిమాని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో చురుకుగా పాల్గొన్నారు. అలాగే హర్యానా కాంగ్రెస్ సభల్లో, సామాజిక కార్యక్రమాల్లో హర్యాణ్వీ కళాకారులతో కలిసి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. హర్యానాలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న రోజున హిమాని హత్యకు గురయ్యారు.