
‘బీజేపీ కోసం పని చేసే నాయకులు కాంగ్రెస్కు అవసరం లేదు.’
లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
పార్టీని బలోపేతం చేయడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. బీజేపీ(BJP)కి సహకరించే నాయకులను ఏరివేయాల్సిన సమయం దగ్గర్లోని ఉందన్నారు. గుజరాత్(Gujarat)లో రెండురోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
కఠిన నిర్ణయాలు తప్పవు..
‘‘కాంగ్రెస్లో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం ప్రజలకు అండగా ఉంటూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నడుచుకుంటుంది. మరో వర్గం వారికి దూరంగా ఉంటూ.. సిద్ధాంతాలను గౌరవించకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది’’ అని అన్నారు. 2027 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో చేసుకుని భారీ మార్పులు ఉంటాయన్న సంకేతాలనిచ్చారు రాహుల్. బీజేపీని ఓడించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని ఆయన మాటల్లో ప్రతిధ్వనించింది.
కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం..
గుజరాత్లోని పరిస్థితులను ప్రస్తావిస్తూ. ‘‘ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రైతులు పరిస్థితి దారుణంగా ఉంది. డైమండ్, టెక్స్టైల్, సిరామిక్ పరిశ్రమల పరిస్థితి మారిపోయింది. ఈ సమస్యలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిష్కారం చూపగలదు. కాని నాయకత్వం బలహీనంగా ఉంటే..ఈ లక్ష్యాలను చేరుకోలేం. కాంగ్రెస్ గుజరాత్లో 30 ఏళ్లుగా అధికారంలోకి రాలేదు. గుజరాత్ ప్రజలు మన నాయకుల నుంచి ఎన్నో ఆశించారు. కానీ మనం వాటిని నెరవేర్చలేకపోయాం." అని అన్నారు.
ఓటు శాతం పెరగాలి..
"కాంగ్రెస్కు రాష్ట్ర, జిల్లా స్థాయిలో నాయకుల కొరత లేదు. పార్టీలో ఉన్న ప్రతిఒక్కరూ గుజరాత్ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు వినాలి. ప్రజల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై మనం ఏం చేయగలమో ఆలోచించాలి. గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే కేవలం 5% ఓట్లు పెరిగితే చాలు. తెలంగాణలో ఓటు శాతాన్ని 22% పెంచి గెలిచాం. దాన్ని గుజరాత్లోనూ చేయాలి" అని రాహుల్ సూచించారు.
64 ఏళ్ల తర్వాత గుజరాత్లో..
ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) సమావేశం ఏప్రిల్ 8-9 తేదీల్లో అహ్మదాబాద్లో జరగనుంది. 64 ఏళ్ల తరువాత ఈ సమావేశం గుజరాత్లో జరుగుతోంది.
2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 182 స్థానాల్లో కేవలం 17 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆపై ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రస్తుతం పార్టీ సీట్లు 12కి తగ్గాయి.