ఆధిక్యంలో దూసుకెళ్తున్న కాషాయ పార్టీ.. వెనకబడ్డ కేజ్రీవాల్, ఆతీశీ
x

ఆధిక్యంలో దూసుకెళ్తున్న కాషాయ పార్టీ.. వెనకబడ్డ కేజ్రీవాల్, ఆతీశీ

ఎగ్జిట్ పోల్స్ కాస్త ఎగ్జాట్ పోల్స్ గా రావడంతో సంతోషంలో బీజేపీ


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా ఎగ్జాట్ పోల్స్ సాగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో బీజేపీ 50 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది.

అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం కేవలం 25 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రత్యర్థి బీజేపీ నేత ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అలాగే సీఎం ఆతిశీ మార్లేనా సైతం వెనకబడ్డారు. మరో కీలక నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తన నియోజక వర్గాన్ని మార్చినప్పటికీ అక్కడ కూడా బీజేపీ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది.

11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఆప్ కు ఈ సారి ఎన్నికల్లో ఎదురుగాలి బలంగా వీస్తోంది. బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి రావడానికి 27 సంవత్సరాలుగా ఎదురు చూస్తోంది.
ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయింది. పోస్టల్ బ్యాలెట్ లలో కమలం పార్టీ తన జోరు ప్రారంభించింది. కౌంటింగ్ ఆది నుంచే బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచింది.
70 మంది సభ్యులున్నా ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ 36. ప్రస్తుతం ఆప్ కు ఢిల్లీ అసెంబ్లీలో 62 మంది సభ్యులున్నారు. బీజేపీకి ఎనిమిది మంది, కాంగ్రెస్ కు ఒక్క స్థానం కూడా లేదు.
దేశ రాజధాని లో 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 5న జరిగిన పోలింగ్ లో 58 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తరువాత విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీనే స్పష్టమైన మెజార్టీతో అధికారం సాధిస్తుందని అంచనా వేశాయి.కేవలం రెండు సంస్థలు మాత్రమే ఆప్ విజయం సాధిస్తుందని అంచనాలు ఇచ్చాయి.
తమకు ఎన్నికల్లో 60 సీట్ల దాకా వస్తాయని ఆప్ అధినేత కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2020 లో ఇలాగే అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నే విజయం సాధిస్తాయని చెప్పాయని, కానీ తాము ప్రభంజనం సృష్టించామని అన్నారు.
ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆప్ పై అవినీతి వ్యతిరేక ప్రచారం ఈ సారి గట్టి ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వయంగా కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో దాని ప్రతిష్ట మసకబారిందని, ప్రచారంలో కూడా ప్రతిపక్షాలపై చౌకబారు విమర్శలకు దిగడం ఓటర్లకు నచ్చలేదని అంటున్నారు.
Read More
Next Story