జార్ఖండ్ సీఎం ఎందుకు పరారయ్యారు?  సోరెన్ అరెస్ట్ కు రంగం సిద్ధమైందా!
x
హేమంత్ సోరెన్ దంపతులు

జార్ఖండ్ సీఎం ఎందుకు పరారయ్యారు? సోరెన్ అరెస్ట్ కు రంగం సిద్ధమైందా!

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. రెండు రోజులుగా ఈడీ ఆయన ఆచూకీ కోసం గాలిస్తోంది. ట్విస్ట్ ల మీద ట్విస్టులు జరుగుతున్నాయి.


జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ దాదాపు 34 గంటలు కనిపించకుండా పోయారు, పరారయ్యారని బీజేపీ, కాలేదని జేఎంఎం.. ఇలా రెండు రోజులుగా నడుస్తున్న డ్రామా నేపథ్యంలో.. సోరెన్ ను అరెస్ట్‌ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగం సిద్ధం చేసినట్టు ఢిల్లీలో ఈ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సీఎం పదవి నుంచి ఆయన వైదొలగబోతున్నట్టు కూడా చెబుతున్నారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈడీ తీరును, కదలికలను క్షుణ్ణంగా చర్చించారు. ప్లాన్ బీ సిద్ధం చేశారు.


సోరెన్ పై ఉన్న కేసు ఏమిటీ?

జార్ఖండ్ లో అత్యంత విలువైన భూమి యాజమాన్య హక్కుల్ని సోరెన్ మార్పించారన్నది ఆరోపణ. ఈ భూకుంభకోణానికి సంబంధించి సుమారు 6 వందల కోట్ల నగదు చేతులు మారిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

హేమంత్‌ సోరెన్‌ ఎక్కడ?

హేమంత్‌ సోరెన్‌ గత వారం రాంచీ నుంచి ఢిల్లీకి వచ్చినట్లు ఈడీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆయనను విచారించేందుకు సోమవారం ఢిల్లీలోని అధికారిక నివాసానికి వెళ్లారు. అయితే, రాత్రి పొద్దుపోయేవరకూ ఎదురు చూసినా.. సోరెన్‌ అక్కడికి రాలేదు. దీంతో సీఎంకు చెందిన ఓ బీఎండబ్ల్యూ కారు, మరో బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులో 36 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు సమాచారం. ఆయన ప్రయాణించిన ప్రైవేటు విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పార్క్‌ చేసి ఉన్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు, జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఇప్పటికే ఈడీ అధికారులకు సందేశం పంపారు. బుధవారం మధ్యాహ్నం ఆయనను విచారించే అవకాశాలున్నట్లు కన్పిస్తోంది.

రాంచీలో ప్రత్యక్షమైన హేమంత్ సోరెన్...

ఈడీ తనిఖీలు.. ఆపై కొన్ని గంటల పాటు ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అదృశ్యంతో రాంచీలో రాజకీయం వేడెక్కింది. భూకుంభకోణం, మనీలాండరింగ్‌ కేసుల్లో ఆయన కీలక నిందితుడు. ఇప్పటికే 10 సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా పట్టించుకోలేదు. ఈడీ అధికారులు వెతుక్కుంటూ ఢిల్లీలోని ఆయన నివాసానికి చేరుకున్నా అక్కడా జాడలేదు. అయితే అనూహ్యంగా మధ్యాహ్నం రాంచీలోని స్వగృహంలో జరిగిన సంకీర్ణ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన సతీమణి కల్పనా సోరెన్‌ కూడా దీనికి హాజరయ్యారు. దీంతో హేమంత్‌ అరెస్టు ఖాయమనే ఊహాగానాలకు బలం చేకూరినట్లైంది. ఈనేపథ్యంలో జేఎంఎం ‘ప్లాన్‌-బి’ అమలుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఏమిటీ వ్యూహం..

ఒకవేళ హేమంత్‌ జైలుకు వెళ్లాల్సి వస్తే.. ముఖ్యమంత్రి బాధ్యతలను ఆయన సతీమణి కల్పనా సోరెన్‌కు అప్పగించనున్నారు. ప్రస్తుతానికి ఆమె ఎమ్మెల్యే కాదు. కానీ, అధికార కూటమిలో ఆమె శక్తిని సవాలు చేసే స్థాయిలో ఎవరూ లేరు. పార్టీలో మెజార్టీ వర్గం ఆమె వెనకే ఉంది. గాండే అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ ఖాన్‌ రాజీనామా చేశారు. ఆయన అక్కడి నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలిచారు. రెండు సార్లు కాంగ్రెస్‌ టికెట్‌పై విజయం సాధించగా.. 2019లో జేఎంఎం తరఫున పోటీ చేసి నెగ్గారు. పార్టీ వ్యూహంలో భాగంగా ఈ స్థానం నుంచి తాజాగా హేమంత్‌ సతీమణి ఉప ఎన్నిక బరిలోకి దిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా త్వరలో సర్ఫరాజ్‌ రాజీనామాకు ఆమోదముద్ర పడనున్నట్లు తెలుస్తోంది.

ఎవరీ కల్పనా సోరెన్‌..

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన కల్పన ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. ఎంబీఏ పూర్తి చేశారు. పార్టీలో ఆమెను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. ప్రస్తుతం ఆమె సేంద్రియ వ్యవసాయం చేయడంతో పాటూ ఓ పాఠశాలను నడుపుతున్నారు. రాజకీయాల్లో హేమంత్‌కు ఆమె ముఖ్య విషయాల్లో సలహాలు ఇస్తుంటారనే ప్రచారం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో 17 సీట్లు ఉన్న కాంగ్రెస్‌ నుంచి ఆమెకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. ఒకవేళ ఏమైనా విభేదాలు తలెత్తితే అది ‘ఇండియా’ కూటమిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

సోరెన్ కుటుంబ చరిత్ర ఇదీ...

జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. శిబు రాజ్యసభ సభ్యుడు. హేమంత్‌, బసంత్‌ ఎమ్మెల్యేలు. మరో కుమారుడు దుర్గా 2009లో మరణించారు. ఆయన భార్య సీత ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆమెకు జేఎంఎం పార్టీ విధానాలు అసలు నచ్చవు. బీజేపీతో కలిసి హేమంత్‌ ప్రభుత్వంపై పోరాడింది. ఈ ప్రభుత్వాన్ని ఆమె కూలదోస్తుందని 2022 నుంచి ప్రచారం జరుగుతోంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అంత రాజకీయ శక్తి లేదు. బసంత్‌కు రాజకీయ చతురత లేదు. శిబు కుమార్తె అంజలి రాజకీయాలకు దూరం. ఈ నేపథ్యంలో కల్పన రాజకీయ భవిష్యత్తుకు తక్షణమే వచ్చిన ముప్పేమీ లేదు. ఒకవేళ హేమంత్‌ అరెస్ట్ అయినా కల్పన పాలనా పగ్గాలు పట్టగలదని చెబుతున్నారు.

Read More
Next Story