రామమందిరం నిర్మాణం ఎలా జరిగింది... బ్రిక్ బై బ్రిక్
x

రామమందిరం నిర్మాణం ఎలా జరిగింది... బ్రిక్ బై బ్రిక్

రామమందిర పునాది దగ్గర నుంచి ప్రారంభోత్సవం వరకూ జరిగిన విషయాలు ఫెడరల్ పాఠకుల కోసం ప్రత్యేకంగా..


1992 డిసెంబర్ ఆరున అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. మొఘల్ సుల్తాన్ అయోధ్యలోని రామమందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించాడు. హిందూ సంఘాలు దీనిని రాముడి జన్మస్థలంగా పేర్కొంటాయి. దీనిపై అనేక వందల సంవత్సరాలుగా అనేక వివాదాలు ఉన్నాయి. దశాబ్దాలుగా రాజకీయ, సామాజిక రంగాలపై దీని ప్రభావం పడింది. అయితే చివరగా ఉన్నత న్యాయస్థానం తీర్పుతో మందిరం నిర్మాణం ప్రారంభం అయింది.

ప్రధాన రామమందిర విశేషాలు

మొత్తం వైశాల్యం: 2.77 ఎకరాలు

ఆలయం నిర్మించే ప్రాంతం: 57,400 చదరపు అడుగులు

ఆలయం పొడవు: 360 అడుగులు

మందిరం వెడల్పు: 235 అడుగులు

ఆలయం ఎత్తు ప్రధాన గోపురంతో సహ: 161 అడుగులు

ఆలయాన్ని నిర్మించే అంతస్తుల సంఖ్య: 3

ప్రతి అంతస్తు ఎత్తు : 20 అడుగులు

కింది అంతస్తులో(గ్రౌండ్ ఫ్లోర్) మొత్తం పిల్లర్ల సంఖ్య: 160

మొదటి అంతస్తులోని పిల్లర్ల సంఖ్య:132

రెండో అంతస్తులోని పిల్లర్ల సంఖ్య: 74

మండపాలు, మంటపాల(పెవిలియన్) సంఖ్య: 5

మొత్తం ద్వారాలు: 12

ఆలయ నిర్మాణం

రామమందిరం ఎలా ఉండాలనే దానిపై అహ్మదాబాద్ కు చెందిన ప్రసిద్ధ ఆలయ నిర్మాణ సంస్థ ‘సోంపురా ఆర్కిటెక్ట్’ కుటుంబం 1988లోనే డిజైన్ చేసింది.

ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ సొంపురా, అతని కుమారులు నిఖిల్ సొంపురా, అశిష్ సోంపురా ఈ డిజైన్ రూపొందించడంలో సాయం అందించారు.

2019 లో సుప్రీంకోర్టు తీర్పు తరువాత తాము రూపొందించిన డిజైన్ కు కొన్ని మార్పులు చేశారు.

హిందూగ్రంథాలు, వాస్తు, శిల్ప శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ డిజైన్ రూపొందించారు. శ్రీరామ నవమి నాడు సూర్యకిరణాలు నేరుగా రామ్ లల్లా(బాలరాముడు) పాదాలపై పడేలా రూపొందించారు.

ఆలయంలోని తూర్పు ద్వారం దక్షిణ భారత శైలిలో నిర్మించారు. గర్భగుడి మాత్రం అష్టభుజ ఆకారంలో ఉంటుంది. నిర్మాణం చుట్టుకొలత వృత్తాకారంలో ఉంటుంది.

పనులు ప్రారంభం

ఆగష్టు 5, 2020 అయోధ్య లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తరువాత పనులన్నీ జెట్ స్పీడ్ తో ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ 40 కిలోల వెండి ఇటుకను పునాది రాయిగా వేశారు.

రామమందిర నిర్మాణాన్ని ప్రముఖ బ్యూరో క్రాట్ నృపేంద్ర మిశ్రా నేతృత్వంలోని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది.

ప్రధాన నిర్మాణపు పనులను ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీ పర్యవేక్షిస్తోంది. టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్, ఇతర అనుబంధ పనులను నిర్వహిస్తోంది.

ప్రతిరోజు 1100 మంది కార్మికులు 24*7 ఆలయ నిర్మాణం కోసం పని చేశారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన శిల్పులు, స్తంభాలు, తోరణాలు చెక్కే పనిని చేశారు.

బలమైన పునాది, ఆకృతి

బలమైన పునాదీ కోసం భూమిని 40 ఫీట్ల వరకూ తవ్వారు. మట్టిని తొలగించి, కింద గట్టిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ఆలయం పునాది బలంగా ఉండడం కోసం ‘రోలర్- కాంపాక్ట్ కాంక్రీట్’ ను ఉపయోగించి తయారు చేశారు.

పునాదిని మొత్తం 47-48 లేయర్లుగా నిర్మించారు. ఒక్కో లేయర్ ఎత్తు ఒక అడుగు ఉండేలా నిర్మించారు. సెప్టెంబర్ 2021 నాటికి ఈ పనులు పూర్తి చేశారు.

రామమందిర పునాది ప్రధానంగా 2.77 ఎకరాల స్థలంలో ‘ఇంజనీర్డ్ మట్టి’ మీద ఉంటుంది. ఇది భూమి నుంచి 15 మీటర్ల లోతులో ఉంటుంది.

ఈ నిర్మాణానికి అరుదైన గులాబీ, పాలరాయిని రాజస్తాన్ లోని ‘బన్సీపహర్ పూర్’ నుంచి తెప్పించారు. వాటిని సృజనాత్మకంగా చెక్కి నిర్మాణం కోసం వాడారు.

ఆలయం నిర్మాణానికి మొత్తం 4 లక్షల చదరపు అడుగుల రాయి అవసరం. ఇప్పటి వరకూ కేవలం మొదట అంతస్థు మాత్రమే పూర్తి అయింది.

ఆలయంలో మనం ఇకముందు చూడబోయే గంట బరువు 2100 కిలోలు. ఇది ఆరు అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ఉంటుంది. దీనిని యూపీలోని ఎటాహ్ నుంచి రూ. 21 ఖర్చు పెట్టి తెప్పించారు.

ఆలయం కోసం దాదాపు రెండు లక్షలకు ఇటుకలను వాడారు. ఇవన్నీ కూడా పునాదిలోనే మాత్రమే ఉపయోగించారు. వీటన్నింటిని దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సేకరించారు. అన్ని ఇటుకలపై ఆయా రాష్ట్రాల బాషతో ‘శ్రీరామ’ అని రాయబడి ఉన్నవి.

ఆలయా నిర్మాణానికి వాడిన వస్తువులు

1980 దశకం ప్రారంభం నుంచే విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం దేశ అంతటా ‘జై శ్రీరామ్’ అని రాసి ఉన్న ఇటుకలను సేకరించడం ప్రారంభించింది.

దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, పవిత్ర జలం సేకరించారు.

మట్టి, నీరు సేకరించిన ప్రదేశాలలో గంగా, యమునా సంగమ ప్రదేశం. కర్నాటకలోని కావేరి, అసోంలోని కామఖ్య శక్తిపీఠం వంటి ప్రదేశాలు ఉన్నాయి.

దేశంలోని ప్రధాన హిందూ దేవాలయాలు, గురుద్వారాలు, జైన ఆలయాలతో పాటు ఛార్ ధామ్ యాత్రల ప్రదేశాలతో సహ 2,587 ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి తీసుకొచ్చారు.

ఆలయం నిర్మాణం కోసం రాజస్టాన్ లోని ‘బాన్సి’ నుంచి దాదాపు 6 లక్షల క్యూబిక్ అడుగుల ఇసుకరాయిని తెప్పించారు.

థాయిలాండ్ తన దేశంలో ప్రవహించే రెండు నదుల నుంచి మట్టిని, నీటిని సేకరించి రామమందిర నిర్మాణం కోసం పంపింది.

ఆలయంలోని తలుపులు, కిటికీల కోసం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా నుంచి సేకరించిన టేకు కలపను వాడారు.

శ్రీరాముడి దివ్యమూర్తి

ఆలయంలో శ్రీరాముడు, బాలరాముడు( రామ్ లల్లా) గా దర్శనం ఇస్తారు.

ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి. వాటిలో ప్రస్తుతం ప్రతిష్టించే బాలరాముడు కాగా, మరొకటి 1949లో వెలసిన రామచంద్ర ప్రభువు విగ్రహం. ప్రస్తుతం ఈ విగ్రహం ఇక్కడే ఉన్న డేరాలో ఉంది. ఈ విగ్రహాన్ని ఇక నుంచి ఉత్సవమూర్తిగా వాడనున్నారు.

రామ్ లల్లా విగ్రహాన్ని మైసూర్ కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. దాదాపు 250 సంవత్సరాలుగా వీరి కుటుంబం ఈ శిల్పాల పరిశ్రమలో ఉంది.

రామ్ లల్లా దుస్తులను అయోధ్యలోని నాల్గవ తరం టైలర్ల కుటుంబానికి చెందిన టైలర్లు భగవత్ ప్రసాద్, శంకర్ లాల్ కుట్టించారు.

ఎనిమిది అడుగుల ఎత్తైన బంగారు పూతతో ఉన్న పాలరాతి సింహాసనం పై రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.

కాలానికి తట్టుకునేలా నిర్మాణం

ప్రస్తుత ఆలయాన్ని మరో వేయి సంవత్సరాలు పాటు నిలిచి ఉండేలా డిజైన్ చేశారు. రిక్టర్ స్కేల్ పై భూకంపం 7.0 తో వచ్చిన ఆలయం చెక్కుచెదరదు.

ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా ఇనుము, ఉక్కు వాడలేదు. మొత్తం రాతినే ఉపయోగించారు. ఇనుము, ఉక్కును వాడితే ప్రతి 80-100 సంవత్సరాలకు మరమ్మత్తులు చేయాల్సి ఉంటుంది. అందుకే వాటిని ఉపయోగించలేదు.

ఎక్కువ కాలం ఆలయం నిలిచి ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువగా రాయి, రాగి, తెలుపు సిమెంట్, కలపను ఉపయోగించారు.

నిధుల సేకరణ- ఖర్చు

ఆలయం నిర్మించడానికి దాదాపు రూ. 1400-1800 కోట్లు అవుతుందని అంచనా.

జనవరి 22 న జరిగే ప్రాణ ప్రతిష్ట కోసం యూపీ ప్రభుత్వం ఇప్పటికే రూ. 100 కోట్లు కేటాయించింది.

నిధుల సేకరణ కోసం ఆలయ ట్రస్ట్ దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించింది. రూ. 10 అంతకంటే ఎక్కువ విరాళాలు స్వచ్చందంగా ఇవ్వాలని ప్రజలను కోరింది. ఆలయ నిర్మాణంలో ప్రజలందరిని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ విరాళాలు సేకరించారు.

దేశవ్యాప్తంగా ఉన్న శ్రీరామ భక్తులు కరిగించిన బంగారం, వెండిని విరాళంగా అందజేశారు.

ఈ విరాళాల కోసం దాదాపు 1.50 లక్షల మంది వీహెచ్ పీ కార్యకర్తలు పని చేశారు. వీరు సేకరించిన నిధులను మూడు జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేశారు. అవి స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ చేశారు.

విరాళాల కోసం హైదరాబాద్ కు చెందిన ధనుషా ఇన్ఫోటెక్ రూపొందించిన యాప్ ద్వారా విరాళాల సేకరణను సమన్వయం చేసుకున్నారు.

ఎప్పుడు పూర్తవుతుంది.

ఆలయం మొత్తం నిర్మాణం 2025 నాటికి పూర్తి కావచ్చు.

మందిరం చుట్టూ చాలా భాగం పచ్చని ప్రాంతంలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న 600 వృక్షాలను సంరక్షించారు.

ఆలయ నిర్మాణం కోసం భారత ప్రభుత్వం పఠిస్తున్న ఆత్మనిర్భర భారత్ కింద ఇతర దేశాల నుంచి ఎటువంటి సాయం లేకుండా స్వయం ప్రతిపత్తితో నిర్మిస్తున్నారు.

ఆలయానికి ప్రత్యేకంగా నీటి శుద్ధి కర్మాగారాలు, అగ్నిమాపక దళం, పోస్ట్ సేవలు, ప్రత్యేక విద్యుత్ లైన్ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. వీటిని ఆలయ అధికారులే నిర్వహించనున్నారు.

ఆలయ నిర్మాణాన్ని మొత్తం డాక్యుమెంట్ చేశారు. భవిష్యత్ ఇంజనీర్లకు మార్గదర్శకత్వం ఉండేలా ఈ చర్య తీసుకున్నారు.

Read More
Next Story