రాయ్ బరేలీ సరే.. మరీ వాయనాడ్ పరిస్థితేంటీ?
x

రాయ్ బరేలీ సరే.. మరీ వాయనాడ్ పరిస్థితేంటీ?

చాలా వారాల సస్పెన్స్ తరువాత గాంధీ కుటుంబం అమేథీ, రాయ్ బరేలీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. కానీ..


కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు శుక్రవారం (మే 3) ఉదయం తన అభ్యర్థులను ప్రకటించింది, రెండు నియోజకవర్గాల నుంచి రాహుల్ గాంధీ కెఎల్ శర్మలను బరిలోకి దింపింది. లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో మే 20న పోలింగ్ జరగనున్నఈ రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మే 3 చివరి తేదీ. అదే రోజును కాంగ్రెస్ తన అభ్యర్థులను ఎంపిక చేసింది.

రాహుల్ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో తను అరంగేట్రం చేయడం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్న నేపథ్యంలో రాయ్‌బరేలీ నుంచి రాహుల్, అమేథీ నుంచి ప్రియాంక పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబంతో ఈ స్థానాలకు చాలాకాలంగా అనుబంధం ఉంది.
జాగ్రత్తగా ఎంపిక..
రాయ్‌బరేలీని గాంధీ కుటుంబంలోనే కొనసాగించాలని, అమేథీని తమ చిరకాల విధేయుడైన శర్మకు వదిలేయాలని గాంధీలు తీసుకున్న నిర్ణయం ఎన్నికల ఫలితాలతో పాటు కాంగ్రెస్ నైతికతపై, ముఖ్యంగా అమేథీలో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించడం కష్టమే. ఐదేళ్ల క్రితం బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహూల్ ఓడిపోయారు.
ఏది ఏమైనప్పటికీ, కాంగ్రెస్ రెండు నియోజకవర్గాలలో తన ఎన్నికల వ్యూహాన్ని చాలా జాగ్రత్తగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీజేపీ ఇక్కడ ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఐదేళ్ల నుంచి రాష్ట్రానికి కేవలం రెండు సార్లే యువరాజు వచ్చారని, గత ఎన్నికల్లో వాయనాడ్ పారిపోయారని, మళ్లీ అక్కడ ఓడిపోతాననే భయంతోనే రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగారని కమలదళం విమర్శలు ఎక్కుపెట్టింది. రెండు చోట్ల గెలిస్తే ఏదో ఒక చోట ఉప ఎన్నిక అనివార్యం. మరీ రాహూల్ ఏ స్థానం ఎంచుకుంటారని కాషాయ దళం ప్రశ్నిస్తోంది.
అమేథీ, రాయ్‌బరేలీల నుంచి ఎన్నికల్లోకి బరిలోకి దిగడం లేదా వాటిని వదులుకోవడం గాంధీ కుటుంబానికి అంత ఈజీ కాదు. ఇరానీపై రాహూల్ గాంధీ అమెఠీ నుంచి పోటీ చేస్తే రెండో సారి కూడా ఓడిపోయే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఆయనను రాయ్ బరేలీ నుంచి బరిలోకి దింపినట్లు అర్ధమవుతోంది. ఇది కూడా అంతతేలికగా ఏం జరగలేదు. చాలా వారాల సస్పెన్స్ తరువాత గానీ రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగేది ఎవరని స్పష్టత రాలేదు. చివరకు అమేథీ, రాయ్ బరేలీ అభ్యర్థులు ఎవరో చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
అమేథీని వదులుకోవడం వెనకున్నఅర్థం ఏంటీ?
2019 తరువాత రాహూల్ గాంధీ తన కుటుంబ కంచుకోట అయిన అమేథీ నుంచి పోటీ చేయాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో, రెండోసారి ఇరానీ చేతిలో ఓటమి పాలైతే గాంధీ కుటుంబానికి అంతకంటే మరో అవమానం ఉండదు. అందుకే పోటీ విషయంలో రాహూల్ గాంధీ జంకుతున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే రాయ్ బరేలీ నుంచి రాహూల్ ఎమోషనల్ కార్డును ప్లే చేయకపోవచ్చని బీజేపీ భావిస్తోంది.
ఏది ఏమైనా అతను 2004, 2009, 2014లో గెలిచిన అమేథీని వదులుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడు. గతంలో తన తల్లిదండ్రులు ఇక్కడి నుంచే - 1981, 1984, 1989, 1991 లలో దివంగత రాజీవ్ గాంధీ.. 1999 లో సోనియా - లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఓటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ఆయన అమేథీకి రావాల్సింది పోయి.. మరోసారి రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగుతున్నాడు.
KL శర్మ: అమేథీ, రాయ్ బరేలీకి ఛార్జ్ డి'ఎఫైర్స్
రాహుల్ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేయాలా వద్దా అనే దానిపై గాంధీలు తీవ్రంగా ఆలోచించారు. చివరకు 1981 నాటి ఉప ఎన్నికల్లో రాజీవ్ విజయం సాధించినప్పటి నుంచి గాంధీ కుటుంబానికి, రాయ్ బరేలీ, అమేథీ ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఉన్న శర్మను ఇరానీపైకి పోటీకి నిలపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆయన గెలిస్తే ఎప్పటికీ పర్యవేక్షకులుగా ఉంటారు.
నిజానికి శర్మ పంజాబ్ కు చెందిన వ్యక్తి. అందరికి అందుబాటులో ఉంటారు. మితభాషి. ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రజలు ఈయనను సులభంగా గుర్తు పడతారు. అందరికి సాయం చేయడానికి ముందుంటాడు. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన గాంధీ కుటుంబానికి ఇక్కడ బాధ్యత వహిస్తున్నాడు.
రాయ్‌బరేలీ నుంచి రాహుల్ అభ్యర్థిత్వంపై గాంధీలు ఇప్పుడే నిర్ణయం తీసుకున్నప్పటికీ, రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహాలు వేగవంతంగా జరిగేలా చూడాలని చాలా కాలం క్రితమే శర్మకు సూచించారని కొన్ని వర్గాలు ది ఫెడరల్‌కి తెలిపాయి.
గట్టిగానే గ్రౌండ్‌వర్క్
‘‘గత ఆరు నెలలుగా ఆయన (శర్మ) రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అతను రెండు స్థానాల్లో బూత్ స్థాయి ఏజెంట్లను గుర్తించి, అమేథీ, రాయ్ బరేలీలో ప్రతి ఇంటి నుంచి అభిప్రాయాన్ని సేకరించే పనిలో పెట్టాడు. అమేథీలో, ఇరానీకి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం ఉన్న అంశాలు కూడా కింది స్థాయికి చేరేలా ప్రచారం ప్రచారం చేస్తున్నారు. చాలా సర్వేలు కూడా జరిగాయి ”అని అమేథికి చెందిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు ది ఫెడరల్‌తో అన్నారు.
ఐదేళ్ల క్రితం రాహుల్ విఫలమైన చోట ఇరానీ వంటి ఉన్నత స్థాయి ప్రత్యర్థితో తలపడి విజయం సాధించేందుకు శర్మకు ఉన్న బలం సరిపోతుందా చూడాలి. రాహూల్, ప్రియాంకలు శర్మ కోసం విస్త్రృతంగా పర్యటనలు చేస్తారని తెలుస్తోంది. శర్మను కూడా ఎందుకు పోటీకి నిలబెట్టారో కూడా ప్రచారంలో ప్రజలకు వివరిస్తారని కూడా కాంగ్రెస్ వర్గాల ఉవాచ.
రాయ్‌బరేలీతో గాంధీ కుటుంబానికి బలమైన సంబంధాలు..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ని పోటీకి దింపడం, గాంధీ వారసుడు ఉత్తరప్రదేశ్‌ నుంచి మరో ఎన్నికల్లో ఓడిపోకుండా చూసుకోవడం పార్టీకి చాలా అవసరం. ఈ నియోజకవర్గం, 1952 నుంచి 17 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపీగా ఎన్నుకుంది. బిజెపి రెండుసార్లు గెలిచింది.
రాయ్‌బరేలీతో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం కూడా అమేథీతో ఉన్న సంబంధాలకు ముందే ఉంది. రాహుల్ తాత, ఫిరోజ్ గాంధీ 1952లో రాయ్‌బరేలీకి తొలి ఎంపీ కాగా, ఆయన అమ్మమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980లో గెలిచారు. సోనియా 2004 నుంచి రాయ్‌బరేలీలో గెలుపొందారు, 2019 ఎన్నికల్లో ఆమె ఒక్కరే కాంగ్రెస్ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా గెలుపొంది. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై 1.67 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ తన రాయ్‌బరేలీ అభ్యర్థిని ప్రకటిస్తుందని కూడా ఎదురుచూసిన బిజెపి చివరకు గురువారం (మే 2) సింగ్‌ నే మళ్లీ రంగంలోకి దించాలని నిర్ణయించుకుంది సోనియా గాంధీ 2019 ప్రత్యర్థి ఇప్పుడు ఎన్నికల యుద్ధంలో రాహుల్‌తో తలపడనున్నారు.
అమేథీలో శర్మకు ఎదురయ్యే సవాలే అతిపెద్దది. రాయ్ బరేలీ లో రాహూల్ గాంధీ విజయం చాలా సులభం కావచ్చు. ఇక్కడ, వాయనాడ్ లో గెలిస్తే రెండింటిలో ఆయన ఏదో ఒక స్థానం ఆయన ఎంచుకోవాల్సి ఉంటుంది.
Read More
Next Story