
భువనేశ్వర్లో 105 ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.18,500 కోట్లు..
కాసేపటి క్రితం ప్రధాని మోదీ(PM Modi) ఒడిశా(Odisha) రాష్ట్రం భువనేశ్వర్(Bhubaneswar) చేరుకున్నారు. రూ.18,600 కోట్ల విలువ చేసే 105 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టులలో తాగునీరు, నీటిపారుదల, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, గ్రామీణ రోడ్లు, వంతెనలు, జాతీయ రహదారులు, రైల్వే మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
సోనేపూర్-పురుణకటక్ రైల్వే లైన్ను ప్రారంభించిన తర్వాత బౌధ్ జిల్లాకు మొదటి ప్యాసింజర్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. సర్లా-సాసన్ మధ్య మూడో, నాల్గో రైల్వే లైన్లు, ఝార్సుగూడ-జామ్గా మధ్య నాల్గో రైల్వే లైన్ ప్రాజెక్టులతో పాటు 100 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం "లఖ్పతి దీదీ’’లను మోదీ సత్కరించారు.
స్వయం సహాయక బృందాల (SHGs) సాధికారతపై దృష్టి పెట్టిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. మహిళల వార్షిక ఆదాయం లక్ష రూపాయలకు మించి సాధించడంలో సాయపడుతోంది. దేశంలో 16.60 లక్షల మంది 'లఖ్పతి దీదీ'లను తయారు చేయడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.
ఘన స్వాగతం..
బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఒడిశా గవర్నర్ గణేషి లాల్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, రాష్ట్ర ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, పలువురు క్యాబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరంగ యాత్ర, రోడ్షోలో పాల్గొన్నారు. ప్రధాని కాన్వయ్ ముందుకు సాగుతుండగా రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది ఆయనను చూసేందుకు బారులు తీరారు. 'భారత్ మాతా కీ జై', 'మోదీ జిందాబాద్' అంటూ నినదించారు.