విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
x

విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

మొత్తం మృతులు 265 మంది. 241 మంది ప్రయాణికులు, మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై విమానం కూలడంతో భవనంలోని మరో 24 మంది మృతి


గుజరాత్‌ (Gujarat) రాష్ట్రంలో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయారు. 38 ఏళ్ల రమేష్ విశ్వకుమార్ అనే ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అహ్మదాబాద్‌ (Ahmadabad)‌ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్‌ వెళ్లేందుకు టేకాఫ్ అయిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం.. కొద్ది నిముషాలకే బీజే మెడికల్ కాలేజీ భవన సముదాయంపై కూలిపోవడంతో బిల్డింగ్‌లోని 24 మంది కూడా చనిపోయారు. దీంతో ఈ దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరుకుంది.

ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ (PM Modi) దిగ్భ్రాంతికి లోనయ్యారు. శుక్రవారం ఆయన విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ఆయనకు వివరించారు. ఆయన వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఉన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షా నిన్ననే (గురువారం) ఘటన స్థలాన్ని పరిశీలించారు. DNA పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం మృతదేహాలు సిటీ సివిల్ ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయి.

మృతుల్లో విదేశీయులు కూడా..

విమాన ప్రమాదంలో మొత్తం 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, పోర్చుగల్‌కు చెందిన వారు 7, ఒక కెనడియన్ ఉన్నారు. మృతుల్లో ఇద్దరు శిశువులు, 12 మంది పిల్లలు కూడా ఉన్నారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణిని కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

అసలు ప్రమాదం ఎలా జరిగింది?

అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా (Air India flight) బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం లండన్‌కు బయల్దేరింది. సరిగ్గా మధ్యాహ్నం 1.17 నిముషాలకు టేకాఫ్‌ అయ్యింది. అయితే 5 నిముషాలకే విమానం కూలిపోయింది. సుమారు 800 అడుగుల ఎత్తు నుంచి బీజే మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆకాశంలో దట్టమైన పొగ అలుముకుంది. ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు. కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు పైలెట్ చేసిన మేడే (MAYDAY) కాల్ ATCకి చేరింది. ఆ తర్వాత పైలెట్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ప్రయాణికులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు.

బ్లాక్ బాక్స్ కోసం అన్వేషణ..

విమానంలో ఏర్పాటుచేసిన బ్లాక్ బాక్స్ ద్వారా ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే వీలుంటుంది. దాని కోసం విమానయాన సిబ్బంది ఘటన స్థలంలో వెతుకుతున్నారు.

Read More
Next Story