
‘ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనరాదు’
చర్యలు తీసుకోవాలని సీఎం సిద్ధరామయ్యను కోరిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే..
ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని కర్ణాటక(Karnataka) మంత్రి ప్రియాంక్ ఖర్గే కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) కు లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ఉద్యోగులు RSS కార్యక్రమాలలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఖర్గే వైఖరి బీజేపీని టార్గెట్ చేసినట్లుగా ఉంది.
‘బెదిరింపు కాల్స్ వస్తున్నాయి’..
"గత రెండు రోజులుగా నా ఫోన్ మోగుతూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ సంస్థలలో RSS కార్యకలాపాలను నిషేధించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరా. దాంతో నాకు, నా కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరిస్తే వెనక్కు తగ్గే వ్యక్తిని కాదు నేను," అని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు ఖర్గే.
భద్రత పెంపు?
గుర్తుతెలియని వ్యక్తి తనను దుర్భాషలాడిన విషయాన్ని ప్రియంక్ ఖర్గే సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆయన భద్రత పెంచుతామని చెప్పారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర పేర్కొన్నారు. అక్టోబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను పరిమితం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు .