తెరుచుకున్న అయోధ్య రామ‌దర్బార్ తలుపులు..
x

తెరుచుకున్న అయోధ్య రామ‌దర్బార్ తలుపులు..

స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకే దర్శనం..


Click the Play button to hear this message in audio format

ఉత్తర్ ప్రదేశ్‌(Utter Pradesh)లోని అయోధ్య(Ayodhya) రామాలయం మొదటి అంతస్థులో నిర్మించిన రామదర్బార్ (Ram Darbar) దర్శనానికి భక్తులను శనివారం నుంచి అనుమతిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకుంది.

రామాలయ సముదాయం లోపల మొదటి అంతస్థులో కొత్తగా ఎనిమిది ఆలయాల నిర్మాణం ఇటీవల పూర్తవ్వడంతో ఈ నెల 5న విగ్రహాల ప్రతిష్టోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఎనిమిది ఆలయాల్లో రామదర్బార్‌‌ ఒకటి. ఇక్కడ సీతారామ లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలతో పాటు హనుమంతుడి విగ్రహాలను ప్రతిష్టించారు. రామదర్బార్‌ దర్శనానికి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రెండు గంటలకు ఒక స్లాట్ చొప్పున మొత్తం 6 స్లాట్‌లను అందుబాటులో ఉంచారు. మొదటి స్లాట్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. చివరి స్లాట్ సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. భక్తులు వీలును బట్టి స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా ఉదయం 7 నుంచి 9 వరకు, 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు, 3 నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు స్లాట్లను అందుబాటులో ఉంచామని, ప్రతి రెండు గంటల స్లాట్‌కు 300 పాస్‌లు అందుబాటులో ఉంటాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మెంబర్ అనిల్ మిశ్రా తెలిపారు. రామదర్బార్‌కు సమీపంలోని ఈశాన్య మూలలో శివుడు, ఆగ్నేయ మూలలో గణేశుడు, దక్షిణ భాగంలో హనుమంతుడు, నైరుతి మూలలో సూర్యుడు, వాయువ్య మూలలో భగవతి మరియు ఉత్తర భాగంలో అన్నపూర్ణ దేవి విగ్రహాలను కూడా ప్రతిష్టించారు.

అయోధ్య రామాలయ విశిష్టత..

సాంప్రదాయ నాగర శైలిలో 2.77 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అయోధ్య రామాలయం 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. మూడు అంతస్థుల్లో నిర్మించిన ఈ ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. ప్రధాని మోదీ రామ్‌లల్లా(Ram Lalla) విగ్రహ ప్రతిష్టోత్సవంలో పాల్గొనగా.. దేశవిదేశాల నుంచి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.

Read More
Next Story