ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించారు.


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు. ఢిల్లీలో పలువురు పెద్దలను కలిసేందుకు చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి చంద్రబాబు దిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

అమరావతి, పోలవరం నిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వే జోన్‌ శంకుస్థాపన, సెయిల్‌ లో విశాఖ స్టీల్‌ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం..మంగళవారం ఇంకా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలను కలవనున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాటికి కారణాల గురించి కూడా చంద్రబాబు వారికి వివరించే అవకాశం ఉంది.

ప్రధాన మంత్రిని కలిసిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్విటర్ వేదికగా స్పందించారు. పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాల విషయంలో సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. పోలవరం రివైజ్డ్ ఎస్టిమేషన్ ను ప్రధాని ఆమోదించినట్లు వెల్లడించారు. రాష్ట్ర సమస్యలపై సానుకూలంగా స్పందించిన ప్రధాన మంత్రికి చంద్రబాబు థ్యాంక్స్ చెప్పారు.


Next Story