చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అడుగడుగునా అడ్డు పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షరాలు షర్మిలను, నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు.


రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్‌సీ పోస్టుల భర్తీని దగా డీఎస్‌సీగా మార్చారంటూ చలో సెక్రటేరియట్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపు నిచ్చింది. అయితే పోలీసులు చలో అసెంబ్లీకి ముందు రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులను గృహనిర్భంధం చేశారు. చెలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమారుని వివాహ కార్యక్రమం నుంచి నేరుగా విజయవాడ చేరుకున్న వైఎస్‌ షర్మిలను పోలీసులు బుధవారం రాత్రి గృహ నిర్భంధం చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె నేరుగా విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసైన ఆంధ్రరత్న భవన్‌కు చేరుకుని అక్కడే నిద్రించారు.

గురువారం ఉదయం నుంచి బీసెంట్‌ రోడ్డును పోలీసులు దిగ్బంధించారు. కాంగ్రెస్‌ పార్టీ వారు ఏ రూట్ల నుంచి సెక్రటేరియట్‌కు వెళ్ళాలను కుంటున్నారో ఆ రూట్లన్నీ పోలీసులు దిగ్బంధించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసు నుంచి నాయకులు, కార్యకర్తలను బయటకు రాకుండా నిరోధించారు. అయితే పోలీసులు పహరాను తొలగించుకుంటూ వైఎస్‌ షర్మిల పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్దకు చేరుకున్నారు. పార్టీ కార్యాలయం, పోలీసు కంట్రోల్‌ రూముల వద్ద తీవ్ర ఉధ్రిక్తత చోటు చేసుకుంది. అక్కడి నుంచి ఉండవల్లి మీదుగా సెక్రటేరియట్‌కు కారులో బయలు దేరిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల, మరికొందరు నాయకులను పోలీసులు కరకట్ట ముఖద్వారం వద్ద ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద అరెస్ట్‌ చేశారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ షర్మిలతో పాటు తులసిరెడ్డి, గిడుగు రుద్రరాజు, మరికొందరు నాయకులను అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి కొందరిని దుగ్గిరాల పోలీస్‌ స్టేషన్‌కు, షర్మిలను మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అమ్మ బాధపడుతోంది..
వైఎస్సార్‌ ఆత్మ క్షభిస్తోంది. ఈ ఘటనపై అమ్మ బాధపడుతోంది. వైఎస్సార్‌ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే. సచివాలయంలో వినతిపత్రం ఇచ్చే స్వేచ్చ కూడా మాకు లేదా, సెక్రటేరియట్‌కు సీఎం రాడు, మంత్రులు లేరు, అధికారులు రారు. ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని వైఎస్‌ షర్మిల ఆమె వ్యాఖ్యానించారు.
Next Story