ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ద్వారకా తిరుమలరావు రాష్ట్రంలోని వివిధ కేసులపై స్పందించారు. సీఐడీ, సిట్‌లపైనా ఆయన మాట్లాడారు.


వైఎస్‌ఆర్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్‌ నోటీసు ఉందని, అందువల్లే ఆయనను ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో అడ్డుకోవడం జరిగిందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఈ లుకౌట్‌ నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే స్వతంత్ర విచారణలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసుల పాత్ర కానీ, జోక్యం కానీ ఉండదన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను సుప్రీం కోర్టు అవమానించలేదన్నారు. తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరగాలన్న ఉద్దేశంతోనే ప్రత్యక బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. అయితే ఏపీ సిట్‌ సభ్యులుగా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్‌ పేర్లను పంపామన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులతో పాటు మరో రెండు కేసులను సీఐడీకి బదిలీ చేసినట్లు డీజీపీ చెప్పారు.

Next Story